వేసవి సెలవుల్లో అమ్మమ్మ గారి ఇంటికి చేరారు అంతా. వాసు ఎంతో సంతోషంగా ఉన్నాడు. తనివి తీరా ఆడుకోవచ్చు అని కలలు కన్నాడు. కానీ అవి కల్లలే అయినాయి. టీవీలు, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయారు అంతా. క్రికెట్ పిచ్చితో టీవీ, మిగతా సమయం అంతా ఫోన్లతో అతుక్కుపోయారు. బాబోయ్! రోజులో 80 శాతం సమయం ఫోన్లతో కాలక్షేపం. మిగతా సమయం క్రికెట్. విసుగ్గా ఉంది వాసు మరియు వాణీకి. వాళ్ళు తాతయ్య దగ్గరకు చేరి, తమ గోడు వెళ్లబోసుకున్నారు. తాతయ్య మాత్రం ఏమి చేస్తాడు.
తాతయ్య దగ్గర పురాణ గ్రంథాలు మరియు అనేక నీతి కథల పుస్తకాలు ఉన్నాయి. రోజూ వాసూను మరియు వాణీని చెరో పక్క కూర్చోబెట్టుకుని, తనకు కళ్ళు సరిగా సహకరించడం లేదని, ఆ కథలను చదివి వినిపించమని వేడుకున్నాడు. ఇద్దరూ తాతయ్యకు అతుక్కుని కూర్చుని, తలా కాసేపు చదివి, వినిపించడం చేస్తున్నారు. తేలిక భాషలో ఉన్న పురాణ కథలు అన్నిటినీ చదివి, వినిపించారు. ఆ తర్వాత రకరకాల నీతి కథల పుస్తకాలను చదివి వినిపించారు. ఫలితంగా వాసు మరియు వాణీకి రామాయణ, మహాభారత కథలన్నీ తెలుసుకునే అదృష్టం కలిగింది. ఆ తర్వాత పంచతంత్రం మొదలుకొని అనేక నీతి కథలను స్వయంగా చదివి తెలుసుకున్నారు. ఈ వేసవి సెలవులు ఈ అన్నా చెల్లెళ్లకు ఇద్దరికీ తీపి జ్ఞాపకాలను మిగిల్చింది.
ఫలితంగా ఈ ఇద్దరూ తీరిక సమయాలలో తమ మిత్రులకూ కథలు చెప్పడం చేస్తున్నారు. ఈ అన్నా చెల్లెళ్లు ఇద్దరూ కొత్త కొత్త ఆలోచనలతో కొత్త నీతి కథలను రాసి, పత్రికలకు పంపుతూ మంచి రచయితలు అయ్యారు. మొబైల్ ఫోన్లకు, టీవీలకు బానిసలుగా మారిన వారికి భవిష్యత్ ముండ్ల బాటలో నడకే. తీరిక సమయాలను సద్వినియోగం చేసుకోవాలి. మంచి పుస్తక పఠనానికి బానిసలు అయితే ఉజ్జ్వల భవిష్యత్తు ఉంటుంది.
హస్త భూషణం: - సరికొండ శ్రీనివాసరాజు
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి