*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 074*
 కందం:
*గృహ దాహకునిం బరదా*
*రహరుం బంధుహిత కార్య రహితుని దుష్టో*
*త్సాహపరుని జంపి నరపతి*
*యిహ పరముల యందు కీర్తి నెనగు కుమారా !*
తా:
కుమారా! ఇళ్ళు తగలబెట్టే వానిని, పరాయి వారి భార్యలను సొంతం చేసుకోవాలనుకునే వారిని, తనను కోరుకునే చుట్టాలకు మంచి పనులు చేయాలి అనే ఆలోచనలు చేయని దుష్టులను, చెడ్డ పనులు చేయడం లో అత్యంత ఉత్సాహం చూపించేవారిని చంపిన, రాజ్యాధికారం లో ఉన్న వ్యక్తి, రాజు, ఈ భూలోకంలో నైనా, మరణించిన తరువాత పైలోకంలో అయినా మంచి పేరు, పుణ్యము సంపాదించుకుంటాడు ........... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*ఈ రోజుల్లో, మన సమాజంలో, మన చుట్టూ ఉన్న వారిలో, సొంత చుట్టాలకు, రక్త సంబంధీకులకు కూడా నష్టం జరిగేలా చేసి, ఇబ్బందులు కలిగేలా నడచుకునే వారే ఎక్కవగా కనిపిస్తున్నారు. సమాజానికి, సొంత వారికీ ఏవిధంగానూ ఉపయోగపడని ఇటువంటి వ్యక్తులకు జీవించే అర్హత ఉండదు. పరస్త్రీ వ్యామోహం వలన నష్ట పోయిన కౌరవులు, రావణబ్రహ్మ గురించి మనకు తెలుసు. కానీ, తెల్లవారితే, ఎంత మంది రావణులు, కీచకులు,  ధృతరాష్ట్ర పుత్రులూ పుట్టుకు వస్తున్నారో మనం చూస్తున్నాం. ఇటువంటి వారు అందరూ, తమ జీవన విధానాన్ని మార్చుకో లేనప్పుడు, వారికి విధించే మరణ శిక్ష, సమాజానికి మేలే చేస్తుంది. చెడు మార్గంలో వెళ్ళాలి అనుకునే ఎంతో మందికి, హెచ్చరికగా ఉంటుంది. మన చుట్టూ ఉన్నవారిని అందరినీ మంచి మార్గంలో వెళ్ళే వారిగా చేయమని........ కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు