లింగాపూర్ జగదాంబ దేవి జాతర:- రాథోడ్ శ్రావణ్ లెక్చరర్ -ప్రభుత్వం జూనియర్ కళాశాల గుడిహత్నూర్ 9491467715

 🔹 చారిత్రకు నిదర్శనంగా నిలిచే కొమరంభీం జిల్లా 
లింగాపూర్ మండల కేంద్రంలో 
లంబాడీ గిరిజనుల ఆరాధ్య దేవత అయిన  మాతా జగదాంబ దేవి జాతర  పూజ ప్రారంభమయ్యాయి.
🔷బుధవారం సాయంత్రం గ్రామంలోని జగదాంబ దేవి ఆలయంలో  ఆలయ పూజారి రామావత్ మంగులాల్ మహారాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
🔷గ్రామస్థులు, మహిళలు తమ సాంప్రదాయ దుస్తుల్లో నృత్యం చేస్తూ, భక్తి, శ్రద్ధలతో దేవుని సన్నిధిలో 
భజన పాటలు పాడుతుంటే ఆలయ ప్రాంగణం మార్మోగింది.
🔹ఇందుకు తగ్గట్లుగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు శాఖ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
లంబాడీ గిరిజనుల ఆరాధ్య దైవంగా భావించే సంత్ సేవాలాల్ మహారాజ్  జగదాంబ దేవి భక్తుడు. జగజ్జనని మాతా జగదాంబ దేవి చల్లని చూపులతో భక్తుల కోర్కెలు తీర్చే శక్తి స్వరూపిణిగా పూజలు అందుకుంటోంది. జగదాంబ దేవి ధైర్యానికి, శక్తికీ,తెజస్సుకు ప్రతీకగా భక్తులు భావిస్తారు. ఆమెను దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని   
భక్తుల నమ్మకం. అత్యంత శక్తిమంతమైన అమ్మ జగదాంబ దేవికి లంబాడీ గిరిజనులు మంగళవారం రోజున జంతు బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.  
విశేష  పూజలు జరిగే ఈ ఆలయాన్ని జిల్లా నలుమూలల నుంచి లక్షలాది  మంది దర్శించుకుంటారు.
🔹స్థలపురాణం
స్థలపురాణం ప్రకారంగా లింగాపూర్ తాండ వాసులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారట. ఒక రోజు  మధ్యాహ్నం సమయంలో   అనుకోకుండా ఒక్కేసారి గ్రామమంతా మంటలు చెలరేగి వారు నివాసం ఉండే   పురి గుడిసెలకు అంటున్నాయట . మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందట.మంటలు క్షణాల్లో ఒక  ఇంటి నుండి మరో ఇంటికి వ్యాపించడంతో  తాండ మొత్తం కాలిపొయి   ఇంట్లోని వస్తువులన్నీ పూర్తిగా దగ్ధమైందట.
ఇలా ఎండాకాలం వస్తే ప్రతి ఏటా ఈవిధంగా తాండలో ఉన్న 
 పురి గుడిసెలు మంటలకు కాలి బూడిద కావడం ,నిరుపేద గిరిజన కుటుంబాల అస్థి పాస్తులకు నష్టం వాటిల్లేదట. తాండలో  నివాసం ఉండే ప్రజలు కూడా వివిధ రకాల వ్యాధులు సోకి చనిపోయే వారట . ఈ విధంగా వరుస సంఘటనలు చోటు చేసుకోవడంతో 
  భయబ్రాంతులకు గురి అయిన తాండ వాసులు తాండ నుండి కొందరు  వలస వెళ్ళడంతో
 అలోచించన  తాండ పెద్దలు 
1974 లో  బంజారాల కాశీ పోహ్రాదేవి పీఠాధిపతి అయిన నిర్గుణ నిరాకారి,  బాల బ్రహ్మచారి సంత్ రామారావు మహారాజ్ వద్దకు వెళ్ళి విన్నవించారట.అప్పుడు సంత్ రామారావు మహారాజ్  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ తాలుకాలోని  లింగాపూర్ గ్రామాని  సందర్శించి, తాండ వాసుల్లో మనోధైర్యం నింపి గ్రామస్థులతో ఒక మాట అన్నారట.మీ తాండ కుడి వైపు ఉన్న విశాలమైన స్థలంలో ఒక ఆవు తన బిడ్డకు పాలు ఇస్తుంది.ఆదే స్థలం గుడి నిర్మాణం కోసం  పరిశీలించాలని చెప్పడంతో వారు వేళ్ళి చూసే సరికి నిజంగా ఆవు తన దూడకు పాలు ఇస్తుందట.ఆదే చోట స్వయానా మహారాజ్  తన కరకమలంతో 
జగన్మాత అయిన  జగదాంబ దేవికి పూజలు చేసి కొబ్బరి కాయ కొట్టి జాతర ప్రారంభించారట . అప్పుటి నుండి గ్రామస్థులు  జగదాంబ దేవి పురి గుడిసెలతో ఆలయం నిర్మించి,  పూజలు చేయడంతో తాండ వాసుల కష్టాలు తొలగిపోయి, సుఖసంతోషాలతో జీవించడం ప్రారంభించారట.
ఇలా ఆనందంగా  జీవిస్తూ అందరూ చేయి చేయి కలిపి ఇటుకలు సిమెంట్ తో
