నివేదిత... - సురేంద్ర రొడ్డ - ప్రమోద్ ఆవంచ- 7013272452

 ఊరు ఆ ఊరిలో పిల్ల దారి..బుసలు కొట్టే తాసుపాములా వంకలు తిరిగి ఉంది.రెండు వైపులా అడ్డగోలుగా పెరిగిన గడ్డి పరకలు ఒక్క మనిషి నడిచేంత దారి,అప్పుడప్పుడే టీనేజీలోకీ అడుగు పెట్టిన అమ్మాయి..చేతిలో పుస్తకాలను కుడిభుజంపై పెట్టుకొని నడుస్తుంది 
అడ్డగోలుగా పెరిగిన గడ్డి పరకలు చాలా పొందికగా తలలు దించుకుని ఆ అమ్మాయి పాదాలను స్పర్శిస్తున్నాయి.ఆ పచ్చని ఆకులు తడితో అభిషేకం చేస్తూ మురిసిపోతున్నాయి. తన నెలల పిల్ల గుండెల మీద ముద్దు ముద్దుగా అడుగులు వేస్తున్నట్లు నేలతల్లి ఉబ్బి తబ్బిబైయ్యింది.ఆ అమ్మాయి వెనక వంద మీటర్ల దూరంలో అదే వయసు అబ్బాయి ఆమె అడుగు జాడలను అనుసరిస్తున్నాడు.... నీలాకాశాన్ని కమ్ముకున్న మబ్బులమ్మ పరికిణీ ( వోణి),
చల్లగాలికి చిలకరించిన తుంపరలు శరీరాన్ని తాకి ఆ అబ్బాయికి వళ్ళు జలదరించింది, వెనక్కు తిరిగి కోపంగా ఆ అమ్మాయి చూసిన చూపులకు వెన్నులో వణుకు మొదలైంది.అది ప్రేమో, ఆకర్షణో తెలియని వయసు, అప్పుడప్పుడే శరీరంలో బయోలాజికల్ మార్పులు వచ్చే
సమయం.అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే ధైర్యం
లేదు.కానీ ఆ అమ్మాయిని చూస్తే శరీరంలో అనేక తీయని రసాయనాలు ఉత్పత్తి అవుతున్నాయి.వేగంగా కొట్టుకుంటున్న గుండె శబ్దం చెవులకు వినిపిస్తుంది.ఊపిరి ఉచ్ఛ్వాస,నిచ్చ్వాసల నిడివి గణనీయంగా పెరిగింది.మరో వైపు బయట తెలిస్తే ఏమవుతుందో అన్న భయం.తల దించుకుని ఓరకంట తనని గమనిస్తూ తన పక్కన నడిచే ధైర్యం లేక వెనకాలే నడుస్తూ... ఎప్పుడు వెనక్కి చూస్తుందా అని ఎదురు చూస్తూ.. క్షణమొక యుగమై కాలం పిల్ల దారై నడుస్తుంది.హటాత్తుగా మేఘం ఉరిమింది.. దాంతో పాటు ఒక మెరుపు...ఆ మెరుపు వెలుగులో స్కూలు గేట్ కనిపించింది.పిల్లలందరూ ఉత్సాహంగా అర్జునా... ఫల్గుణా...అని అరుస్తున్నారు.
               బయాలజీ క్లాస్...క్లాసురూంలోనికి సార్ ఎంటర్
అయ్యాడు.చాలా సీరియస్ ఉంటాడు.ఇవాళ లెసెన్లో
మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి తెలుసుకుందాం...
ఆంటూ మొదలుపెట్టాడు.ఆ సంవత్సరమే మొట్టమొదటి సారి ఆ పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టారు.ప్రతి సంవత్సరం లాగానే  కొత్త పుస్తకాలు కొనుక్కున్నప్పుడే ఆ పాఠ్యాంశం పై అందరి దృష్టి పడింది.బయాలజి సార్ ఎప్పుడు చెపుతాడా..ఎలా చెపుతాడా...అన్న కుతూహలంతో అందరి మస్తిష్కాల్లో ఎండార్ఫిన్లు ఊరుతున్నాయి. అంచనాలను తలకిందులు చేస్తూ సార్ ఆ లెసెన్ ను పాఠ్యాంశ క్రమంలో కాకుండా చివర్లో చెప్పడానికి నిర్ణయించుకున్నాడు...అంటే స్కూలు ముగింపు దశలో. దానికి మోక్షం ఈ రోజు వచ్చింది.సార్ లెసెన్ ప్రారంభించాడు.... అంతా పిన్ డ్రాప్ నిశ్శబ్దం.... ఆడపిల్లలు సిగ్గుతో ముడుచుకుపోయారు. ప్రశ్నలు అడుగుతే సార్ తిడతాడేమోననీ మగపిల్లలు భయంతో నోరు మూసుకొని కూర్చున్నారు....కట్ చేస్తే...
