కామం, క్రోధం, మోహం, లోభం, మదం, మాత్సర్యం అనే ఆరు దుర్గుణాలను అరిషడ్వర్గాలని అంటారు. ఇవి ఎంతో ప్రమాదకరం. ఇక వీటితో అహంకారం, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు వంటివి కలిస్తే ఎంత ప్రమాదకరంగా మారి సత్పురుషులను సైతం అధ:మ పాతాళానికి దిగజార్చేస్తాయి. ఈ అంశానికి సోదాహరణంగా నిలిచే ఒక కధ దేవీ భాగవతంలో వుంది.
విశ్వామిత్రుడు ఒకనాడు వశిష్టుని దర్శించడానికి అతని ఆశ్రమానికి వెళ్ళాడు. గొప్ప తప సంపన్నుడైన విశ్వామిత్రుడికి సమస్త రాజోపచారాలు చేసి గౌరవించడమే కాదు అతని సమస్త పరివారానికి తన నందిని ధేనువు అనే ఆవు సహాయంతో భక్ష్య,భోజ్యాలతో గొప్ప విందును సమకూర్చాడు. ఒక్క నిమిషంలో తయారైన ఆ పిండి వంటకాలకు విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు. అంతటితో అతనికి దుర్బుద్ధి పుట్టి భోజనం అయ్యాక వశిష్టునికి నమస్కరించి ఒక క్షణంలో కోరిన వాటన్నింటినీ సృష్టించే ఈ గోవు పట్ల నాకెంతో ప్రీతి కలిగింది. ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే నీలాంటి మునిపుంగవుడు కంటే మహారాజైన నా వద్ద ఇది ఉంటేనే బాగుంటుంది కాబట్టి దీనిని నాకివ్వమని ఆర్ధించాడు. అయితే ఆ అభ్యర్ధనను వశిష్టుడు సున్నితంగా తిరస్కరించాడు.దీని పాలు హోమానికి ఎంతో అవసరం కాబట్టి ఇవ్వడం కుదరదని ఖచ్చితంగా చెప్పేసాడు. అందుకు బదులుగా ఈ దేశానికి మహారాజును నేనే కాబట్టి నా ఆజ్ఞ ను శిరసా వహించాల్సిందేనని విశ్వామిత్రుడు పట్టు పట్టాడు.
అంతటితో ఇద్దరికీ మాటకు మాట పెరిగింది. విశ్వామిత్రుని సైన్యం ఆ నందిని ధేనువును బలవంతంగా తీసుకు పోయే ప్రయత్నం చేసారు.
ఆ గోవు తనను రక్షించమని వశిష్టుని దీనంగా ప్రార్ధిస్తే విశ్వామిత్రుని సైన్యాన్ని ఎదుర్కొనే శక్తి తనకు లేనందున నిన్ను నీవే రక్షించుకోవాలని వశిష్టుడు సూచించాడు.
అప్పుడు కోపంతో ఆ నందినీ ధేనువు హూం అని హుంకరించింది. దాని శరీరం నుండి వేలాది రాక్షసులు పుట్టుకొచ్చి విశ్వామిత్రుని సేనలతో భీకర యుద్ధం చేసారు.
చివరకు విశ్వామిత్రుని సేనలు అంతమై పోయాయి. వశిష్టుని తపశక్తికి విశ్వామిత్రుడు నోరెళ్ళబెట్టి చివరకు ఓటమి అంగీకరించి వశిష్టునికి క్షమాపణలు చెప్పి వెళ్ళిపోయాడు. కాని అతనిలో అవమానాగ్ని చల్లారలేదు.తీవ్ర తపస్సు చేసి వశిష్టుని కంటే గొప్ప తపసంపన్నుడు అయ్యి తిరిగి యుద్ధానికి రావాలని సంకల్పించుకొని తపోవనాలకు వెళ్ళిపోయాడు. మరొక పక్క నిత్యం వేదాధ్యయనం, యజ్ఞ యాగాదులతో ఎంతో పవిత్రం గా వుండే వశిష్టుని ఆశ్రమ ప్రాంగణం రక్తపుటేరులతో, శవాల గుట్టలతో అపవిత్రం అయిపోయింది. అక్కడ పూర్వపు ఆధ్యాత్మిక పవిత్రతను పునరుద్ధరించేందుకు వశిష్టుడు తిరిగి వందలాది సంవత్సరాలు తపస్సు చేయాల్సి వచ్చింది.
అరిషడ్వర్గాలు తపోధనులను సైతం అధమ పాతాళానికి దిగజార్చేస్తుంండనడానికి ఈ కధ ఒక చక్కని ఉదాహరణ.
దుర్గుణాలు(ఆధ్యాత్మిక కధ) : సి.హెచ్.ప్రతాప్
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి