భాస్కర శతకము - పద్యం (౧౦౬ - 106)

 ఉత్పలమాల: 
 *సేనగవాంఛితాన్నము భు | జింపఁగలప్పుడు కాక లేనిచో*
*మేనులు డస్సియుంట నిజ | మేకద దేహుల కగ్ని హోత్రుఁడౌ*
*నే నిజభోజ్యముల్ గుడుచు | నేనియుఁ బుష్టివహించు లేని నా*
*డూని విభూతిలో నడఁగి | యుండఁడె తేజము దప్పి భాస్కరా!*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన, భాస్కరా..
ఈ చరాచర ప్రపంచంలో, జీవి తనకు ఆకలి అయినప్పుడు కోరుకున్న ఆహారము పుష్టిగా తీసుకున్నప్పుడు దేహకాంతితో మెరిసిపోతాడు.  అటువంటి అన్న ప్రసాదము దొరకనప్పుడు, శక్తి లేక నీరస పడిపోయి వుంటుంది.  ఎలాగంటే, ఎంతో శక్తివంతుడైన అగ్నిహోత్రుడైనా, తనకు కావలసిన నెయ్యి ఆహారంగా దొరికితే మహా జ్వాల లాగా ప్రజ్వరిల్లి ప్రకాశిస్తాడు.  తనకు వలసిన ఆహారం దొరకనప్పుడు కట్టెల/పిడకల బూడిదలో దాక్కుని వుంటాడు కదా, అలాగ .....అని భాస్కర శతకకారుని వాక్కు
*మహాభారతం లో ఖాండవ వన దహానానికి ముందు మారువేషంలో వచ్చిన అగ్నిహోత్రునికి, కృష్ణార్జునుల మధ్య జరిగిన సంభాషణ పై పద్యానికి మంచి వివరణ అవుతుంది* 
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు