లక్ష్యం:- ఎం. బిందు మాధవి

 ఇంటికి దగ్గరలో ఉన్న సరస్వతి విద్యాలయంలో ఐదో తరగతి
చదువుతున్నాడు
సూరి
.

దగ్గరే
కనుక
రోజూ
స్కూల్
కి
నడుచుకుంటూనే
వెళతాడు
.

రోజు
కూడా
అలాగే
బయలుదేరాడు
.
తలొంచుకుని
నడుచుకుంటూ
,
మిత్రుల
గురించి
...
షార్ట్
ఇంటర్వల్
లో
ఆడే
బొంగరాలాట
గురించి
ఆలోచిస్తున్నాడు
.
ఇంతలో వెనక నించి "దాని కుడి భుజం మీద కడవా....దాని పేరే సారంగ దరియా" అనే పాట వీలైనన్ని అపశృతులతో డ్రం..బ్యాండ్ మేళంతో వాయిస్తూ ఓ గుంపు వచ్చింది. శబ్దానికి తలెత్తిన సూరి, కుర్రాళ్ళు ఆ పాటకి ఒళ్ళు మరిచిపోయి డ్యాన్స్ చేస్తుంటే చూసి సూరి కూడా అడుగు కలిపాడు.
భుజానికి బ్యాగ్ అలాగే వేలాడుతున్నది. కాళ్ళు పాటకి అడుగులేస్తూ, ఒళ్ళు మెలికలుతిరుగుతున్నది. అలా వారితో కలిసి స్పృహ లేకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో ఆలోచించకుండా ఎగురుతూ వెళుతున్నాడు. ఆ గుంపు ఊరేగింపుగా శ్మశానం వైపు వెళ్ళింది.
చావు సందర్భం లో కూడా డ్యాన్సులు చేస్తూ, డ్రమ్ములు వాయిస్తూ వెళ్ళటం ఇప్పుడు ఆనవాయితీగా మారటం చూస్తున్నాం! అదొక దౌర్భాగ్యం!
ఎండలో ఎగురుతూ, డ్యాన్స్ చేస్తూ అంత దూరం వెళ్ళేసరికి బాగా అలిసిపోయాడు. గుంపు శ్మాశానం లోకి వెళ్ళాక, నీడ కోసం మన సూరి అక్కడ చెట్టు కింద ఉన్న రాతి దిమ్మ మీద కూర్చుని, అలాగే పక్కకి ఒరిగి నిద్ర పోయాడు.
శవ దహనం అయ్యాక, స్నానాలు వగయిరా మిగిలిన కార్యక్రమాలు ముగించుకుని అందరూ ఎవరి దారిన వాళ్ళు పోయారు. సాయంత్రం అయింది. గేట్స్ లాక్ చేశారు. మెలకువ వచ్చిన సూరి పక్కన ఉన్న వాతావరణానికి భయపడి తనెక్కడ ఉన్నాడో..అసలు అక్కడికి ఎలా వచ్చాడో అనుకుంటూ గేట్ దగ్గరకి వచ్చి గట్టిగా పిలిచాడు.
ఆ దారిన స్కూటర్ మీద పోతున్న కాన్ స్టేబుల్ కరీం ఆగి, ఏడుస్తున్న సూరిని చూసి ఆగి "ఎవరు నువ్వు? ఇక్కడెందుకున్నావు?" అనడిగి ఆ శ్మశానం కాపరిని పిలిచి తాళం తీయించాడు.
సూరి భయంగా "పొద్దున్న నేను స్కూల్ కి వెళూతుంటే డప్పులు, డ్యాన్సులు చూసి వీళ్ళ వెనక వచ్చేశాను. ఇక్కడికొచ్చింది కుడా చూడలే సర్. అగో ఆ చెట్టు కింద పడుకుంటే నిద్ర పట్టేసింది. ఆకలేస్తోంది సర్" అన్నాడు.
కరీం సూరికి దారిలో తినటానికి పెట్టించి, ఇంటి దగ్గర దింపడానికి వెళ్ళాడు. సూరి స్కూల్ కి రాలేదని, వాడి సహాధ్యాయి వెంకట్ మధ్యాహ్నం ఇంటికొచ్చాక వాళ్ళమ్మ కి చెప్పాడు.
ఫ్రెండ్స్ అందరి ఇళ్ళల్లోను వెదికి, పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి వాకిట్లో ఏడుస్తూ కూర్చుంది.
పోలీసుతో కలిసి వచ్చిన కొడుకుని ముందుగా ఉద్వేగం ఆపుకోలేక కౌగిలించుకుని ముద్దులు పెట్టి "ఓరి నాయనో ఎక్కడకి పోయావురో! నువ్వు లేక పోతే నా బతుకేమయ్యేదో? లేక లేక పుట్టినోడివిరా!" అని గుండెలు బాదుకుంటూ, కోపం ఆపుకోలేక వీపు మీద రెండు తగిలించింది.
