అనగనగా ఒక పెద్ద అడవి . అందులో జింకలు , మేకలు, గాడిదలు , కోతులు రకరకాల జంతువులు ఉన్నాయి . అవి హాయిగా అడివంతా తిరుగుతూ , ఆడుకుంటూ పాడుకుంటూ, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ, కాలం గడుపుతున్నాయి . అలాగే ఉంటే కథ ఏముంది . అందుకే ఉన్నట్లుండి ఆ అడవికి ఒక మాయా సింహం వచ్చింది . మాయా సింహం అంటే ….. అది ఎవరికీ కనపడదు . కానీ దానికి వెనక కాళ్ళు లేవు. అందుకని అది ఆహారాన్ని వెతికి పట్టి తినలేదు. అది ఎవ్వరికీ కనపడదు కదా , అందుకని దగ్గరకి వచ్చిన జంతువులను పట్టి తినేస్తుంది . ఒక్క జంతువుని తిన్నదా , ఇంక దానికి నెల రోజుల శక్తి వచ్చేస్తుంది . శరీరం సైజు కూడా పెరుగుతుంది . దాంతో మరొక జంతువును తేలికగా చిక్కించుకుంటుంది .
అలా ఆ మాయా సింహం చాలా జంతువులను తినేసింది . పాపం జంతువులన్నీ ఏడుస్తూ , ఈ సమస్య ని ఎలా పరిష్కరించాలో తెలియక ఆలోచన లో పడ్డాయి .
వాటికి ఒక ముని కనిపించి , జాలి పడి ఉపాయం చెప్పాడు . 'ఆ సింహం మీకు కనపడదు , అందుకే మీరు దానికి చిక్కుతున్నారు . కానీ దానికి వెనక కాళ్ళు లేవు. అది మీ వెంట పడలేదు . మీరే తెలియక దాని దగ్గరకు వెళ్లి ఆహారం అయిపోతున్నారు . ఒక్క జంతువు ని అది తింటే, దానికి నెల రోజుల శక్తి వస్తుంది . అసలు ఆహారమే దొరకక పోతే ఒక్క నెల రోజులలో అది చస్తుంది . కాబట్టి , ఒక నెల రోజులు మీరంతా బయట తిరగకుండా , పొదల్లోనే దాక్కోండి . ఒక్క జంతువు కూడా సింహానికి దొరకకూడదు మరి'. అని చెప్పి వెళ్ళిపోయాడు.
అన్ని జంతువులూ అలాగే అని చెప్పి , వెళ్లి పొదల్లో దాక్కున్నాయి . పది రోజులైంది . సింహం శక్తి తగ్గిపోయింది . 'అరె , ఎవరూ దొరకటం లేదేమిటి ' అని డీలా పడింది . నీరస పడింది . దాని సైజు తగ్గి పోయింది . కానీ కదల లేదు కదా . అలాగే చూస్తోంది , ఒక్క గాడిద అయినా దొరకదా అని . గాడిద అంటే పాపం తెలివి కొంచెం తక్కువ కదా అని ఆశ పడింది .
అది ఆశ పడ్డట్లే , గాడిదలు కొంచెం తలలు బయట పెట్టి చూస్తున్నాయి . నెల రోజులు కాకుండానే, వాటికి చిరాకొచ్చింది . హాయిగా తిరగటానికి ,తినటానికి లేకుండా పోయింది . ఈ సింహం చచ్చే ఉంటుంది అని బయటకి వచ్చాయి. వాటిని చూసి, కొన్ని జింకలు, కోతులు కూడా వచ్చాయి . చాలా సేపు హాయిగా ఆడుకున్నాయ్ . తిన్నాయ్ . నవ్వుకున్నాయ్ . చచ్చింది సింహం అనుకుని , కనపడని సింహం దగ్గరగా వచ్చాయి . ఇంకేముంది , సింహం ఒక జంతువుని గుటుక్కుమని ఆరగించింది . దానికి బోల్డు శక్తి వచ్చింది. సైజు పెరిగింది. మరొకటి మరొకటి అలా చాలా జంతువులను తినేసింది . శక్తి బాగా పెరిగి , పేద్ద సింహం అయిపొయింది. ఇంకేముంది లబో దిబో మని జంతువులన్నీ ఏడవటం మొదలు పెట్టాయి. సింహం మాత్రం హాయిగా నవ్వుకుంది.
మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, పిల్లలూ, అర్థమైందా .... ఆ సింహం పేరు కరోనా. ఒక్క నెల రోజులు ఏ ఒక్కరూ దానికి చిక్కకుండా, మాస్క్ పెట్టుకుంటూ, చేతులు శానిటైజ్ చేసుకుంటూ, భౌతిక దూరం పాటిస్తూ, ఉన్నామంటే, అది చస్తుంది. అందరూ ఒక్క మాటగా, ఓర్పుగా నియమాలు పాటించాలి . అప్పుడే కరోనా పోతుంది . ఒక్కరు తప్పు చేసినా అది మనుష్యులను వదల కుండా తిప్పలు పెడుతుంది.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి