వోని పాఠశాలలో ఘనంగా "తానా" అమ్మ, నాన్న, గురువు పద్యార్చన

 వోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయని బలగ నాగమణి ఆధ్వర్యంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం 'తానా' వారి రూపొందించిన అమ్మ, నాన్న, గురువు శతక పద్యార్చన కార్యక్రమం ఘనంగా జరిగింది. 
ఈ పద్యాలను ఎనిమిదవ తరగతి విద్యార్థిణి సాహుకారు సాయివర్ష నేర్చి,  ఉత్తర అమెరికా తెలుగు సంఘం 'తానా' వారికి వాటిని పఠిస్తూ యుండే వీడియోను పంపినట్లు ప్రధానోపాధ్యాయని బలగ నాగమణి తెలిపారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం 'తానా' మరియు, వంద దేశాల్లో ఉన్న వందకు పైగా తెలుగు సంఘాల సమన్వయంతో, 
వందేవిశ్వమాతరమ్ పేరిట 
చిగురుమళ్ళ శ్రీనివాస్ వంద దేశాల్లో నిర్వహిస్తున్న శాంతి సద్భావన యాత్రలో భాగంగా 'తానా' శతక పద్యార్చన కార్యక్రమాన్ని నిర్దేశించిందని నాగమణి తెలిపారు. 
పాఠశాల ఉపాధ్యాయని పాలవలస శారదాకుమారి మాట్లాడుతూ తానా అధ్యక్షులు నిరంజన్  శృంగవరపు, వందే విశ్వమాతరం ఛైర్మన్ తానా పూర్వ అధ్యక్షులు జయశేఖర్ తాళ్ళూరిల నేతృత్వంలో ప్రపంచవ్యాప్తంగా పదిలక్షలమంది విద్యార్థులను పాల్గొనేలా రూపుదిద్దుకున్న నేపథ్యంలో, అందులో తమ పాఠశాల కూడా పాల్గొనుట ఆనందంగా ఉందని అన్నారు. 
ఉపాధ్యాయని దానేటి పుష్పలత మాట్లాడుతూ  చిగురుమళ్ళ శ్రీనివాస్ రచించిన అమ్మ శతకం ,నాన్న శతకం, గురువు శతకాలలోని పద్యాలను అభ్యసనం చేయుట ద్వారా విద్యార్థులలో తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల మిక్కిలి పూజ్యభావం ఏర్పడుతుందని అన్నారు. పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు మాట్లాడుతూ ప్రపంచంలోగల తెలుగు విద్యార్థులను, 
ఇంతటి పవిత్రమైన కార్యక్రమంలో వారిని భాగస్వామ్యం చేసేలా కృషి చేసిన ఉపాధ్యాయులను ఒక్క తాటి పైకి తెచ్చేలా ఈ శతక పద్యార్చన దోహదపడుతుందని అన్నారు. 
ఈ పద్యాలను నేర్చిన బాలిక సాహుకారు సాయివర్షను ఉపాధ్యాయులు  అభినందించారు.
కామెంట్‌లు