కంగారు పడొద్దు: - - యామిజాల జగదీశ్
 గుడిలో కొబ్బరికాయ కొట్టేటప్పుడు అది పాడై పోయిందని తెలిస్తే మనసు ఎంతో బాధపడుతుంది.‌ జరగరానిదేదో జరిగిందని బాధపడతాం. ఎక్కడ ఏ తప్పు జరిగిందో, ఏం జరుగుతుందో అని పరి పరి విధాలా ఆలోచిస్తాం. ఇది సహజం. 
అయితే ఓ ఆలయ అర్చకులు చెప్పిన మాటలతో ఊపిరి పీల్చుకోవచ్చు. ఆయన చెప్పే మంచి మాటలు పాజిటివ్ ధోరణిలో ఉన్నాయి. అవేంటో చూడండి.....
కొబ్బరికాయ పాడై పోయిందని బాధపడకండి. ఆందోళన చెందకండి. దిష్టి వంటివేవైనా ఉంటే ఇటువంటి వాటితో పోతాయి. భగవంతుడి సన్నిధిలో ఏం జరిగినా అది మంచికే అని అనుకోండి. అంతేతప్ప కంగారు పడకండి.
ఆయన చెప్పిన ఈ మాటలు ఉత్తమం. నిజం కూడా. ఇందులో  ఏముంది, ఇంకొక కొబ్బరికాయ కొనుక్కొచ్చుకుని  కొట్టండి. మీ జీవితం ఉన్నతంగా ఉంటుందంటారాయన.
బాధ పడే మనసుకి దేవుడే వచ్చి నాలుగు మంచి మాటలు చెప్పి దీవించేడా అన్నట్లనిపిస్తుంది. మనసూ తేలికవుతుంది.
వెలిగించిన దీపం ఆరిపోయినా, కర్పూరం ఆరిపోయినా ఆందోళన తగదు. చేసే పనిలో అప్రమత్తంగా ఉండాలి, ఆలోచించి చెయ్యాలని దేవుడు చెప్పినట్లు అనుకోవాలి. అంతేతప్ప మరొకటి కాదన్నది ఆ అర్చకుల మాట.

కామెంట్‌లు