'డుంబు సాహసం' ;---డా.పోతగాని సత్యనారాయణ
 ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు లేని బాలల కథ


========================================
ఒక అందమైన అడవి ఉంది. ఆ అడవిలో ఒక కుందేలు నివసించేది. దాని పేరు డుంబు. డుంబు చాలా చురుకైనది; అది రోజంతా ఇటూ అటూ పరుగులు పెడుతూ ఉండేది. దాని పరుగులు చూచి అందరూ మురిసిపోయేవారు.
డుంబుకి ఒక కోరిక ఉంది. అడవిలోని  కొండ చివరి వరకు పరిగుతీసి, అచటి నుండి ఉదయపు వెలుగును చూడాలి అనుకుంది. అది చాలా దూరం. అంత దూరం ఒక కుందేలు చేరుకోవడమంటే బాధలతో కూడిన పని. దాని తాత, మనవడికి-  
"ఏనాడూ ఒంటరిగా పోకూడదు" అని బోధించేవాడు.
ఒక రోజు ఉదయం, డుంబు తన సహవాసులతో  కలిసి ఆడుకుంటోంది. అపుడు అది-
"నేను కొండ చివరి వరకు పరిగెడతాను" అని పలికింది. 
దాని సహవాసులు "నిజమా?" అని నోరు తెరిచారు. 
"అది చాలా దూరం డుంబు, నీకు అంత సులువు కాదు" అని ఒక కుందేలు అంది. 
"అవును, నీవు అలసిపోతావు" అని ఇంకో ఉడుత అంది.
కానీ డుంబుకి తాను ఆ పని చేయగలనని బాగా తెలుసు. 
అది  "నేను మొదలు పెడతాను. మొదలు పెడితే ఏదైనా చేసి చూపగలము" అని పలికింది. 
అది నిదానంగా కొండ వైపు పరుగులు తీసింది. గాయాలు కాకుండా అడుగు అడుగునా ఆచితూచి ముందుకు సాగింది. నడుమ ఒకటిరెండు ఆటంకాలు కలిగాయి. నీటి కాలువలు, బండలు...మొదలైన వాటిని దాటుకుంటూ పోయింది.
కొంతసేపటికి డుంబు కొండ చివరికి చేరుకుంది. అచటి నుండి రవి బింబం పైకి లేచింది. ఆ వెలుగు, ఆ రంగులు చూసి డుంబు ఆనందంతో గెంతింది. అది చాలా అందంగా ఉంది. 
అది తన మనసులో చూడాలని తలచిన దానిని చూడగలిగింది.
తిరిగి రాకడ సమయంలో డుంబుకి చాలా సంతోషంగా అనిపించింది. తన పనిచేయగల ఒడుపు మీద తనకు మరింత గురి కుదిరింది. 
సాధించాలని మదిలో దృఢంగా అనుకొని మొదలు పెడితే చేరువకానిది  ఏదీ లేదని, జరుగదు అనుకునే పనికూడా జరిగి తీరుతుందని డుంబు ఆ రోజు తెలుసుకుంది. అది తన సహవాసులకు ఈ కథను వినిపించి, వారందరినీ పురిగొలిపింది.
కామెంట్‌లు