పాఠకుడు పాఠకుడే!--రచన - యామిజాల జగదీశ్ : --నాకు తెలిసిన ఓ తమిళ రచయిత ఉన్నాడు. ఆయన పేరు ఎస్. రామకృష్ణన్. ఆయన ప్రతి డిసెంబర్ 31 వ తేదీ రాత్రి ఏదో ఒక అజ్ఞాత ప్రదేశంలో గడిపేవాడు. అలాంటిది ఓమారు ఇందుకు భిన్నంగా ఓసారి పాఠకుల మధ్య గడిపాడు. ఆరోజు రాత్రి పదకొండు గంటలకు ఆయన పుస్తకం ఆవిష్కరించడానికి ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పదకొండేమిటీ, అర్ధరాత్రి పన్నెండు గంటలకంటూ పుస్తకావిష్కరణకంటూ అన్ని ఏర్పాట్లూ చేశారు. ప్రేక్షకులు చాలా మందే వచ్చారు. నాటి కార్యక్రమంలో రామకృష్ణన్ పుస్తకం గురించి ఒకటి రెండు ముక్కలు మాత్రమే చెప్పాడు. మిగిలినదంతా ప్రేక్షకుల గురించే ప్రసంగించాడు. ఓ రచయిత పుస్తకాన్ని ఇద్దరు చదివి దాని మీద ఇష్టమేర్పడి దానిని రాసిన వ్యక్తిపై ఇద్దరిలోనూ ఓ అభిమానం ఏర్పడుతుంది. వారెక్కడైనా కలుసుకున్నప్పుడో లేక ఫోన్లో మాట్లాడుకున్నప్పుడో ఆ పుస్తకం గురించి చెప్పుకుంటారు. ఆ ఇద్దరి మధ్య అంతకన్నా మరో సంబంధం లేదు. వారిద్దరినీ కలిపింంది ఓ పుస్తకం. వీరి మధ్య బంధానికి ఏం పేరు పెట్టాలి అని ప్రశ్నించారు. పాఠకుడికి రచయితపై తమకే చనువూ అధికారం ఉందనుకుంటారన్నాడు రామకృష్ణన్. రామకృష్ణన్ సంచారం అనే పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన రచయిత. ఆయన స్వల్పకాలమే ఓ మ్యాగజైన్ లో పని చేసి బయటకు వచ్చేశారు. ఆయన అచ్చంగా రాతనే నమ్ముకుని బతుకుతున్నారు. కష్టమో నష్టమో సుఖమో ఇవేవైనా పరవాలేదనుకుని పుస్తకాలు రాయడానికి తనను అంకితం చేసుకున్నారు. దేశ విదేశాలలో పర్యటించే రామకృష్ణన్ కూడా మొదట్దో ఒక పాఠకుడే. ఆయన ఓ మిత్రుడితో కలిసి ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వెళ్ళాడు. అక్కడ ఓ మిత్రుడు పరిచయమయ్యాడు. ఇద్దరికీ ఓ రచయిత అంటే ఇష్టం. ఆయన రాసిన పుస్తకాల గురించి మాట్లాడుకున్నారు. అనంతరం ఇద్దరూ తామెక్కడ ఉంటారో చెప్పుకున్నారు. కార్యక్రమం ముగిసింది. ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. అయితే మరుసటి రోజే రామకృష్ణన్ తన మిత్రుడితో కలిసి కార్యక్రమంలో పరిచయమైన వ్యక్తి ఇంటికి వెళ్ళిపోయారు. ఆ వ్యక్తి ఓ నిరుద్యోగి. వీరిని సాదరంగానే ఆహ్వానించాడు. ఇద్దరినీ దగ్గర్లో ఉన్న ఓ టీ కొట్టుకి తీసుకెళ్ళి టీ ఇప్పించాడు. అవీ ఇవీ మాట్లాడుకున్నారు. అక్కడితో తనను వదిలేస్తారనుకున్నాడా మిత్రుడు. కానీ రామకృష్ణన్ మీ ఇంటే భోంచేస్తామని చెప్పాడు. ఈ నిరుద్యోగమిత్రుడికి ఏం చెయ్యాలో తెలీలేదు. ఒక్కరోజు పరిచయానికే ఇంతలా చనువు తీసుకున్నారనుకున్నాడు మనసులో. ఇంకేమీ అనలేక సరేనని ఇద్దరినీ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళమ్మకు నచ్చజెప్పి అన్నానికి కూర్చున్నారు. ఇంతలో నిరుద్యోగి తండ్రి వచ్చాడు. తన కొడుక్కే ఠికానా లేదనుకుంటే వాడు మరో ఇద్దరిని ఇంటికి తీసుకొచ్చి అన్నం పెట్టిస్తున్నాడా అని మండిపడ్డాడు. ముందూవెనుకా పరిచయం లేకుండానే ఇలా ఎవరింటికో వచ్చి అన్నం తింటున్నారు...