జిత్తులమారికి శాస్తి -: సరికొండ శ్రీనివాసరాజు
   ఆ అడవిని పరిపాలించే సింహం అడవి జీవులను కన్న బిడ్డల్లా చూస్తూ, వాటికి ఏ కష్టమూ రావివ్వడం లేదు. ఆ సింహం పరిపాలన శాశ్వతంగా ఉండాలని అన్ని జీవులూ కోరుకుంటున్నాయి. 
    ఒక జింక సింహం పరిపాలనకు సంతోషపడి, తన మిత్రులు ప్రతి ఒక్కరికి గొప్పగా చెప్పేది. ఇది ఒక రామచిలుక వినసాగింది. ఒకరోజు జింక ఒక కుందేలుతో "అబ్బా! ఈ సింహం పరిపాలన చూస్తుంటే ఈ అడవిలోనే శాశ్వతంగా ఉండాలని అనిపిస్తుంది." అన్నది. చిలుక సింహం వద్దకు వెళ్ళి, "మహారాజా! ఒక జిత్తులమారి జింక మీ మీద చెడుగా ప్రచారం చేస్తుంది. మీ పరిపాలనలో జంతువులకు కష్టాలు వస్తున్నాయట. మీ పాలన తొందరగా అంతం కావాలట." అని చెప్పింది. సింహం నవ్వింది. మరోసారి జింక ఒక తాబేలుతో "సింహం వంటి మంచి రాజు భవిష్యత్తులో రారు." అని చెప్పింది. అది విన్న రామచిలుక సింహం వద్దకు వెళ్ళి, "మహారాజా! ఆ జింకకు రాజు కావాలని ఆశ ఉందట. మీ పరిపాలన అస్సలు వద్దట." అని చెప్పింది. సింహం మళ్ళీ నవ్వింది. ఇలా ప్రతీ జంతువుతో జింక సింహం పరిపాలన గురించి గొప్పగా చెప్పడం, అది విన్న రామచిలుక సింహం వద్దకు వెళ్ళి, జింక సింహం గురించి చెడుగా ప్రచారం చేస్తుంది అని చెప్పడం మామూలు అయింది. సింహాన్ని రెచ్చగొట్టడం మొదలు పెట్టింది రామచిలుక. "ఆ జింకకు ఒకవేళ మీరు కనబడితే మిమ్మల్ని బాగా పొగుడుతుంది. మీరు లేనప్పుడు మీ గురించి చెడు ప్రచారం చేస్తుంది. మిమ్మల్ని ఎదురుగా పొగిడే ప్రతి ఒక్కరినీ నమ్మవద్దు. భవిష్యత్తులో అలాంటి వారితో పెద్ద ప్రమాదం పొంచి ఉందని మరీ మరీ చెప్పింది చిలుక. ఎలాగైనా ఆ జింకను అంతం చేయాలని సింహానికి నూరి పోసింది.
    ఒకరోజు సింహం ఆ జింక వద్దకు తీసుకు వెళ్ళమని రామచిలుకను కోరింది. రామచిలుక తీసుకు వెళ్లింది. "మళ్ళీ చెబుతున్నా! మీ ఎదురుగా మిమ్మల్ని పొగుడుతూ తన గొప్పలు చెప్పుకుంటూ ఇతర జీవుల గురించి చెడుగా చెబుతూ ఉంటే వాటిని అస్సలు నమ్మరాదు." అంటూ అక్కడి నుంచి ఎగిరి ఎక్కడికో పోయింది.
    సింహం జింకను గుర్రుగా చూస్తూ ఉంది. జింక బిత్తరపోయింది. అది చూసిన నెమలి సింహం వద్దకు వచ్చి, "జింక ఏం నేరం చేసింది మహారాజా!" అన్నది. "నా గురించి అడవి అంతా చెడు ప్రచారం చేస్తూంది," అన్నది సింహం. "అయ్యో! మీ గురించి, మీ పరిపాలన గురించి, కనిపించిన ప్రతి జీవికీ గొప్పగా చెపుతుంది. నిజంగా జింకది మోస బుద్ధి ఆయితే మీ ఎదురుగా మిమ్మల్ని పొగుడుతూ తన అవసరాలని తీర్చుకుంటూ మీరు అటువైపు వెళ్ళగానే మీ గురించి ఇతర జీవులకు చెడుగా ప్రచారం చేస్తుంది." అన్నది నెమలి.
      సింహం ఆలోచనలో పడింది. రామచిలుక ఇవే మాటలు చెప్పింది. ఇప్పుడు నెమలి ఇవే మాటలు చెప్పింది. తనను నిత్యం కలుస్తూ, తనను పొగుడుతూ, ఇతర జీవులలో లోపాలు చెబుతూ తనను ప్రసన్నం చేసుకుంటూ, తన అవసరాలను తీర్చుకునేది నక్క. ఆ నక్క స్వభావం ఎలాంటిదో అడవి జీవులను అడిగింది. నిత్యం సింహం గురించి చెడుగా ప్రచారం చేస్తూ ఉందట. నక్క ఆటలు కట్టించడానికి రామచిలుక, నెమలి భలే ఉపాయం పన్నాయి. అవును. ఎదురుగా పొగిడే ప్రతి ఒక్కరినీ నమ్మరాదు. ఆధారాలు లేకుండా స్వార్థానికి ఇతరుల గురించి చేసే చెడు ప్రచారం నమ్మవద్దు అనుకుంది సింహం.
        మరునాడు యథావిధిగా నక్క సింహం వద్దకు చేరి, ఎదో చెప్పబోయింది. సింహం కోపంగా నక్క పైకి దూకి దాన్ని చంపి వేసింది.

కామెంట్‌లు