బహుమతి విలువ : సరికొండ శ్రీనివాసరాజు
   మహేంద్ర 9వ తరగతి చదువుతున్నాడు. మహేంద్ర తల్లిదండ్రులు ధనవంతులు.  అందుకే మహేంద్ర తరచూ ఖరీదైన దుస్తులు వేసుకుని పాఠశాలకు వచ్చేవాడు. కొంతమందితోనే స్నేహం చేసేవాడు. కొందరితో అసలే మాట్లాడకపోయేవాడు. చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు టీవీలకు, మొబైల్ ఫోన్లకు బానిస అయినాడు.  చదువు పూర్తిగా పక్కన పెట్టాడు. ఆట పాటలు అసలే లేవు. తల్లిదండ్రులకు పెద్ద దిగులు పట్టుకుంది.  
      ఈసారి మహేంద్ర పుట్టినరోజు చాలా ఘనంగా చేసుకోవాలని అనుకున్నాడు.  స్నేహితులను చాలామందిని పుట్టినరోజుకు ఆహ్వానించాడు. పెద్ద ఎత్తున స్నేహితులు వచ్చారు. సీల్డ్ కవర్లలో బహుమతులు చాలా వచ్చాయి.  పుట్టిన రోజు  తర్వాతే ఆ కవర్లను విప్పి చూడాలని షరతు విధించారు.  పుట్టినరోజు వేడుకల అనంతరం అందరూ వెళ్ళిపోయారు. సతీశ్ ఒక్కడే మిగిలాడు.
       బహుమతి కవర్లను విప్పి చూడగా రకరకాల నీతి కథల పుస్తకాలు.  ప్రాణ స్నేహితుడైన సతీశ్ ఇలా అన్నాడు.  "చూడు మహేంద్ర! విలువైన సమయాన్ని చాలా వృథా చేస్తున్నావు. సెల్ ఫోన్లకు, టీవీలకు బానిసలు అయితే భవిష్యత్తు అంతా అంధకారమే. విలువైన ఆ సమయాన్ని నీతి కథల పుస్తకాలుకు కేటాయిస్తే ఎన్నో నీతులను మనం గ్రహించి,  మన భవిష్యత్తుకు బంగారు బాటలను వేసుకుంటాము. ఈ కథల పుస్తకాలు అన్పీ చదవడం పూర్తి అయ్యేదాకా నీకు మరో ప్రపంచమే లేదు.  వినకుంటే మనిద్దరి స్నేహానికి రాం రాం." అన్నాడు సతీశ్.  స్నేహితుడు చెప్పినట్లు విన్నాడు మహేంద్ర. నిరంతర పుస్తక పఠనం వల్ల మహేంద్ర ప్రవర్తనలో మార్పు వచ్చింది.  గర్వం పూర్తిగా కరగిపోయింది.  మంచి స్నేహితులను సంపాదించుకున్నాడు. మంచి లక్షణాలను అలవరచుకున్నాడు. ఆపదలో ఉన్న స్నేహితులకు సహాయం చేస్తున్నాడు. చక్కగా చదివి,  మంచి ప్రయోజకుడు అయ్యాడు.  
    

కామెంట్‌లు