అన్నా! శ్రీకృష్ణా! వచ్చితివా? సంతోషం.వదినమ్మలు అందరూ కుశలమేకదా!సాధ్వీమణి రుక్మిణి వదినగారు, నాకొరకు చీరె సారెలు పంపినారా? చాలాసంతోషము.
ఆ .....ఏమీ? నా పతిదేవులు ధర్మరాజు మిమ్ము కౌరవులతో సంధి కార్యము చేయుటకు పిలిపించినారా?
అన్నా! శ్రీకృష్ణా! అరివీర పరాక్రములైన నా భర్తలు , పౌరుష హీనులై ,కౌరవులు మా పట్ల జరిపిన దురాతములన్నీ మరచి , భూమండలమంతా పాలించల సమర్దులైన నా పతులు ,.కేవలం ఐదు ఊర్ల కొరకు సంధి చేసుకొందురా?
జూదమాడుట తప్పని తెలిసియూ ఆనాడు,జూదమాడిన నాపతి ధర్మజులు ,
భార్యననే చులకన భావంతో, సొమ్మును పందెంలో ఒడ్డినట్లు నన్నునూ పందెంలో ఒడ్డుట న్యాయమా?
తాను అలా నన్ను హీనపరచుట వలననేదా, ఆ ధూర్తుడు, దుశ్శాసనుడు ఏక వస్త్రనైన నన్ను, సభలోనికి జుట్టు పట్టి ఈడ్చుకు వచ్చి వలువలు విప్ప యత్నించినాడు.
ఆ తుచ్చుడు, దుర్యోధనుడు, "అన్నభార్య, అమ్మతో సమానమనే" ఇంగితం మరచి, తన ఊరువులు చూపించి అచ్చట కూర్చోమని ఇకిలిస్తూ సైగలు చేసినది.
ద్రుపద రాజ పుత్రికను, పాండురాజు కోడలిని అయిన నన్ను, అంతటి అవమానమునకు గురిజేసినాడంటే వాడికి ఎంతధైర్యము?
అందుకనే "మొగుడు ఒకటంటే, మధూకవళము వాడు పదన్నాడు "అనే సామెత వచ్చింది.
అందరు విజ్ఞులు, పెద్దలు,వయసున వయో వృధ్ధులు వుండికూడా, ఒక కులస్త్రీకి, అందునా,తమ ఇంటి కోడలికి, ఆ వదరుబోతు,గర్విష్టీ, బుధ్ధిహీనుడు అగు ఆదుర్యోధనుడు అంతఃపురంనుండి నన్ను పట్టి తెమ్మని ఆదేశించినప్పుడు, ఆ పశువు దుశ్శాసనుడు, నా వలువలు విప్పుతున్నప్పుడు ,ఒక్కరంటే ఒక్కరైననూ వలదని వారించ లేదుకదా. అన్నా!దయామయుడవైన నీ వలన కదా, ఈ దృపథరాజ పుత్రి మానము కాపాడ బడినది. నీ దయవలన కదా ఈ మానవతి ద్రౌపది ఈనాడిట్లు ప్రాణములతో నీ ఎదురుగా మిగిలి వున్నది.
ఆనాడు ఆ హీనుడు ,ఆదుర్మదాధుడు తాకిన, నా ఈ కేశములను, ఆనాటి నుండి నా కరములతో తాకక, మర్రి ఊడల వలె జడలు కట్టినను వదిలివేసిన కారణం, భీమసేనులవారు ఆనాడు ,ఆ దుశ్శాసనుడి కరములు ఖండించి, ఆ ధూర్తుని రక్తంతో తడిసిన తన స్వహస్తములతో నా కేశములు ముడివేయుదునన్న శపథమును మరచినారా?ఆ క్షణము కొరకు ఎన్నినాళ్ళనుండి ఎదురు చూచు చుంటినో కదా!
ఆనాడు సభలో ఈ పాండు వీరులు పలికినశపథములన్నియూ వట్టి ప్రగల్భాలేనా? భీమసేనులవారికి కండ బలమే కానీ,గుండెబలము లేకనే ఆ ధూర్తులతో సంధికి ఒడంబడుతున్నారా?
ధర్మరాజులవారు చేసినదంతా చేసి ,శాంతి మంత్రములు పఠించుచు సంధి మాటలను పలుకుమని అనుచున్నారా?
మరి విజయుడనే కీర్తినార్జించిన, అర్జునుడు, శివ మహా దేవుడిని మెప్పించి పొందిన, పాశుపతాస్త్రము మూలను పెట్టి పూజించుటకేనా?
ఇక మాచిన్నత్త మాద్రి పుత్రులు, నకుల సహదేవులు, అన్న ధర్మజుని మాటకు తాన అంటే, తందాన అందురే కానీ వారికంటూ స్వంత అభిప్రయములు లేక, అన్న ధర్మజుని మాటకు మారు పలుకరు కదా!
అన్నా! శ్రీకృష్ణా! మానవతి అయిన నీ చెల్లెలు ద్రౌపది, ఇటుల పలుకు చున్నదేమి అనుకొనవద్దు.
నీవుసంధి కార్యమునకు వెళ్ళుట నాకెంతమాత్రమును అభిమతంగాదు. నీ బావల మాట మన్నించి నీవు వెళ్ళినా ,"ఆ సంధి పొసగకుండుగాక "అని మనస్పూర్తిగా నేను కొలుచు దైవానివైన , నిన్నే నా మనసున తలచుకొని ప్రార్థిస్తున్నాను.
జరగబోవు కురుక్షేత్ర యుధ్ధములో నా భర్తల విజయము కొరకు ,వేయి కనులతో ఎదురు చూచుచుందును.
అన్నా!శ్రీకృష్ణా!సంధికి పోయిరమ్ము.కానీ, సోదరినైనను నేను, "విజయీ భవ " అని నీకు తిలకమును మాత్రము నా చెతులతో నీ నుదుట దిద్దలేను. ఈ సోదరిని క్షమింపుము.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి