ఇది నాయనగారు సందర్శించిన ఇల్లు!--ఇక్కడ ఫోటోలో ఉన్న ఇంటిని "నాయన"గారు సందర్శించారు. ఇంతకూ "నాయన" గారంటే ఎవరో తెలియకపోవచ్చు. రమణ మహర్షి గారికి "భగవాన్" అని మొట్టమొదటగా పిలిచిన వారు కావ్యకంఠ గణపతి మునిగారు. గణపతి మునిగారిని "నాయన" అని సంబోధించన వారు రమణమహర్షిగారు. తపశ్శీలి నాయనగారు సందర్శించిన ఈ ఇంటి వయస్సు నూటయాభై ఏళ్ళపైనే ఉంటుందని నా అంచనా. ఈ ఇల్లు మా నాన్నగారి పూర్వీకులది. మా తాతగారైన లక్ష్మీనరసింహంగారి నివసించిన ఇల్లు. మా నాన్నగారు పుట్టిపెరిగిన ఇల్లు. విజయనగరంలో సంస్కృత కళాశాలలో భాషాప్రవీణ చదువుతున్న రోజుల్లో మా నాన్నగారు వీలున్నప్పుడల్లా హరికథ పితామహులు ఆదిభట్ల నారాయణ దాసుగారింటికి వెళ్తుండేవారు. ఓరోజు ఉదయం మా నాన్నగారు వెళ్ళి నప్పుడు నారాయణదాసు గారి దగ్గర అప్పటికే ఒకరున్నారు. ఊహకందని వర్చస్సు. గడ్డం. సన్నని మీసం. పెద్ద అంగీ. ఖద్దరు పంచ.... ఇద్దరికీ నమస్కరించి ఓ పక్కన కూర్చున్నారు నాన్నగారు. దాసుగారు ఆయనకు మా నాన్నను చూపిస్తూ "గణపతీ! వీడు బుద్ధిమంతుడూ. కవి. ఇక్కడ సంస్కృత కాలేజీలో చదువుకుంటున్నాడు. నా దగ్గర ఏవేవో ప్రశ్నలు వేసి శాస్త్ర విషయాలు, గాన, కవితా విశేషాలు తెలుసుకుంటూ ఉంటాడు. వీడి ఊరు శివరామపురః. ఇంటి పేరు యామిజాలవారు" అనేసరికి "మీ నాయనగారు లక్ష్మీనరసింహముగారా?" అని అడిగారు గణపతిమునిగారు.ఔనన్నారు నాన్నగారు."నీకెలా తెలుసు వీడి నాయన" అని దాసుగారి ప్రశ్న.అప్పుడు గణపతిమునిగారు " చిన్నప్పుడు కొంతకాలం సాలూరు సంస్కృత పాఠశాలలో చదువుకుంటూ శివరామపురం వచ్చి వీరింట భోజనం చేయడం, కబుర్లు చెప్పడం" వంటి విషయాలు గుర్తు చేశారు. అంతట దాసుగారు "బలే బలే సంబంధమే మనది" అంటూ దాసుగారు "ఒరే యీ మహానుభావుడు కావ్యకంఠ గణపతి" అన్నారు. అనంతరం మా నాన్నగారితో ఒక పద్యం చెప్పించారు గణపతిముని.శివానందల హరిలోని ఒక శ్లోకాన్ని ఆయన చదవగా మా నాన్నగారు ఆ శ్లోకానికి భావప్రధానంగా వెంటనే ఓ పద్యం చెప్పారు. అది దాసుగారు గణపతిమునిగారితో మా నాన్నగారిని పరీక్షించిన ఘటన. తర్వాతి రోజుల్లో మా నాన్నగారు మంత్ర శాస్త్రానికి సంబంధించి గణపతి మునిగారి నుంచి అనేక విషయాలు తెలుసుకుని గురువుగా భావించి "నాయన" అనే పుస్తకంకూడా రాశారు.ఇదిలా ఉంటే, విజయనగరం జిల్లాలోని సాలూరు మండలంలో శివరాంపురం అనే అగ్రహారం ఉంది. ఆ ఊళ్ళోని ఇల్లే ఈ ఇల్లు. మా ఇంట మా అన్నదమ్ముల్లో అన్నయ్యలు ముగ్గురూ ఈ ఇంంటిని చూశారు. అక్కడ ఉన్నారు. కానీ నేనూ, తమ్ముడు గణపతి ఈ ఇంటిని ఇప్పటివరకూ చూడలేదు. మా సమీప ఆత్మీయ బంధువులు రాంజీగారు, సన్యాసిరావుగారు తదితరులు కలిసి 2015లో మా నాన్నగారి శతజయంతి ఉత్సవాలు నిర్వహించి మమ్మల్ని ఆహ్వానించారు. అయితే అనివార్య కారణాలతో వెళ్ళలేకపోయాం. నాటి కార్యక్రమంలో యామిజాల రామనరసింహంగారిని సత్కరించారు. ఈ రామనరసింహంగారితో ఫోన్లో మాట్లాడి మా నాన్నగారు పుట్టి పెరిగిన ఇంటి (శివరామపురం) ఫోటో ఉంటే పంపమని కోరగా ఆయన నిన్న పంపించారు. నిజానికి పెద్ద ఇల్లే ఇది. కానీ వెనుక భాగమంతా కూలిపోయి ఫోటోలో కనిపిస్తున్న ఈ భాగమే మిగిలి ఉంది. మా నాన్నగారి తమ్ముడి మనవడైన రామనరసింహంగారి పర్యవేక్షణలోనే ఉందీ ఇల్లు. శివరామపురం గురించి మా అమ్మానాన్నలు ఇంట్లో చెప్పగా వినడమే తప్ప ఆ అగ్రహారాన్ని ఇప్పటివరకూ సందర్శించలేదు. నేనూ తమ్ముడూ పుట్టింది మద్రాసులోనే. అయితే ఇప్పుడు ఆ ఇంటి ఫోటోనైనా చూడగలిగినందుకు ఆనందంగా ఉంది. - యామిజాల జగదీశ్


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం