వినూత్న వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థ; - సి.హెచ్.ప్రతాప్
 భారతదేశంలోని ఘన వ్యర్థాలు నేడు పట్టణ నిర్వాహకులకు ఒక  సవాలుగా మారింది.భారతదేశం సంవత్సరానికి 30 మిలియన్ టన్నుల పట్టణ ఘన వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుందని సుమారుగా అంచనా వేయబడింది . దేశంలోని మొత్తం జనాభాలో పట్టణ జనాభా వాటా దాదాపు 27 శాతం మరియు తలసరి వ్యర్థాలు రోజుకు 0.1 కిలోల నుండి 0.6 కిలోల మధ్య మారుతూ ఉంటాయి, సగటున 0.33 కిలోలు  దాని సంక్లిష్టత, ధర మరియు సాంకేతికత కొరత కారణంగా ప్రస్తుత నిర్వహణ వ్యూహాలు అసమర్థమైనవి మరియు నిర్దేశిత లక్స్యాలను సాధించలేకపోతోందని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణా రాష్ట్రం, హైదరాబాద్ నగరంలోని బోయిన్‌పల్లి వెజిటబుల్ మార్కెట్ అమలు చేస్తున్న వినూత్న వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిని ఆకర్షించింది.ప్రధాని మోదీ  మన్ కీ బాత్ ఎపిసోడ్‌లో బయోఎలక్ట్రిసిటీ, జీవ ఇంధనం మరియు బయో-ఎరువు ఉత్పత్తి ప్రాజెక్ట్‌ను ఎంతగానో  ప్రశంసించారు. మార్కెట్‌లోని వ్యర్థాలు ఇప్పుడు సంపదగా మారుతున్నాయని పేర్కొన్న ప్రధాని “సబ్జీ మండీలలో కూరగాయలు అనేక కారణాల వల్ల కుళ్ళిపోయి, అపరిశుభ్రమైన పరిస్థితులను వ్యాప్తి చేయడం మనం గమనించాము. అయితే హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి కూరగాయల వ్యాపారులు వ్యర్థ కూరగాయలతో విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది ఆవిష్కరణ యొక్క శక్తి” అని తెలిపారు. ఇది మన తెలుగువారందరికీ ఎంతో గర్వ కారణం.కొన్నేళ్ల క్రితం కూరగాయల వ్యర్థాల నుండి విద్యుత్తును ఉత్పత్తి చేయడం చాలా విచిత్రమైన ఆలోచన, కానీ ఇప్పుడు కాదు. ఎందుకంటే హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్‌ దీన్ని ఆచరణలో చూపుతోంది. మార్కెట్‌లో ప్రతిరోజూ దాదాపు 10 టన్నుల వ్యర్థాలు సేకరించబడతాయి. ఇది ఇంతకుముందు  వ్యర్ధ పదార్ధంగా మిగిలేది. కానీ ఇప్పుడు అది కూరగాయల మార్కెట్‌కు ప్రధాన విద్యుత్ వనరుగా మారింది.ఈ మార్కెట్‌ నుంచి సేకరించే  కూరగాయలు, పండ్ల వ్యర్థాలతో  దాదాపు 500 యూనిట్ల విద్యుత్‌, 30 కిలోల జీవ ఇంధనం ఉత్పత్తి అవుతోంది. ఇక్క ఉత్పత్తి చేయబడిన విద్యుత్తు ఇక్కడి వీధిలైట్లు, 170 స్టాల్స్, పరిపాలన భవనం మరియు నీటి సరఫరా నెట్‌వర్క్‌కు విద్యుత్తును అందిస్తుంది.అలాగే ఉత్పత్తి చేయబడిన జీవ ఇంధనం మార్కెట్  వాణిజ్య వంటగదికి పంప్ చేయబడుతుంది.మార్కెట్‌లో ఏర్పాటు చేసిన క్యాంటీన్ కూడా ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేయబడ్డ విద్యుత్ ద్వారా నడుస్తోంది.మార్కెట్ యార్డుకు అవసరమైన 650-700 యూనిట్ల విద్యుత్తుకు 7-8 టన్నుల కూరగాయలు అవసరం. సగటున 400 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి వ్యర్థాలు ఉత్పన్నమవుతాయి. ఫలితంగా మార్కెట్‌ కూడా శుభ్రంగా మరియు కాలుష్య రహితంగా ఉంటోంది. ఇటువంటి కాలుష్యరహిత విధానాలను ఇప్పుడు దేశమంతా అమలు చేయాల్సిన అవసరం ఎంతో వుంది.
కామెంట్‌లు