ఎందుకు తలఫై అక్షతలు వేసి ఆశీర్వదిస్తారు?: - సేకరణ:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 అక్షతలు అంటే మనకందరికీ తెలుసు.
బియ్యంలో పసుపు కలిపి ఏ పండగ వచ్చినా, ఏదైనా శుభకార్యాలు జరిగినా, దేవాలయాలలోను మన పెద్దలు మనల్ని అశీర్వదించడానికి  మన తలఫై అక్షతలు వేస్తారు.  
అయితే ఈ అక్షతలు వెయ్యడంలోని పరమార్థం ఏమిటో  తెలుసుకుందాం.

అక్షతలు అంటే క్షతం కానివి అని అర్థం.అంటే రోకలి పోటుకు విరగనివి అని. శ్రేష్ఠమైన బియ్యం అన్నమాట.
అలాంటి బియ్యాన్ని పసుపు మరియు  నెయ్యితో లేక,నూనెతో కలిపి అక్షతలు తయారు చేస్తారు.
నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ధాన్యాన్ని దాన వస్తువుగా పేర్కొంటారు.
ఆ రకంగా నవగ్రహాలలో చంద్రుడికి 
ప్రీతి కరమైన దానవస్తువు బియ్యం.  చంద్రుడు మనస్సుకు అధినాయకుడు.
మనిషి మనసు, బుద్ధి, గుణము, వ్యసనము వీటన్నిటికి చంద్రుడే  కారణమని, మనిషిపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా  ఉంటుంది అని మన  పెద్దల నమ్మకం. 
అందుకే  ఆ చంద్రుడికి సంకేతమైన బియ్యం కూడా మనిషి మనస్సుపై ప్రభావం చూపుతాయని, మనోధర్మాన్ని నియంత్రిస్తాయని గట్టిగా విశ్వసిస్తారు.  అందుకే అక్షతలను తలఫై వేసి ఆశీర్వదిస్తారు. 
సైంటిఫిక్ గా చెప్పాలంటే బియ్యానికి విద్యుత్ శక్తిని గ్రహించే  తత్వం ఉంది.  దేహం ఓ విద్యుత్‌ కేంద్రం. విద్యుత్‌ సరఫరాల్లో హెచ్చుతగ్గులు సాధారణం. 
ఈ వ్యత్యాసాలు మనిషి మనస్సు మీద, ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి. 
పెద్దలు మన ఫై అక్షతలు వేసి ఆశీర్వదించే సమయంలో, వారి దేహంలోని విద్యుత్తులో కొంత భాగం ఈ అక్షతలను తాకుతాయి. 
ఆశీస్సులు ఇచ్చే వాళ్ల నుంచి, పుచ్చుకొనే వాళ్లకి కొంత విద్యుత్‌ బదిలీ అవుతుంది. అంతే కాదు.
మనిషి దేహంలో విద్యుత్‌ కేంద్రాలు ఇరవై నాలుగు ఉంటాయట. వాటిలో ప్రధానమైనది శిరస్సు. ఇది విద్యుదుత్పత్తి కేంద్రమే కాదు,  విద్యుత్‌ ప్రసార కేంద్రం కూడా. 
తలపై అక్షతలు వేయడం ద్వారా వాటిలోని విద్యుత్‌ను గ్రహించి దేహానికి ప్రసారం చేస్తుంది శిరస్సు. ఈ కారణంగా అక్షతల ద్వార  పెద్దలలో ఉండే సాత్విక గుణం పిల్లలకు లభిస్తుంది.  ఇక పసుపు క్రిమి సంహారకం. ఆశీస్సులు ఇచ్చే వారికీ ఎటువంటి చర్మ వ్యాధులు లాంటివి ఉన్నా అవి ఆశీస్సులు పుచ్చుకొనేవారికి రాకుండా ఉంటాయి.పెద్దలు, విద్వాంసులు, గురువులు, తల్లిదండ్రులు  శుభకార్యాలలో మనకు అక్షతలు వేసి శిరస్సును తాకి ఆశీర్వదించడంలోని ఆంతర్యం, పరమార్థం ఇదే!  
ఆధ్యాత్మికంగా చెప్పాలంటే జీవుడికి సంకేతం బియ్యమేనట. 
“అన్నాద్భవన్తి భూతాని”అని భగవద్గీత లో మూడవ అధ్యాయంలో చెప్పబడింది.  
జీవులు అన్నం చేత పుడతారట. ఈ అన్నం తయారీకి మనం ఉపయోగించే ధాన్యం బియ్యం. భగవంతునిపై అక్షతలు వేసి నమస్కరించడం అంటే, జీవుడు ఈ అన్నంలో పుట్టీ, తిరగి ఈ జీవుడిని భగవంతుడిలోకి చేర్చడమే.
—-------------------------------

కామెంట్‌లు