రాజ సింహాసనం (బాలకథ)--కందర్ప మూర్తి , హైదరాబాద్.


  సిరిపురం గొల్ల చిన్నోడు  గ్రామంలోని  గోవు మందల్ని  మేపడానికి
సమీపంలోని అడవికి  తీసుకు వెల్తూంటాడు. చిన్నోడికి  అమ్మా నాన్న
చిన్న తనంలోనే చనిపోతే ముసలి అవ్వ పెంచి పెద్ద చేసింది.ముసలి అవ్వ
కూడా చనిపోవడంతో ఊరి జనం అన్నం గంజీ పోస్తూంటే వారి ఆవుల్ని
మేతకోసం వనానికి తీసుకెళతాడు.
  ఒక రోజు చిన్నోడు ఆవుల్ని అడవిలో మేపుతూండగా ఒక సాధువు
దారంట వెల్తూ దాహమేసి చిన్నోడిని చూసి దగ్గర కొచ్చి సమీపంలో
తాగడానికి నీళ్ళు లభిస్తాయేమోనని అడిగాడు. దగ్గరలో నీటి వనరులు
లేవని చెప్పి సాధువు దగ్గరున్న చెంబు తీసుకుని ఆవు దగ్గర పాలు పితికి
దాహం తీర్చాడు. గొల్ల చిన్నోడి ఉదార గుణానికి సాధువు సంతసించి
"" బిడ్డా !,నీకు రాజయోగం ఉంది. నువ్వు రాజ సింహాసనం మీద
కూర్చుంటావని " ఆశీర్వదించి వెళ్లాడు.
  అప్పటి నుంచి గొల్లచిన్నోడు ఊళ్లో కనబడిన వారందరికీ " నాను
రాజు నవుతా, సింవాసనం మీద కూచుంటా"అని చెబుతూంటే చిన్నోడికి
వెర్రి పట్టిందని నవ్వు కునేవారు. ఒక రోజు ఉదయాన్నే గుడి పూజారి
ఎదురు పడితే " సాములూ, నాను రాజునవుతా, సింవాసన మెక్కుతా,"
నన్నాడు అమాయకంగా. " పోరా, వెర్రి వెధవా ! ముడ్డి మీద గోచీ గుడ్డకు గతి లేని నువ్వు రాజువు అవుతావా, ఫో ! " అని కసురుకు
న్నారు. ఎవరెలా వేళాకోళం చేసినా తన ధోరణి మార్చకోలేదు గొల్ల
చిన్నోడు.
యధావిధిగా రోజూలా ఆవులతో అడవికి వెళ్లిన చిన్నోడు తిరిగి గ్రామానికి  రాలేదు. ఆవులే తిరిగి వచ్చాయి. అడవి జంతువులు
ఏవైనా చిన్నోడిని పట్టుకు పోయాయనుకున్నారు గ్రామప్రజలు.
  ధరణికోట మహరాజు చక్రధరుడు సంతానం లేదని వృధ్ధాప్యంలో
తన రాజ్యానికి వారసులు  లేరని బాధ పడుతున్నాడు.మహామంత్రి
దురంధరుడికి దుర్భుద్ది పుట్టింది. మహరాజు తదనంతరం ఒక
అమాయకుడిని యువరాజుగా ప్రకటించి రాజరికం తన చెప్పుచేతల్లో
ఉంచుకోవచ్చని సేనాపతి  సమరసేనుడితో చేతులు కలిపి సైనికుల్ని
పంపి  రాజ్యంలో ఉన్న ఒక అమాయకుణ్ణి పట్టుకు రమ్మన్నాడు.
  రాజభటులు అడవి దారంటే వెల్తూంటే గొల్లచిన్నోడు కంటపడగా
బంధించి వెంట తీసుకు పోయారు. సేనాపతి ఆధ్వర్యంలో చిన్నోడికి
రాజనీతి కత్తి యుధ్ధం మల్లయుధ్ధం విలువిధ్య తో పాటు సర్వ విధ్యల్లో
యువరాజులా తీర్చిదిధ్ధాడు.
   తను రాజసింహాసనం మీద కూచుంటానని సంతోషంతో సేనాపతి
ఎలా చెబితే అలా అన్ని రాజవిధ్యలు యుధ్ధతంత్రాలు పట్టుదలగా
నేర్చుకుని అమాయకుడిగా తిరిగే గొల్లచిన్నోడు తెలివితేటలతో చలాకిగా యువరాజులా తయారయాడు.
    మహామంత్రి దురంధరుడు తన కుయుక్తులతో రాజసింహాసనం
కోసం పన్నాగాలు పన్నుతున్నాడు.
  వృధ్ధాప్యంతో తన వారసుడి కోసం పరితపిస్తున్న సమయంలో
చంద్రసేనుడి పేరుతో యువరాజుగా గొల్లచిన్నోడిని తీసుకువచ్చాడు
మహామంత్రి. స్ఫురద్రూపి ఆజానుబాహుడు చలాకిగా కనిపించిన
చంద్రసేనుడిని చూసి మహరాజు ముగ్ధుడయాడు. తన రాజ్యానికి
వారసుడిగా యువరాజ పట్టాభిషేకం జరిగే వరకు తనవద్దే ఉంచాలని
మహామంత్రిని కోరగా సరేనని చిన్నోడిని చక్రధర మహరాజుకు అప్ప
గించాడు. మహరాజు చూపే ప్రేమ వాత్సల్యయాలకు  ఆకర్షితు
   డయాడు  అనాథగా పెరిగిన చంద్రసేనుడు ఉరఫ్ గొల్లచిన్నోడు.
      సేనాపతి సమరసేనుడు నిజానికి  మహరాజుకి స్వామిభక్తుడు.
 మహామంత్రి దురంధరుడు స్వార్థం దుర్బుధ్ధితో తలపెట్టిన రాజద్రోహం
గ్రహించి మంత్రి చెప్పిన విధంగా చేస్తానని చెప్పి మహరాజు వాత్సల్యానికి
అనుకూలంగా తీర్చిదిద్దాడు .మహామంత్రి కుట్రను చంద్రసేనుడికి
వివరించి, యువరాజుగా పట్టాభిషిక్తుడవగానే మహరాజు చక్రధరుడిని
చెరసాలలో బంధించాలను కున్నట్టు చెప్పాడు.
సేనాపతి ద్వారా మహా మంత్రి కుట్రను తెలుసుకున్న చంద్రసేనుడు
ధరణికోట రాజ్యానికి యువరాజుగా పట్టాభిషిక్తుడవగానే మహామంత్రి
దురంధరుడిని చెరసాలలో బంధించి స్వామిభక్తుడైన సేనాపతి
సమరసేనుడిని తనకు మహామంత్రిగా నియమించాడు.మహరాజు
చక్రధరుడిని స్వంత తండ్రిలా ప్రేమ వాత్సల్యం చూపించాడు.మహరాజు
తన రాజ్యానికి అసలైన వారసుడు లభించినందుకు మనశ్శాంతిగా
ఉన్నాడు. యువరాజు చంద్ర సేనుడు తను పుట్టి పెరిగిన సిరిపురం
గ్రామాన్ని ప్రత్యేక అబిమానంతో చూసుకున్నాడు.
             *                  *                *



       


కామెంట్‌లు