కూర్మావతారము.- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
 క్షీరసాగర మథనంబు జేయగోరి
మిత్రులైరి సురాసురుల్ మేలుపొంద
మందరంబును బెకలించి మార్గమందు
డస్సిపోయిరి వారలు ధైర్యముడుగ.
మందరాచలమును గొని మాటరాక
క్రింద పడవైచి కుమిలిరి కృంగిపోయి
గరుడవాహనారూఢుడై కరుణతోడ 
నత్తెఱంగున శ్రీహరి యరుగుదెంచె.
పర్వతంబును లీలగా పట్టుకొనుచు
విష్ణువు జలధిలో పడవేయ నగుచు
సురలు దైత్యులు కలశాబ్ధిఁ బిరబిరనుచు
చిలుకు చుండగా నచలము ములిగి పోయె.
విఘ్నముల్ తొలగించెడి విష్ణుమూర్తి
కూర్మరూపమున్ దాల్చుచు కొప్పరించి
మందరంబును తానెత్తి మాటనిలిపి
శక్తి చూపెను జగతికి సంతసముగ.
మందరంబును నిల్పెడి మహితశక్తి
బాహుబలముతో విష్ణుండు పాదుకొనగ
నాకసంబున సిద్ధులు హర్షమొంది
పుష్పవర్షము కురిపించి పొంగిరపుడు.//


కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
bagunnayi padyalu gayatri garu