మీకు సిగ్గూ ఎగ్గూ లేదా అని అడిగాడు. అయినా వాళ్ళేమీ పట్టించుకోలేదు. అయితే ఆ మాటలతో నిరుద్యోగి అయిన కొడుక్కి తండ్రిమీద కోపమొచ్చి తన మిత్రులను అవమానపరుస్తావా అని ఇంట్లించి వెళ్ళిపోతాడు. అప్పుడు అతని తండ్రి "మా వాడికేమైనా జరిగితే మీదే బాధ్యత" అని అనడంతో రామకృష్ణన్‌, అతని మిత్రుడు వీధిలోకెళ్ళి చూడగా రోడ్డుపక్కనే నిల్చున్న అతనిని నచ్చచెప్పి లోపలకు తీసుకొస్తారు. తమ వల్ల తండ్రీ కొడుకుల మధ్య గొడవలు రాకూడదని వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయటకు వచ్చెస్తారు. పాఠకుడిగా ఉన్న రోజుల్లో తను చవిచూసిన అనుభవాలలో మంచీ చెడూ కష్టమూ సుఖమూ అన్నీ ఉన్నాయన్నారు రామకృష్ణన్. ఆయన కొన్నేళ్ళకు రచయితగా స్థిరపడ్డారు. అప్పుడాయన ఇంటికి ఒకడొచ్చాడు. అతను ఓ పెట్టెతో రామకృష్ణన్ ఇంట్లోకొచ్చి తాను ఇక్కడే ఓ నాలుగు రోజులు ఉంటానన్నాడు. సరేనన్నాడు రామకృష్ణన్. అయితే అతను ఏ మాత్రం మొహమాటం లేకుండా పనులు చేయించుకోవడం మొదలు పెట్టి మీ ఇంట వాడకుండా ఉన.న తువ్వాలు, ఓ పంచ కావాలన్నాడు. అలా వాడనివంటూ ఉండదని, ఉతికినవి ఉన్నాయి వాడుకో అని రామకృఫ్ణన్ చెప్పగా వాళ్ళావిడతో "అక్కా! ఈయనతో ఎలా వేగుతున్నావక్కా" అని ఏవేవో అన్నాడు అపరిచితుడు. కొంతసేపటికి ఆ అపరిచితుడు తనెందుకో వచ్చానో చెప్తూ "మీలాగా నేనూ ఓ రచయితగా బతకాలనుకున్నాను. నా పెట్టె నిండా నేను రాసిన కథలూ నవలలూ ఉన్నాయి. అవన్నీ చదివి మీ అభిప్రాయం చెప్పాలి" అన్నాడు.రామకృష్ణన్ "నాకంత టైముండదు..."అని అనగానే అపరిచితుడికి కోపమొచ్చింది. "ఓ రచయితగా ఎదగాలనుకున్న నామీద మీకెందుకంత అసూయ? నేనెక్కడ పైకొచ్చెస్తానని భయమా? ఎందుకండీ మీలాంటి వాళ్ళు పుస్తకాలు రాస్తారు" అని నానా మాటలు అని "మీరు బాగుపడరు" అని శపించి వెళ్ళిపోతాడు అపరిచితుడు. ఇలాంటి వాళ్ళూ అక్కడక్కడా ఎదురవుతుంటారంటూ రైల్లో ఓ పాఠకాభిమాని పరిచయం చేసుకుని తానింతకన్నా మీకేమీ ఇచ్చుకోలేనని రామకృష్ణన్ కు ఓ కప్పు కాఫీ కొనిచ్చి తెగ ముచ్చటపడిపోతాడు. ఇలా తన జీవితంలో రకరకాల పాఠకులను కలిశానని, పాఠకుడనే వాడు లేకుంటే రచయిత ఎక్కడుంటాని ప్రశ్నించారు. అప్పుడప్పుడూ తానెందుకు రాయాలనుకుని నీరసపడినప్పుడు "ఛ. ఇలా రాయకుండా ఉండిపోకూడదు. ఎక్కడో అక్కడ నా రచనలు చదివే ఓ పాఠకుడు ఉండే ఉంటాడు. వాడికోసమైనా రాయాలి" అని అంతరాత్మ ప్రబోధనతో మళ్ళీ రాసిన సందర్భాలున్నాయంటారు రామకృష్ణన్. కనుక పాఠకుడు లేకుంటే రచయిత లేడు రచయిత లేకుంటే పాఠకుడు లేడు. ఈ ఇద్దరి మధ్య బంధం గాఢమైందని రామకృష్ణన్ అభిప్రాయం.


కామెంట్‌లు