"పిల్లలింతే! ఆ పంజాగుట్ట శ్మశానం దగ్గర భయంగా అరుస్తుంటే చూసి తెచ్చానమ్మా! పిల్లాడిని భయ పెట్టక, దగ్గర తియ్యండమ్మా! పిల్లలు అల్లరి చెయ్యకపోతే మనం చేస్తామా" అని ఆమెని ఉరుకోపెట్టి తన దారిన తాను వెళ్ళాడు, కాన్ స్టేబుల్ కరీం.
*******
సూరి వాళ్ళింటికి దగ్గరలో ఉండే ఆ స్కూల్ సోషల్ టీచర్ అనసూయకి విషయం తెలిసింది. మరునాడు క్లాసులో పాఠం చెబుతూ రెండో బెంచ్ లో కూర్చునే నవీన్ దగ్గర ఆగి "పిల్లలూ ఈ నెల అసైన్ మెంట్ పరీక్షకి బాగా చదివారా" అనడిగి చేతిలోకి అతని పుస్తకం తీసుకుంది. పేజిలు తిరగేస్తూ "ఓహో...నవీన్ బుక్ లో ఆంజనేయ స్వామి ఫొటో పెట్టుకున్నావు, నీకు బాగా నమ్మకమా" అనడిగారు.
"అవును టీచర్! పరీక్షల ముందు హనుమకి తప్పకుండా గుడికెళ్ళి దణ్ణం పెట్టుకుంటాను" అన్నాడు. "మీలో ఇంకెవరెవరికి ఏ ఏ దేవుళ్ళు ఇష్టం" అనడిగారు.
ఎక్కువ మంది ఆంజనేయ స్వామి, కొంతమంది వినాయకుడు, మరి కొందరు సరస్వతీ దేవి అని చెప్పారు. "సరే ఆంజనేయ స్వామి ఇష్టమయిన వారికి ఒక కధ చెబుతాను. మీలో అందరికీ రామాయణం, అందులో హనుమ ఎక్కడ ప్రవేశిస్తాడో తెలుసా" అనడిగారు.
అందరూ ఉత్సాహంగా ఎవరికి తెలిసింది వారు చెప్పారు.
"సరే ఇప్పుడు నేను ఆయనలో ఉండే ఒక గొప్ప లక్షణం చెబుతాను వినండి. వానరులు సీతాన్వేషణ కోసం నాలుగు దిక్కులకి బయలు దేరినప్పుడు, హనుమ దక్షిణ దిక్కుకి బయలుదేరాడు. ఆయన తప్పక సీతని వెదకగలడు అనే నమ్మకంతో రామచంద్ర మూర్తి తన ఉంగరాన్ని అతనికిచ్చి, తన సందేశాన్ని పంపించాడు. అలా బయలుదేరిన హనుమ సముద్రం మీద ఎగురుతూ ఉండగా, దారిలో మొదటి ప్రతి బంధకంగా మైనాకుడు అనే పర్వతం సముద్రంలో నించి బయటికి వచ్చి, నా మీద ఆగి కాసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పాడు. "నేను మీ తండ్రికి స్నేహితుడిని. నీకు ఆతిధ్యం ఇమ్మని సముద్రుడు నాకు ఆదేశం ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఎలాగయినా నా మీద ఆగి విశ్రాంతి తీసుకోవలసిందే" అని పట్టుబట్టాడు.
"నేను రామ కార్యం మీద వెళుతున్నాను. ఇప్పుడు నా "లక్ష్యం" సీత జాడ కనిపెట్టటమే! అప్పటి వరకు విశ్రమించటం అనేది జరగదు" అని చెబుతాడు. మైనాకుడు ఇంకా ఆయన్ని వదలకుండా "నా మీద ఉన్న చెట్ల నించి పళ్ళు కోసుకు తిని కాసేపు విశ్రాంతి తీసుకో" అని చెబుతాడు.
"రాముడు విడిచిన బాణం ఎలా లక్ష్యం చేరే వరకు ఆగదో, ఆయన పని మీద బయలుదేరిన నేను కూడా ఆయన విడిచిన బాణం లాంటి వాడినే! లక్ష్యం చేరి తీరుతుంది, మధ్యలో ఆగదు, పడిపోదు" అని ధీమాగా చెబుతాడు.
"భేష్, తలపెట్టిన పని మీద నీ పూనిక తెలుసుకోవటానికే నీకు ఈ పరీక్ష పెట్టాను. విజయోస్తు" అని మైనాకుడు దీవించి పంపాడు.
"సూరీ... నిన్న నువ్వు స్కూల్ కి రాలేదు కదా! ఎక్కడికెళ్ళావో, ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో, ఈ కధ నించి నీకు అర్ధమయిందనుకుంటాను" అని సూరిని భుజం మీద తట్టి "ఇలాంటి కధల నించి ప్రేరణ పొంది నేర్చుకోవలసినవి ఎన్నో ఉంటాయి పిల్లలూ! రేపు మరొక కధ చెప్పుకుందాము అని క్లాస్ ముగించి బయటికెళ్ళారు, అనసూయా టీచర్.
కామెంట్‌లు