సమ న్యాయం!!:-ఎం. వి.ఉమాదేవి.
   ఓ రైతు ఇంటి ఆవరణలో బాతులతో  కోళ్ళు కలసి తిరుగుతూ ఉండేవి. కొన్నాళ్ళకి వాటికి ఎందుకో ఒకరిపై ఒకరికి అసూయా ద్వేషాలు ఏర్పడ్డాయి. 
కోళ్ళు అనుకున్నాయి కదా... "ఈ బాతులకి రాజభోగం. గింజలు వేస్తారు, మళ్ళీ చెరువులో కాలువలో తిప్పినపుడు చేప పిల్లలూ, పురుగులు గట్రా బాగా మెక్కుతాయి! అందుకే బొద్దుగా ముద్దుగా ఉంటాయి. ఆ పెద్ద గుడ్డు  చూస్తే తెలుస్తుంది యెంత ఆహారం తింటాయో! మేమే దిబ్బల్లో కాళ్ళతో చెలిగి చెలిగి ఆహారం వెతుక్కోవాలి. పురుగులు దొరక్కపోతే వివిధ రకాల ఆకులు అయినా తినాలి. మా యజమానికి సమ న్యాయం లేదు!" అని కోళ్ళు అనుకున్నాయి.
ఇక బాతులేమో, "ఆ కోళ్ల పనే హాయిగా ఉంది. రాత్రంతా గూట్లోనో, గంప కిందో వెచ్చగా నిద్ర పోతాయి. మేమేమో పశువుల కొట్టంలో ఓ పక్క గడ్డిలో ఉంటాం. కోళ్ళకి లేవగానే తవుడులో అన్నము గింజలు కలిపి ముద్దలు వేస్తారు. ఇక వాటి ఇష్టం వచ్చినట్టు ఊర్లో తిరిగేదే! మమ్మల్ని చాలా దూరంలో కాలువ దగ్గరికి తీసుకు పోతారు. ఈదుతూ చేప పిల్లలను, పురుగులనూ పట్టుకోవాలి. ఎంత కష్టం? ఈ రైతు కి సమ న్యాయము తెలియదా?" అని తీర్మానం చేసేయి.
దాంతో అవి మధ్యాహ్నం అప్పుడు ఇంట్లొ చేరి తరచూ కాళ్ళతో తన్ను కోవడం, కలబడి పొడుచుకోవడం చేస్తున్నాయి. బాతుల ముక్కు పొడవడానికి వీలు లేదు. వెడల్పుగా నున్నగా వుంటుంది. అదీ బురద నీటిలో పురుగులు పట్టుకోవడం కోసమే అలా అమరిక ఉంటుంది. బొద్దుగా ఉండటం వల్ల అవి కొంచెం కూడా ఎగరలేవు. గున గునా నడుస్తాయి అంతే.
 కోడి పుంజులను పందాల్లో వాడతారు. ఎగిరెగిరి కాళ్ళతో తన్న గలవు.  వాటికి   పదునైన ముక్కూ గోళ్ళు ఉండటం చేత పిల్లల కోడి గద్దల్ని కూడా పొడిచి తరమ గలదు. పుంజులూ వేకువనే లేచి ఇల్లెక్కి కొక్కొరోకో అని పనికి వెళ్ళే వాళ్ళని హెచ్చరికతో లేపుట ,గుడ్డు పెట్టే వేళలో యజమాని గంపకింద కప్పి ఉంచేలా సంకేతాలు ఇవ్వడం ద్వారా ఆ పని పూర్తి చేస్తాయి.
రైతు వాటి మధ్య గొడవ విని, బాతుల్ని ఇంట్లో ఉంచి, గింజలు వేసి, కోళ్ళను కాలువ దగ్గరికి తీసుకొని పోవడం మొదలెట్టాడు. 
నాలుగు రోజులకు వాటికి తేడా తెలిసివచ్చింది. బాతులకీ ఆహారం చాల లేదూ, కోళ్లకి కాలువలో ఈదటము ఆహార సేకరణ రాదు!  సమ న్యాయం అంటూ తమ సౌకర్యం అంతా చెడ గొట్టుకున్నామనీ అర్థం చేసుకొని రైతుతో మొర పెట్టుకున్నాయి. దాంతో రైతు నవ్వుకొని , మళ్ళీ మునుపటి లాగే కోళ్లను వాకిట్లో వదిలి, బాతులను కాలువకి తోలుకొనిపోయాడు!!

కామెంట్‌లు