తీరం తాకని అలలు...?:- కవి రత్న సాహిత్య ధీర| సహస్ర కవి భూషణ్ పోలయ్య కూకట్లపల్లి, -అత్తాపూర్, హైదరాబాద్
ఈ రోజు
దూరంగా నాటిన మొక్కలు
రేపటికి కొమ్మలు రెమ్మలతో
ఆకుల రెక్కలతో వీచే గాలికి 
ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటాయ్...
ప్రక్కకు పెరిగి జరిగి జరిగి ఒక్కటౌతాయి...

కానీ మనుషులు?
పెరిగేకొద్దీ పచ్చని చెట్టులా 
ఎంత ఎత్తుకు ఎదిగినా
ప్రేమ ఫలాలను పంచలేరు 
ఎదుటివారిని గౌరవించలేరు...

కారణం ఒక్కటే... 
వారి మధ్య అంతులేని అగాధాలు...
తెగిన బంధాలు అనుబంధాలు... 
కులాలసంకెళ్లు...మతాల అడ్డుగోడలు...
జాతి...వర్ణ...వర్గ...లింగ ప్రాంత బేధాలతో
అధికారం అహంకారం స్వార్థ చింతనలతో
మనసులు మసక బారిపోవడమే...

"నేను" అనే నీడ
"మనం" అనే బంధాన్ని మింగేయడమే...
"నేనే" అనే అహంకారం 
మదిలోని ప్రేమలతలను తుంచేయడమే...

అందుకే ఈ లోకంలో ఓ మనిషీ..!
నీ జీవితం "నందనవనం" కావాలంటే... 
నీ జీవిత నావ ఆవలి తీరం చేరాలంటే...
పరులకు "ప్రేమ పరిమళం" పంచాలి...
గౌరవం...ఓ చిరుజల్లై కురవాలి...
సహనం శాంతి...వృక్షాలై వికసించాలి...
సమభావమే నవ జీవనతత్త్వం కావాలి...



కామెంట్‌లు