శ్రీ కృష్ణ శతకము - పద్యం (౨౪ - 24)

 కందము :
*అంగన పనుపున ధోవ తి*
*కొంగున అటుకులను ముడుచు | కొని వచ్చిన యా*
*సంగతి విని దయనొసంగితివి*
*రంగగు సంపదలు లోక | రక్షక కృష్ణా !* 
తా.: ఓ రుక్మిణీ నాధా, సత్యా వల్లభా, గోపికాలోలా..
ఓ కుచేలపాలకా, మురారీ, నీ  బాల్య స్నేహితుని భార్య, తమ పేదరికము వలన కలిగే బాధలు తట్టుకోలేక, జగ్త్పభువువు అయిన నీ వద్దకు వెళ్ళి సహాయం అడగమంటుంది. కానీ నీకు ఇవ్వడానికి తమ వద్ద ఏమీ లేవు కదా అనుకుంటాడు కుచేలుడు. అప్పుడు అతని భార్య, ఇంట్లో మిగిలిన కొన్ని అటుకులను, అతుకులతో, చిరుగులతో వున్న పై ఉత్తరీయంలో మూటకట్టి నీ వద్దకు పంపిస్తుంది. నిన్ను చూచిన ఆనందంలో కుచేలుడు, తను వచ్చిన పని, నీకని తెచ్చిన బహుమతి మర్చేపోతాడు. నీవు గుర్తు చేసినా కూడా, అటుకులు నీకు ఇవ్వడానికి మొహమాటం పడతాడు. నీవే చొరవచేసి ఆ మూట విప్పి రెండు పిడికిళ్ళ అటుకులు తిని ఆ కుచేలునికి అనంతమైన సంపదలు ఇచ్చావు.....అని  శతకకారుడు నృసింహ కవి వాక్కు
 
*జగదానందకారకా, గీతా మూర్తి,  నిన్ను మనసా వాచా నమ్మి వున్నవారికి ఎల్లప్పుడూ వెన్ను దన్నగా వుంటావు కదా, మురళీ గానలోలా. పిడికెడు అటుకులు ఇచ్చినందుకే, సకల సంపదలు ఇచ్చావే, మరి క్షణ క్షణమూ మా మనసును నీ యందు నిల్ప గలిగితే, అనితర సాధ్యమైన మోక్ష సంపద ఈయవా స్వామీ.  కాకపోతే, మాది, చంచలమైన మనసు. నీ మాయకు ఇట్టే లొంగి పోతుంది. మళ్ళీ సంసారమనే బురదలో పడుతుంది. అలా, మేము జారి పోకుండా మమ్ములను పట్టుకొని మోక్షతీరానికి నీవే చేర్చాలి, దేవాధి దేవా. "దేవాధి దేవ! శ్రీ వాసుదేవ!!" ....* అంటూ ఆ నందకిశోరుని వేడుకొందాము.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు