ఎత్తుకు పై ఎత్తు .;- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
 "ప్రభు ఈరోజు అమావాస్య తమరితొలి వేట ఇతరులకు దానం చేసి, కుందేలును వేటాడి తమరు ఆరగిస్తే తమ పదవి,ఆయుష్సు,కీర్తి,శౌర్యం పెరుగుతాయి" అన్నాడు నక్కమంత్రి. "అలానే ఈరోజు తొలివేట ఎవరికో ఎందుకు నీకే దానం చేస్తాను పద "అని,వేటకు నక్కతో కలసి బయలు దేరాడుసింహరాజు.
వాగులో నీరుతాగడానికి వచ్చిన దుప్పి నీటిప్రవాహంలో కొట్టుకుపోతూ, వాగులో పడిఉన్న చెట్టుకొమ్మల్లో తనకొమ్ములు చిక్కుకుని విడిపించు కోలేక అలసిఅలానే ఉండిపోయింది. అదిచూసిన సింహం ఘర్జిస్తు వాగు లోని దుప్పవద్దకు వెళ్ళబోయింది."ప్రభు తొలివేట నాకు అని వాగ్ధానం చేసారు"అన్నాడు నక్క. "సరే నాకు కుందేలు లభించేదాక నువ్వుదుప్పిని తినాలి.అప్పటివరకు నావెంటే ఉండాలి పదా"అని కుందేలు కొరకు బయలుదేరాడు నక్కతో సింహరాజు. విషయం అంతా చెట్టుపైనుండివిన్న పిల్లరామచిలుక, దుప్పిని కాపడమని ఏనుగుతాతకు చెప్పి,కుందేలును వెదుకుతూ బయలుదేరింది.
తెల్లవారుతూనే వచ్చిన  కుందేలును చూసిన కోతి "రా మామా రా  నీకోసం పనసతొనలు ,తేనె దాచి ఉంచాను "అని ఆకుదోనెలో పండిన పనస తొనలు, టెంకాయచిప్పనిండుగా తేనె, కుందేలు ముందు ఉంచాడు కోతి. "అల్లుడు ఈపనస తొనను ఇలా తేనెలో ముంచుకు తింటుంటే ఆహ" అన్నాడు కుందేలు."మామా ఈసృష్టిలో ఏప్రాణి ఆహంరంతింటూ నీరు తాగదు.మనిషిమాత్రం ఆహరం తింటూ నీరు ఎందుకు తాగుతాడు? "అన్నాడు కోతి.
"పొద్దున్నే మీపొట్టలు నింపుకోవడమేనా నన్ను గమనించరా "అన్నది పిల్లరామచిలుక. తేనెలో ముంచిన పనసతొన పిల్లరామచిలుకకు అందిస్తు" ఏమిటి అడవిలోని విషయాలు " అన్నాడు కోతి.
" కుందేలు మామ నీప్రాణలమీదకు వచ్చింది".అంటూ విషయం వివరించింది పిల్లరామచిలుక." ఇప్పుడుఎలా నక్క నామీద కోపంతో సింహరాజును నాపైకి ఉసిగొల్పింది,అల్లుడు ఎలాగైనా కాపాడు "అన్నాడు కుందేలు." మామా కష్టంవచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి,శతకోటి కష్టాలకు అనంతకోటి ఉపాయాలు అన్నారు పెద్దలు.భయపడక నేవేస్తాను ఎత్తుకుపై ఎత్తు ఆదెబ్బతో నక్కబావ చిత్తు".అంటూ కుందేలు చెవివద్ద గుసగుసలాడాడు కోతి. ఆనందంతో తలఊపిన కుందేలు సింహరాజుకు ఎదురు వెళ్ళి "ప్రభువులకు వందనాలు ఈకరువురోజుల్లో ఆహారం దానం చేయడం సాహసమే! నేనే తమదర్శనానికి వస్తున్నా తమరే ఎదురు పడ్డారు "అన్నాడు. "అదిసరే నేను ఈరోజు ఆహరం దానం ఇవ్వబోతున్నాననా నీకు ఎలాతెలుసు "అన్నాడు సింహరాజ.
"రాత్రి వనదేవత నాకు కలలోకనిపించి చాలావిషయాలు చెప్పింది. ముందుగా తమకు సమయం మించిపోకుండా ఒక విషయంచెప్పాలి. తమకు మరణమేలేకుండా ఎప్పుడు ఈఅడవికి తమరే రాజుగా ఉండాలంటే వనదేవత నాకుచెప్పినట్లు పగటిపూట సూర్యుడు సరిగ్గా మనతలపై ఉన్నప్పుడు తమరు నక్కగొంతుకొరికి కొద్దిసేపు కదలకుండా అలానే పట్టుకొండి తమకు నేచెప్పినట్లు మరణమే ఉండదు "అన్నాడు కుందేలు.
ఎర్రబడిన కళ్ళతో నక్కను చుసాడు సింహరాజు. రాబోయే ప్రమాదాన్ని గమనించిన నక్క ,తనను తరుముతున్న సింహరాజుకు అందకుండా ప్రాణభయంతో అడవిలో పరుగుతీస్తు చెరపకురా చెడేవు అని పెద్దలు ఊరికేచెప్పలేదు అనుకుంది.


కామెంట్‌లు