గోదాదేవి ( పంచపదులు)- వరలక్ష్మి యనమండ్ర- అద్దంకి, బాపట్ల జిల్లా
శ్రీ విల్లిపురమునందు విష్ణుచిత్తుడు
విల్లిపురమున దైవం చిన్నికృష్ణుడు 
ఆ విష్ణుచిత్తుడు చూడ కృష్ణభక్తుడు
ప్రతి దినము శ్రీకృష్ణుని కొలిచేవాడు
పుష్పమాలలను అర్పించే వాడతడు...కృష్ణా

విష్ణుచిత్తుని అసలు పేరు భట్టనాథుడు
విష్ణు భక్తుడగుటచే విష్ణుచిత్తుయ్యాడు
పువ్వుల కొరకు ఆతడు తోటపెంచాడు
ఒకరోజు పాదులో ఒకపాపను చూశాడు
భగవంతుని ప్రసాదం పాప అనుకున్నాడు...కృష్ణా

ఆలు మగలు ఎంతగానో సంతసించిరి
కోదై అను నామమును ఆమెకు పెట్టిరి
గోదాదేవిగా ఆమెనందరు పిలువసాగిరి
ఎంతో అపురూపముగ పెంచుచుండిరి
తండ్రి వలన ఆమె కృష్ణభక్తురాలయ్యెను... కృష్ణా

పెరిగే కొలదీ ఆమె భక్తి ప్రేమగా మారెను
కళ్ళు మూసినా తెరచినా కృష్ణుడాయెను
విల్లిపుత్తూరే బృందావనమని ఎంచెను
తనలోనే శ్రీకృష్ణుడున్నాడని తలచెను
ముందుగా పూల మాలలు తానే ధరించెను... కృష్ణా

ఒకనాడు ఆతండ్రి ఇది చూచి బాధపడెను
దేవదేవునికి అపచారం జరిగెనని వగచెను
ఆరాత్రి శ్రీ కృష్ణుడు స్వప్నమందు  కన్పడెను
గోదాదేవి భూదేవి అవతారమని తెలిపెను
పూమాల ఆమె ధరించ తనకానందమనెను.. కృష్ణా

ఈ సంఘటనతో ప్రేమ మరీ ఎక్కువయ్యెను
పెళ్ళి జరిగితే కృష్ణుడే తన భర్త యనుకొనెను
గోపికలు చేసినట్టి కాత్యాయనీ వ్రతం చేసెను
అందుకున్న నియమాలన్నియును పాటించెను
తన స్నేహితులతో కూడా వ్రతము చేయించెను... కృష్ణా

ఈ వ్రతం చేయు విధానము తెలియ జేసెను
తనలో ఉన్న భక్తిని ఆండాళ్తల్లి నిరూపించెను
ముప్ఫై పాశురములను పాడి వినిపించెను
కృష్ణుడు గోదా ప్రేమకు, భక్తి ముందు లొంగెను
విష్ణుచిత్తునితో ఆమెను పెండ్లాడెదననెను... కృష్ణా

ఆండాళ్ తల్లిని శ్రీరంగమునకు తెమ్మనెను 
అచటే ఆమెను వివాహమా డెదననెను 
గోదాదేవినీ ప్రజలనూ తీసుకుని వెళ్ళెను
అందరూ ఆనందముగ శ్రీరంగం చేరెను
అర్చకులు అందరికీ ఆహ్వానము పలికిరి...కృష్ణా

అందమైన గోదాదేవి పెండ్ల కూతురాయెను
అందముగా ఆమె గర్భగుడిలో ప్రవేశించెను
చూస్తుండగనే రంగనాథునిలో ఐక్యమయ్యెను
మకర సంక్రాంతి ముందురోజు ఇదంతా జరిగెను
భోగిరోజు గోదా కళ్యాణం చేయుట పరిపాటైనది...కృష్ణా

వ్రతాచరణ సమయపు రచన పాశురములు
ఉపోద్ఘాతము మొదటి ఐదు పాశురములు
తెలుపును తిరుప్పావై ముఖ్య ఉద్దేశ్యములు
పల్లెవాతావరణం, పూజలు తదుపరి అంశాలు
తానే రచించి పాడితినని చివరి పాశురపు భావం... కృష్ణా

కామెంట్‌లు