సామెత కథ : ఎం. బిందు మాధవి


 కొండంత దేవుడికి గోరంత పత్రి!


మంజరి, శశి కళ, జాహ్నవి, మధు - వీరంతా డాక్టర్స్. ఒకరు రేడియాలజిస్ట్, ఒకరు అనస్థిటిస్ట్, ఒకరు ఆంకాలజిస్ట్ - ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగం లో స్పెషలిస్ ట్లు అన్నమాట.

వారి వారి శాఖల్లో వాళ్ళు మంచి అనుభవఙ్ఞులు. వాళ్ళకి మామూలుగానే వాళ్ళ వృత్తి - ఏకాగ్రతతో, బోలెడంత శ్రద్ధగా చెయ్యవలసిన అవసరం ఉంటుంది.

చిత్త శుద్ధితో పని చేసే ఏ డాక్టర్ కైనా కుటుంబం గురించి ఆలోచించే టైం తక్కువ గా ఉంటుందంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. అందునా ఆడవారైతే ఇక చెప్పక్కరలేదు. ఎమర్జెన్సీ కేస్ లు వచ్చాయంటే, ఇల్లు, పిల్లలు వదిలేసి నిల్చున్నవారు నిల్చున్నట్లు పరుగెత్తాల్సిందే.

ఇలా వృత్తే దైవం గా భావించే వీరందరు కలిసి ‘స్వచ్చంద సేవ’ చెయ్యాలని సంకల్పించుకుని ఒక ‘టీం’గా తయారై, సిటీలో ఒక ‘సేవాశ్రమం’ వారి దగ్గర కొంత చోటు (భవనాలతో సహా) సంపాదించి వారి వారి జీతాల్లోంచి కొంత మొత్తం డబ్బు సమకూర్చి, ఇంకా అవసరాలకి ఎవరి పరిచయస్తుల దగ్గర వారు విరాళాలు గా సేకరించి పేషెంట్ ల కి కావలసిన సమస్త సదుపాయాలు సమకూర్చారు.

అన్ని రకాల రోగుల్లోను, ‘క్యాన్సర్’ రోగుల పరిస్థితి ఎక్కువ దయనీయంగా ఉంటుందనేది జగమెరిగిన సత్యం. వారి కిచ్చే ట్రీట్మెంట్ వల్ల వారి ‘మానసిక’, ‘శారీరక’ స్థితి ఎలా ఉంటుందో అంచనాకి అందనిది. ఇటు ‘శరీరం గుల్ల’, అటు ‘జేబు గుల్ల’ అయ్యే పరిస్థితిలో ఉంటారు ఈ ‘క్యాన్సర్’ రోగులు.

వారికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్న కుటుంబసభ్యులు కొంత కాలం అయ్యేసరికి ‘మానసికం’గా అలిసిపోయి, ఉద్యోగస్తులైతే ‘సెలవలు’ అయిపోయి ఏమీ చెయ్యలేనినిస్సహాయ స్థితిలో ఉంటారు. అప్పటికి ఆ రోగులు తమకి ‘అంతం’ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. వారికి ఇంక చెయ్యటానికి ‘వైద్యం’ అంటూ ఏమీ మిగిలి ఉండదు, అలా అని వారిని ఇంటికి తీసుకెళ్ళి ‘సేవ’ చెయ్య గలిగిన స్థితిలో ‘కుటుంబ సభ్యులు’ ఉండరు.

అదిగో అలాంటి రోగులని, గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటల్ నించి తమ సేవా సంస్థ కి తీసుకొచ్చి కంటికి రెప్ప లాగా చూస్తూ, వారి శారీరక, మానసిక బలహీనతలు, అశక్తతలు, అవసరాలు గమనిస్తూ సేవ చెయ్యాలనే ‘ఉదాత్తమైన’ భావం తో మన మంజరి, శశికళ, మధు, జాహ్నవి తమ ‘విలువైన సమయాన్ని’ వెచ్చిస్తున్నారు. అది కూడా ఎంతో ‘అంకిత భావం’తో, ‘మొహాన చిరునవ్వు’ చెదరకుండా, ఆ రోగులు ‘ఆరోగ్యవంతులవ్వటం’ తమకెంత ముఖ్యమో తమ మాటల్లో వ్యక్తపరుస్తూ వారి ‘సేవ’ చేస్తూ ఉంటారు.

వార్తా పత్రికల్లో ఇలాంటి సేవా సంస్థల గురించి చదివిన ‘వాసంతి’, ఇదంతా ఒక ‘పబ్లిసిటీ స్టంటే’ కానీ నిజంగా ఇలా చేసే వారు ఉంటారా అని కొట్టి పడేసింది. కానీ అనుకోకుండా వేరే పని మీద ‘వాసంతి’ ఇంటికి వచ్చిన ‘మంజరి’ మాటల మధ్యలో వారి సేవా సంస్థ గురించి చెప్పింది. ‘మేము ఎవ్వరినీ ‘విరాళాల’ కొరకు బలవంత పెట్టము, కానీ సంస్థ మొత్తం కార్యకలాపాలు విరాళాల మీదే నడుస్తాయి. మేము కూడా ఫ్రీ సర్వీస్ చేస్తాము’ అని చెబుతూ, ‘మీకు ఆసక్తి ఉంటే వచ్చి ఒక్క సారి చూడండి, మీకే అర్ధం అవుతుంది’ అని చెప్పింది.

అలాగే ఆ దారిన వెళుతూ ఒక సారి ‘వాసంతి’ ఆ ‘సంస్థ’కి వెళ్ళి చూసి ఆశ్చర్య పోయింది. అక్కడ డబ్బు ని ఎంత లెక్క గా రోగుల కోసం మాత్రమే వాడుతున్నారంటే, అక్కడే సర్వీస్ చేసే డాక్టర్లు కూడా ‘డబ్బు’ చెల్లించి మరీ ఆ ‘క్యాంటీన్ లో టీ’ తాగుతారు. ఇహ ఇతర విజిటర్స్, దాతలు కూడా డబ్బు చెల్లించి క్యాంటీన్ సౌకర్యాలు పొందవలసిందే.

ఇది చూసి వాసంతి అవాక్కయి, ‘దూరం నించి మనమెంత తప్పుగా విషయాలగురించి అర్ధం చేసుకూంటామో కదా’ అనుకుని, ‘నిజంగా ఎంత అంకిత భావం లేకపోతే ఎవరైనా సమాజానికి ఇలాంటి సేవ చెయ్యగలరు?’ అన్నది మంజరితో. దానికి మంజరి నవ్వుతూ, "కొండంత దేవుడికి గోరంత పత్రి" అన్నట్లు, ‘ఆ రోగులు పడే బాధ ముందు మేము చేసే సేవ ఎంతండీ’ అంటూ, ‘మేము ఈ వృత్తిలోకి వచ్చినందుకు అంత మాత్రం చెయ్యకపోతే ఆ వృత్తిలోకి రావటం అనవసరమండీ’ అన్నది.

* * *


కామెంట్‌లు