బలవంతుల పద్ధతి;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322
 బలవంతుడు బలహీనుడిని కట్టు బానిసగా ఉపయోగించుకోవడం  అనూచానంగా వస్తున్న ఆచారమే. వాడు చేయలేని దురాగతాలు ఏమీ వుండవు. సమాజంలో వారిని ఎదిరించే శక్తి సామాన్యునకు లేదు. దానితో వారి ఆటలు సాగుతాయి. అతనికి సమానంగా మరొకడు వచ్చి  ఆ అవకాశాన్ని తీసుకుంటాడు. అయినా ఇబ్బంది పడేది మాత్రం సామాన్యుడే. సముద్రంలో గానీ, నదిలో కానీ చెరువులో కానీ ఒక చేప  దానికి దొరికిన చిన్న చిన్న ప్రాణులను తింటూ కాలక్షేపం చేస్తోంది. చేపపిల్లలు గుంపులు గుంపులుగా ఉంటాయి  వాటిని తిని తమ ఆకలిని తీర్చుకుంటాయి. ఆ చేప  పెరిగిన తరువాత  జాలరి ఆ చేపల్ని పట్టి తాను తింటాడు. తను ఏది చేసి తన కడుపు నింపు కున్నదో అదే పని  దానికన్నా బలవంతుడు చేస్తాడు. ఒక చేపను ఒక స్వార్థపరుడుని ఒకే గాటన కట్టి  స్వార్థంతో, అధికార బలంతో, శారీరక శక్తితో ఎదుటి వారిని హింసించి ప్రాణాలు తీసి తమ కడుపు నింపుకుంటున్నారు. వారి కడుపులు కొట్టడానికి ప్రకృతి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కనుక ఆశపడక మీ కష్టార్జితంతో నీకున్న ఆస్తిపాస్తులతో సంతృప్తిగా జీవితాన్ని కొనసాగించమని చెప్పడానికి  మహనీయుడు వేమన ఈ పద్యాన్ని మనకందించాడు. ఈ పద్యాన్ని చదివితే, ఎంత మందిని మానసిక అధ్యయనం చేసి  చెప్పాడో అని ఆశ్చర్య పోక తప్పదు. కావాలంటే మీరూ ఆ అనుభూతి చెందండి ఈ పద్యం చదివి.

"ఒకరి నోరుకొట్టి యొకరు
వారి నోరుమెత్తి వరుసగొట్టు
చేప పిండు నేల, చేపలు చంపును
జనుడు చేప పిండు జంపు వేమ..."



కామెంట్‌లు