రంగులేదు:- ధరావత్ శ్రావణిక-తొమ్మిదవ తరగతి- జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళి ఘణపూర్- మెదక్ జిల్లా-7036277957
అనగనగా రంగాపురం అనే ఊరిలో రాజయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి సీత, గీత అనే ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. సీత తెల్లగా అందంగా ఉంటుంది. గీత నల్లగా ఉండడంతో తండ్రి రాజయ్య గీతను ఎక్కువగా పట్టించుకునే వాడు కాదు.
            సీతను మాత్రం అల్లారు ముద్దుగా పెంచేవాడు. తాను అందంగా ఉన్నానని సీత అందర్నీ వెక్కిరించేది. గీత మాత్రం బాగా చదువుకుంటూ అందరితో కలిసిమెలిసి ఉండేది. రాజయ్య ఎప్పుడైనా కూతుర్లతో బయటకు వెళ్లినప్పుడు తన కూతురు సీత అని అందరికీ చూపించేవాడు. గీత ఎవరో తెలియనట్లు నటించేవాడు. గీత చాలా బాధపడుతుంది. అయినా ఏం చేయలేక తన పని తాను చేసుకుంటూ గీత వెళ్ళసాగింది.
            సీత, గీత ఇద్దరు పదవ తరగతి చదువుతున్నారు. సీతను మంచిగా, గారాబంగా తండ్రి చూసుకుంటూ ఉండడం జరిగింది. గీత మాత్రం ఎలాంటి బాధపడకుండా పదవ తరగతి పరీక్షలకు బాగా చదివింది. జిల్లా స్థాయిలోనే గీత ఫస్ట్ ర్యాంకు సాధించింది. పత్రికా, మీడియా వాళ్ళు ఇంటికి వచ్చారు. తాను పదవ తరగతిలో మొదటి ర్యాంకు రావడానికి కారణం తన తండ్రి రాజయ్య అని గీత చెప్పింది. అందరూ రాజయ్యకు అభినందనలు తెలిపారు. రాజయ్య తన తప్పుకు క్షమించమని గీతను అడిగి, ఏడ్చాడు. నల్లగా ఉన్నావని నిన్ను ఎంత బాధ పెట్టినా ఈరోజు నువ్వు మాత్రం నన్ను హీరోను చేశావంటూ, జీవితంలో ముందుకు వెళ్లాలంటే మనిషికి రంగులు అవసరం లేదంటూ రాజయ్య కూతురు గీతను దగ్గరకు తీసుకున్నాడు. అప్పటినుంచి రాజయ్య ఇద్దరు కూతుళ్లను ఒకేలా పెంచసాగాడు.


నీతి: రంగులను బట్టి గుణం నిర్ణయించరాదు.

 

 
కామెంట్‌లు