 గుడి నిర్మాణం గావించి పూజలు చేయడం ప్రారంభించారు.  అప్పటి నుంచి ప్రతి ఏటా పుష్య మాసంలో జగదాంబ దేవి  జాతర నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది.
🔹పూజలు
చారిత్రక నేపథ్యం కలిగిన మాతా జగదాంబ దేవి అమ్మవారి జాతర ఉత్సవాలు 
మాఘ మాసం ముగింపు పుష్యమాసం ఆరంభంలో వైభవంగా నిర్వహిస్తారు. మహిళలు అధిక సంఖ్యలో సాంప్రదాయ దుస్తుల్లో జల కళసం  తీసుకుని రాగా, తాండ పెద్దలు  భజనలు కీర్తనలు చేస్తూ, భక్తి శ్రద్ధలతో  ఆలయానికి చేరుకుంటారు. 
సంత్ సేవాలాల్ మహరాజ్
,జగదాంబ దేవి  భజన కీర్తనలతో ఆ ప్రాంతం మారుమోగుతోంది. మహిళలు  తమ సాంప్రదాయ నృత్యాలు చేస్తూ ముందుకు సాగుతూ సాయింత్రం ఐదు గంటల ప్రాంతంలో జగదాంబ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.ఆలయ పుజారి రామావత్ మంగులాల్ మహారాజ్ తాండ నాయకుల చేతుల మీదుగా అమ్మవారికి మహాపూజ, హారతి భోగ్ భండారో నిర్వహించి భక్తులకు ప్రసాదాలు వితరణ చేసి జాతర ప్రారంభిస్తారు.అనంతరం ఆలయానికి భక్తులు తాకిడి ప్రారంభమవుతుంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో చేరుకొని అమ్మ వారికి దర్శించుకొని మొక్కులు చెల్లిస్తారు.
🔹జాతర ఉత్సవాలు 
ప్రతి సంవత్సరం పుష్య అమావాస్య మాసంలో  రెండు వారాల పాటు వైభవంగా జాతర కొనసాగుతుంది. ఈ జాతర సందర్భంగా అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది.
జాతరలో తినుబండారాలు, మిఠాయి దుకాణాలు,  రంగులరాట్నం, సర్కస్, చిన్న పిల్లల ఆటవస్తువులు బోమ్మలు, గాజుల దుకాణాలు, కుంకుమ దుకాణాలు , బంజారా సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన వస్త్రాలు, ఆభరణాలు,  తదితర దుకాణాలతో‌ పాటు హోటళ్ళు,మెస్ లు, ఫాస్ ఫుడ్ సెంటర్లు, మినీ వాటర్ ట్యాంకులు , విద్యుత్ సౌకర్యం సంబంధించిన శాఖా వారి అధ్వర్యంలో ఏర్పాటు చేస్తారు. 
జాతరలో కబడ్డీ, వాలీబాల్, కుస్తీ పోటీలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించి   విజేతలకు నగదు బహుమతులు ప్రదానం చేస్తారు. పోలీసులు శాఖ వారి ఆధ్వర్యంలో  జాతరలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తారు.
🔹 భజన కీర్తన కార్యక్రమాలు  
అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ప్రతి రోజూ సాయంత్రం సమయంలో 
 భజన, కీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు. జాతర సందర్భంగా భజన, కీర్తనలు చేసే గాయకులకు ఆహ్వానించి  భక్తి పాటలు , రామాయణం మహాభారతం కథల కార్యక్రమాలు 
నిర్వహిస్తారు.  భక్తి పాటలు వినడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుందని సమాజం చేడు వ్యసనాలకు 
దూరంగా ఉండాలని భజన కీర్తనలు ద్వారా గాయకులు శ్రోతలకు హితబోధ చేస్తారు.గాయకులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించి బహుమతులు ప్రదానం చేస్తారు.
🔹దహీ హండీ వేడుకలు  
జాతర చివరి రోజు ముగింపు సందర్భంగా పుష్య పౌర్ణమి రోజున  అత్యంత గొప్ప దహీ హండీ  వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
 
🔹ఎలా చేరుకోవచ్చు
ఈ జగదాంబ దేవి జాతరకు వచ్చే భక్తులు బస్సులో ఆదిలాబాదు ,నిర్మల్,
మంచిర్యాల జిల్లాల నుంచి వచ్చే భక్తులు ముందుగా కొమరంభీం జిల్లా జైనూర్ మండలానికి చేరుకోవాలి. జైనూర్ నుండి లింగాపూర్ మండల కేంద్రము సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
 ఆదిలాబాద్ జిల్లా, నుండి లింగాపూర్, 90 కిలోమీటర్లు, ఆసిఫాబాద్ జిల్లా నుంచి 70 కిలోమీటర్లు దూరం ఉంటుంది.
బస్సులో కానీ ఇతర ప్రైవేటు వాహనాల్లో గాని చేరుకోవచ్చు.

కామెంట్‌లు