పంచుకుంటే.....: సరికొండ శ్రీనివాసరాజు

 సిరికొండ ఉన్నత పాఠశాలలో సుష్మ,  శ్రావణిలు ఒకే తరగతి చదువుతున్నారు. చిన్నప్పటి నుంచి పోటాపోటీగా చదివేవారు.  ఎప్పుడు ఎవరు మొదటి ర్యాంకు వస్తారో చెప్పడం కష్టం.  తరచూ ఇద్దరూ సమానమైన మార్కులతో వచ్చేవారు.  కానీ ఒకరు అంటే మరొకరికి ఈర్ష్యా భావం ఉండేది.  ఒకరితో మరొకరు మాట్లాడుకోక పోయేవారు.  ఇప్పుడు ఇద్దరూ 10వ తరగతికి వచ్చారు. 
       ఆ తరగతిలో శ్రుతి అనే అమ్మాయి కొత్తగా చేరింది.  కొత్త వాతావరణం.  కానీ శ్రుతికి పట్టుదలతో చదివి,  గొప్ప మార్కులు సాధించాలని ఎంతో ఉండేది.  సుష్మ తెలివైన అమ్మాయి అని తెలిసి, శ్రుతి సుష్మ వద్దకు చేరింది.  తనకు ఈ వాతావరణం కొత్త అని,  సుష్మతో కలసి కంబైన్డ్ స్టడీ చేయాలని ఉందని,  శ్రుతి కోరుతుంది.  కానీ శ్రుతితో కలసి చదివితే టైం వేస్ట్ అని,  తన ర్యాంకు దిగజారుతుంది అని అది తన శత్రువుకు లాభదాయకమని సుష్మ భావించింది.  కంబైన్డ్ స్టడీకి ఒప్పుకోలేదు.  శ్రావణి కూడా తనంత తెలివైన అమ్మాయి అని,  శ్రావణి దగ్గరకు వెళ్ళమని సుష్మ కోరుతుంది. శ్రుతి శ్రావణి వద్దకు వెళ్ళి, అడిగింది.  శ్రావణి ఒప్పుకుంది. 
     శ్రుతి,  శ్రావణిల కంబైన్డ్ స్టడీ పుణ్యమా అని,  కొద్ది రోజుల్లోనే శ్రుతి శ్రావణి అంత తెలివైన అమ్మాయి అయింది. శ్రావణి మార్కులు కూడా మరింత మెరుగైనాయి. అందుకే అన్నారు పెద్దలు పంచుకుంటే పెరిగేది విద్య అని.  ప్రీ ఫైనల్స్ లో శ్రావణి,  శ్రుతి సమానమైన మార్కులతో క్లాస్ ఫస్ట్ వచ్చారు.  సుష్మ థర్డ్ ర్యాంకు వచ్చింది.  పబ్లిక్ పరీక్షల్లో కూడా ఇదే పునరావృతం అయింది.  

కామెంట్‌లు