మాతృభాషలో విద్యాబోధన:-సి.హెచ్.ప్రతాప్
 కర్ణాటక ,తమిళనాడు రాష్ట్రాలు ఇటీవల ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే ఆంగ్లాన్ని విద్యాబోధన మాధ్యమంగా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాలు రెండూ ప్రాథమిక విద్య నుంచే ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడుతున్నాయి. అందుకు అనుగుణంగా, వచ్చే  విద్యా సంవత్సరం నుండే ఆంగ్ల మాద్యమంలో బోధన ప్రారంభించటానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. జపాన్‌, ఐర్లాండ్‌, పోలాండ్‌, ఫిన్లాండ్‌, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరుగుతోంది.
శిశువు తాను పుట్టినప్పటి నుండి తన తల్లిదండ్రులు మరియు ఇరుగుపొరుగు వారి నుండి ఏ భాషను వింటూ, ఏ ఇబ్బంది లేకుండా తన్మయత్వంగా నేర్చుకుంటూ ఉంటాడో, ఆ భాషను మాతృభాషగా పరిగణించవచ్చు. మనం మొట్టమొదట నేర్చుకునేదీ, బాగా ఎక్కువగా మాట్లాడేదీ, ఎక్కువ సందర్భాల్లో వినియోగించేదీ, భావావేశ, లేదా హృదయా నుగత సంబంధం కలిగినదీ, లెక్కించడం, ఆలోచించడం, కలలు కనడం లాంటి వాటికి ఉపయోగించేదీ మాతృభాష. ప్రపంచవ్యాప్తంగా విద్యావేత్తలు ఏ విజ్ఞాన శాస్త్రం నేర్చుకోవడానికైనా, పరాయిభాష నేర్చుకోవడానికైనా మాతృభాషా మాధ్యమమే సరైనదని చెబుతున్నారు.కన్వెన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్ (సిఆర్‌ఎస్) ఆర్టికల్ 29, 1ఓ సెక్షన్ 269లో ఆర్టికల్ 29 ప్రకారం మాతృభాషలోనే నేర్చుకునే తెవివితేటలు ఎక్కువగా వుంటాయని స్పష్టం చేశారు. అందుకని దాని ద్వారా ప్రపంచంలోకి చూసే హక్కు పిల్లలందరికీ వుందని నిర్ధారిస్తున్నాయి. 
2010లో భారత ప్రభుత్వం తెచ్చిన విద్యాహక్కు చట్టం విభాగం 29(2)లో ఎలిమెంటరీ స్థాయిలో వీలైనంతవరకు మాతృభాషా మాధ్యమాన్నే అమలు చేయాలని నిర్ధేశించింది. నూతన జాతీయ విద్యా విధానం (2020) కూడా ఐదవ తరగతి వరకు మాతృభాష లోనే బోధన జరగాలి అని చెబుతోంది. మాతృభాషలో విద్యా బోధన వల్ల విద్యార్థికి బోధన అంశం సమగ్రంగా అర్థమవుతుంది. నైపుణ్యాలు పెరుగుతాయి. మాతృభాషలో అభ్యసనం విద్యార్థులకు వినయవిధేయతలను అందిస్తుంది. ఐక్యరాజ్యసమితి 2019 సంవత్సరాన్ని అంతర్జాతీయ స్వదేశీ భాషల సంవత్సరంగా ప్రకటించింది. కనుమరుగయ్యే స్థితిలో ఉన్న భాషలను పరిరక్షించుకోవాలన్నది దానర్థం. తల్లిదండ్రులు కూడా ఆ దిశగా ఆలోచించి సహకరించాలి.మాతృభాషా మాధ్యమానికి ప్రాధాన్యతనిస్తూ దాని వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేసి మాతృభాషా మాధ్యమంలోనే విద్యా బోధన జరిగేటట్లు ప్రభుత్వం, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ఆ విధంగా చేసినప్పుడే భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాతృభాషలు మనగలుగుతాయి

కామెంట్‌లు