అగ్నికి ఆరాధన, వాయువుకు గౌరవాలే భోగి పిడకల ఆవశ్యకత

 భోగి మంటలో పేడ పిడకలు వేయడం ద్వారా గాలిలో శుద్ధి ఏర్పడునని, అగ్నిదేవునికి ఆరాధించినట్లవుతుందని, వాయుదేవునికి గౌరవించడమేనని పాత పొన్నుటూరు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు అన్నారు. పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలలో భాగంగా విద్యార్ధులతో భోగిమంట వద్ద ఆయన మాట్లాడారు. సూర్యుడు మకరరాశిలోకి సంక్రమణం అనే ప్రవేశాన్ని పురస్కరించుకొని మకరసంక్రాంతిగా పిలుచుకుంటున్నామని, సంక్రాంతికి ముందు రోజు ఒక సాంప్రదాయకంగా ఈ భోగిమంటలు వేస్తున్నామని కృష్ణారావు అన్నారు. ఉపాధ్యాయులు అందవరపు రాజేష్ మాట్లాడుతూ దక్షిణాయాయంలో మనం ఎదుర్కొనే కష్టాలను ఈ భోగిమంటకు ఆహుతినిచ్చీ, సౌఖ్యానికి పరమార్థమైన భుగ్ ని ఆహ్వానించడంతో ఈ మాటకు భోగిమంట అని పిలుచుకుంటున్నామని అన్నారు. ఉపాధ్యాయులు బూడిద సంతోష్ కుమార్ మాట్లాడుతూ పేడ కలిసిన మంట వలన గాలిలో ప్రాణవాయువు విడుదలౌతుందని సూక్ష్మక్రిములు నశిస్తాయని, చలికాలపు శ్వాస సంబంధిత వ్యాధులను నిర్మూలించేలా ఈ భోగి మంట ఔషధంలా పనిచేస్తుందని అన్నారు. ఉపాధ్యాయులు పైసక్కి చంద్రశేఖరం మాట్లాడుతూ రావి, మామిడి, మేడి వంటి చెట్ల కలపను ఈ పేడపిడకలతో పాటు భోగిమంటలో వేయడం ద్వారా లభించే ఆ వెచ్చదనం వలన శరీరంలో డెబ్బది రెండువేల నాడులు పరిశుభ్రత పొందుతాయని, మానసిక వికాసానికి దోహదపడతాయని అన్నారు. ఉపాధ్యాయని యిసై సౌజన్యవతి మాట్లాడుతూ శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందే సందర్భానికి సూచికగా ఈ భోగి పండుగ జరుపుకుంటున్నామని అన్నారు. ఉపాధ్యాయులు బొమ్మాళి నాగేశ్వరరావు మాట్లాడుతూ శ్రీకృష్ణుడు ఇంద్రునికి గుణపాఠం నేర్పే సందర్భముగా గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన రోజు కూడా ఈ భోగి పండుగ రోజేనని ఆయన గుర్తు చేశారు. శాపవశంగా బసవన్నను భువికి పంపి, రైతుల పాలిట దైవంగా కొలిచే నేపథ్యంలో ఈ ఆవు పేడపిడకలు ప్రాధాన్యం సంతరించుకున్నాయని అన్నారు. ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు మాట్లాడుతూ శ్రీవిష్ణువు పాతాళానికి తొక్కి బలిచక్రవర్తిని పాతాళరాజుగా మార్చిననూ, ప్రతి సంక్రాంతికీ ముందు రోజు భూమిపైకి వచ్చి ప్రజలను సమస్త జీవకోటినీ ఆశీర్వదించాలని కోరడంతో బలిచక్రవర్తిని స్వాగతిస్తూ ఈ భోగిమంట ఆచారం మనమంతా పాటిస్తున్నామని వివరించారు తరతరాలుగా భోగిపిడకలను భోగిమంటల వేయుటను ఒక పూజ్యభావంతో కొలుచుకుంటున్నామని వారు అన్నారు. అనంతరం భోగి మంటలో పేడ పిడకలు వేసి, భోగి మంట చుట్టూ ముగ్గులు వేసి పూజించారు. నృత్యాలు చేస్తూ ఒకరికొకరు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హరిదాసు వేషధారణలో విద్యార్ధి డోల దిలీప్ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. సంక్రాంతి సంబరాల సాంస్కృతిక కార్యక్రమాలలో మిక్కిలి ప్రతిభ కనబరిచిన బెహరా చాందినికి ఉపాధ్యాయులు జ్ఞాపికను బహూకరించి ప్రోత్సహించారు. అనంతరం మిఠాయి పంపకం జరిగింది.
కామెంట్‌లు