విద్యాహక్కు పరిరక్షణ :-సి.హెచ్.ప్రతాప్
 ప్రపంచంలో సుమారు 8 0కోట్ల మంది నిరక్షరాస్యులు ఉండగా అందులో 23.8 కోట్ల మంది మనదేశం లోనే ఉన్నట్లు ఇటీవల ఐక్య రాజ్య సమితి తన నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ వయసు పిల్లలు 92 లక్షల మంది పాఠశాల చదువులకు వెలుపలే ఉండిపోతున్నారు. పాఠశాలల్లో చేరని, లేదా మధ్యలోనే చదువు మానేసిన వీరందరినీ తిరిగి చదువుల బాట పట్టించటం విద్యాహక్కు చట్టం ముఖ్యోద్దేశం. విద్యను బాలల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ 2009 సంవత్సరంలో విద్యా హక్కు చట్టం చేశారు. ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టాల తరహాలో ఇది అమలు చేయాలి. 6-14 ఏళ్ల మధ్య వయసు బాలబాలికలందరూ తప్పనిసరిగా పాఠశాలల్లో చేరి చదువుకునేలా చూస్తూ, వారికి ఉచిత విద్య అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఈ చట్టం వుంచింది. అదేవిధంగా ప్రైవేటు విద్యాసంస్థలలో ఆర్థికంగా వెనుకబడిన బలహీన వర్గాలకు 25% రిజర్వేషన్లు కల్పించాలని నిర్దేశించింది. అతియ్తే ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక ప్రకారం దేశంలో విద్యా హక్కు చట్టం సక్రమంగా  అమలవడం లేదని స్పష్టమౌతొంది. తెలుగు రాష్ట్రలలో సగటున  విద్యార్థుల అడ్మిషన్లను ప్రభుత్వ పాఠశాలలతో పోలిస్తే ప్రైవేటు పాఠశాలలో 52% అధికంగా ఉంది. ప్రైవేటు విద్యాసంస్థలలో ప్రభుత్వం ఆర్థికంగా వెనుక బడిన వర్గాలకు కల్పిస్తున్న 25% రిజర్వేషన్లు అమలు కావడం లేదని అనేక ఆరోపణలు వస్తున్నాయి. రిజర్వేషన్ల అమలు పర్యవేక్షణకు సరైన అధికార యంత్రాంగం లేదు.
కానీ ఈ చట్టం నిబంధనలు బేఖాతరు చేస్తూ డొనేషన్, అడ్మిషన్ ఫీజులను ఇబ్బడిముబ్బడిగా వసూలు చేస్తున్నాయి. అలాగే సెక్షన్ 18 ప్రకారం గుర్తింపు లేకుండా ప్రైవేట్ పాఠశాలలు నడపరాదు. అలా నడిపితే ఈ చట్టం నిబంధనల ప్రకారం జరిమానాలు వసూలు చేయవచ్చు. కానీ చాలా గ్రామీణ ప్రాంతాలలో, మారుమూల ప్రాంతాల్లో ప్రైవేట్ పాఠశాలలు నెలకొల్పుతూ ఎలాంటి అనుమతులు లేకుండా పాఠశాలలను నడుపుతున్నారు. దీనిపై ప్రభుత్వాల సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు.
రాజ్యాంగం నిర్దేశించినట్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ప్రాథమిక విద్య నుండి సెకండరీ విద్య వరకు నిరుపేదలకు 25% రిజర్వేషన్లు పకడ్బందీగా అమలు చేసి పేద బాల బాలికలకు నాణ్యమైన విద్యను అందించవలసిన అవసరం ఉంది. 

కామెంట్‌లు