            నివేదిత... పాలల్లో గులాబీ రేకులు కలిసినట్లుండే
శరీరపు ఛాయ, నిమ్మ పండు వర్ణం పరికిణీలో మెరిసిపోయే మెరుపుతీగ, చుబుకం మీద దిష్టి చుక్కలా
ఉండే సహజ నల్లటి పుట్టుమచ్చ, అమావాస్యలో నక్షత్రం
నవ్వినట్లుండే ముఖం.... పాలపిట్ట దీపావళి కథల సంచికలో సురేంద్ర రొడ్డ గారు రాసిన నివేదిత కథలో హీరోయిన్...హీరో సాహిత్య.. స్కూలు రోజుల్లో ప్రతి ఒక్కరిలో కలిగే ప్రేమ...అదే ఫస్ట్ క్రష్.చాలా
అద్భుతంగా కళ్ళకు కట్టినట్లు చూపించారు.ఇది చదువుతుంటే ప్రతి ఒక్కరూ తమ టీనేజీ రోజుల్లోకి వెళ్ళక తప్పదు.మొదటి ప్రేమలో కలిగే తెలియని ఆనందం, కొంచెం అయోమయం,గుండెలో ఏదో అలజడి,
తాను ముందుంటే మాటలు రాక మెదడు మొద్దుబారి పోవడం, ఎప్పుడూ భయం, అప్పుడప్పుడూ,ఎవరూ లేనప్పుడు ఏదో తెగింపు,తన కదలికలను, కళ్ళల్లో హత్తుకొని పహారా కాయడం,తన మనసు గెలుచుకోవాలంటే చదువులో రాణించాలన్న తాపత్రయం
తన దృష్టిలో మంచి అనిపించుకోవాలన్న ప్రయత్నం....
వీటన్నింటి కంటే ఆమె బాడీగార్డ్ అయి అనుసరించడం
లాంటివి సహజం.నివేదితను ఆరాధిస్తూ ఎన్ని ప్రేమ లేఖలను గాలి పటాలుగా చేసి ఆకాశంలోకి వదిలాడో...
మనసులో రాసుకున్న ఎన్ని వందల కవితల్ని తనకు
నైవేద్యంగా సమర్పించాడో....
             నివేదిత ఊరోదిలి వెళుతుంటే గుండెను ఎవరో
బలవంతంగా లాక్కెళ్లి పోతున్నంత బాధ.పంచప్రాణాలు
సుడిగాలిలో కొట్టుకుంటూ నేల మీద కుప్పకూలి పోయిన
అనుభూతి.అనుభవాలు జ్ఞాపకాలై గుండె భారమై, గాయమై,బతుకు రైలును ఒక జీవితకాలం లేటైనా తిరిగి
పట్టాలెక్కించి,తన జ్ఞాపకాల ఆసరాతో జీవితానికి ఒక 
అర్ధం వెతుక్కుంటున్నాడు, హీరో సాహిత్య.ఈ కథలో రచయిత కథను మలిచిన తీరు,పదాల వ్యక్తీకరణలో కవితాత్మకత,అందమైన ప్రకృతి ఒడిలో జ్ఞాపకాల చెట్టు కింద మన అందరినీ కూర్చోబెట్టి స్కూలు రోజుల్లోకీ తీసుకెళ్ళిన విధానం అభినందనీయం.టీనేజీలో అమ్మాయిని తాకిలే చాలు అనుకొని తన తొలి స్పర్శతో తెలియని అనుభూతి అబ్బాయి పొందడం సహజం. అలాంటి అనుభూతిని పొంది,ఆమె అందమైన రూపాన్ని హృదయంలో ప్రతిష్టించుకొని, రోజు తన జ్ఞాపకాల్లో ఆరాధించాడు సాహిత్య.
చివరి రోజుల్లో తనని చూడడానికి వచ్చిన నివేదిత సుందర రూపాన్ని చూడాలని కళ్ళు తెరవబోయి,
అంతలోనే తన హృదయాంతరాలలో ముద్ర పడిన ఆమె
తొలి రూపాన్ని తుడిచి వేయడానికి మనసు రాక ఊరుకున్నాడు సాహిత్య...ఎంత గొప్ప వ్యక్తీకరణ.
'నివేదిత'ఒక కథ కాదు..చదివే వాళ్ళను ఏదో తెలియని అనుభూతిని కలిగిస్తుందన్నది వాస్తవం... కథ చివర్లో రెండు వాక్యాలు మనల్ని మన గుండెల్ని మెలి పెట్టిస్తాయి...'మరచిపోను నిన్ను మరణం వరకు'...'శ్వాసిస్తుంటాను నీ జ్ఞాపకాన్ని'.....ఇది చదివాక రాతి గుండె కూడా కరిగిపోతుంది...కన్నీటి పర్యంతమై వర్షిస్తుంది...సురేంద్ర రొడ్డ గారి కలం నుంచి ఇంకా ఇలాంటి కథలు రావాలని కోరుకుంటూ......
                                  
కామెంట్‌లు