పల్లీలతో మనం అనేక రకాల వంటలను చేసుకుంటుంటాం. కొందరు పల్లీలతో పచ్చడి, ఫ్రైలు చేసుకుని తింటారు. కొందరు వీటితో రకరకాల తీపి వంటకాలను తయారుచేసుకుని ఆరగిస్తారు. అయితే కేవలం రుచికే కాదు, ఆరోగ్యాన్ని అందించడంలోనూ పల్లీలు అద్భుతంగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా పల్లీలను నిత్యం గుప్పెడు మోతాదులో తింటుంటే హార్ట్ ఎటాక్ లు రావని శాస్త్రవేత్తలు చేపట్టిన అధ్యయనాల్లో తేలింది. నిత్యం 30 గ్రాముల మోతాదులో పల్లీలను తీసుకుంటే గుండె సమస్యలు రాకుండా చూసుకోవచ్చని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పల్లీల్లో ఉండే మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మెదడు చురుగ్గా మారుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. దీని వల్ల గుండె జబ్బులు కూడా రావని, ముఖ్యంగా హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. కనుక ఎవరైనా నిత్యం పల్లీలను ఆహారంలో భాగం చేసుకుంటే గుండె సమస్యలు రాకుండా చూసుకోవచ్చని వారు అంటున్నారు. నేల లోపల కాస్తాయి కాబట్టి వీటిని గ్రౌండ్నట్స్ అనీ అంటారు. దక్షిణ అమెరికాలోని పెరూ వీటి స్వస్థలం. అక్కడనుంచి అన్ని ప్రాంతాలకూ విస్తరించాయి.
ప్రస్తుతం వీటి ఉత్పత్తిలో చైనా భారత్లదే అగ్రస్థానం. అయినప్పటికీ ఈ రెండు దేశాలనుంచి ఎగుమతుల శాతం చాలా తక్కువ.
అటువంటి వేరుశనగ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వేరుశనగ బలమైన ఆహారం. ఇవి నూనె గింజలు. ఈ గింజలలో నూనె శాతం ఎక్కువ. వంట నూనె వంట ప్రధానంగా వీటి నుండే తీస్తారు. భారత్ యావత్తూ పండే ఈ పంట, ఆంధ్రలో ప్రధాన మెట్టపంట. నీరు తక్కువగా దొరికే రాయలసీమ ప్రాంతంలో ఇది ప్రధాన పంట.
వేరుశెనగ జన్మస్థసం దక్షిణ అమెరికా. వేరుశెనగ ఉష్ణ మండల నేలలో బాగా పెరుగుతుంది. గుల్లగా వుండే వ్యవసాయ భూములు అనుకూలం. ఇండియా, ఛైనా, దక్షిణ ఆసియా, ఆగ్నేయ ఆసియా ఖండ దేశాలలో వేరుశెనగ నూనె వాడకం ఎక్కువ.
వేరుశనగ 'లెగుమినస్' జాతికి చెందిన మొక్క. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకోగలదు. వేరుశనగ పువ్వులు బయట ఫలధీకరణ చెందిన తరువాత. మొక్క మొదలు చుట్టు భూమిలోనికి చొచ్చుకు వెళ్ళి కాయలుగా మారుతాయి.
వేరుశనగ విత్తన మొలక సమయంలో 14 - 16 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం. తొలకరి వర్షాలు అయ్యాక విత్తడం ఆంధ్రలో పరిపాటి. ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమలో వేరుశనగ సాగు అధికం. పంట కాయకొచ్చేవేళ ఉష్ణోగ్రత 23 – 25 సెంటిగ్రేడ్ డిగ్రీలు ఉంటే పంట దిగుబడి పెరుగుతుంది. దక్షిణ భారతంలో ఖరీప్, రబీ రెండు సీజనులలో వేరుశనగ పంటను సాగు చేస్తారు.
వేరుశనగ చౌకగా దొరికే మాంసకృత్తులు ఉన్న శాకాహారం. ఒక కిలో మాంసంలో లభించే మాంసకృత్తులు అదే మోతాదు వేరుశెనగలో లభిస్తాయి . ఒక కోడి గుడ్డుకి సమానం వేరుశెనగ పప్పును తీసుకొని అంచనా వేస్తే గుడ్డులో కంటే రెండున్నర రెట్లు ఎక్కువగాగానే మాంసకృత్తులు ఉంటాయి. పారిశ్రామికంగానూ వేరుశనగలు ఉపయోగమే. నైట్రోగ్లిజరిన్, సబ్బులు, రంగులు, వార్నిష్, కీటకసంహారిణుల తయారీలోనూ వీటిని వాడుతుంటారు. వీటిల్లోని ప్రోటీన్ నుంచి వస్త్రాలకు సంబంధించిన దారాల్ని సైతం రూపొందిస్తారు. శరీరంలోని భాగాలన్నీ చక్కని సమన్వయంతో పని చేయాలంటే శక్తి, ప్రొటీన్, ఫాస్ఫరస్, థైమీన్, నియాసిన్ అనే ఐదు పోషకాలూ ఎంతో అవసరం. ఈ ఐదు రకాలూ వేరుసెనగపప్పుల్లో పుష్కలంగా లభ్యమవుతాయి. ఎ, బి, సి, ఇతో కలిపి వెుత్తం 13 రకాల విటమిన్లూ, ఐరన్, కాల్షియం, జింక్, బోరాన్ వంటి 26 రకాల కీలక ఖనిజాలూ వీటిల్లో ఉన్నాయి. పల్లీల్లో గుండెకు మేలు చేసే వోనో అన్శాచ్యురేటెడ్ కొవ్వుల శాతమే ఎక్కువ. ఇందులోని ప్రోటీన్శాతం మాంసం, గుడ్లలోకన్నా ఎక్కువ. పెరిగే పిల్లలకూ గర్భిణులకూ పాలిచ్చే తల్లులకూ ఇవి ఎంతో మంచివి. వేయించిన తాజాగింజల్ని బెల్లం, మేకపాలతో కలిపి ఇస్తే రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ముక్కునుంచి రక్తం కారుతుంటే కాసిన్ని వేరుసెనగపప్పు తింటే తగ్గుతుంది. అలాగే నెలసరి సమయాల్లో అధిక రక్తస్రావంతో బాధపడే మహిళలు కొంచెం పల్లీలు నానబెట్టి బెల్లంతో కలిపి తింటే ఐరన్తోపాటు అన్ని రకాల పోషకాలూ అందుతాయి. యాంటీఆక్సిడెంట్లకు ఇవి మంచి నిల్వలు. వేయించిన పల్లీల్లో అయితే వీటి శాతం బ్లాక్బెర్రీ, స్ట్రాబెర్రీల్లోకన్నా ఎక్కువ. క్యారెట్లు, బీట్రూట్లతో పోలిస్తే ఇంకా ఎక్కువని ఇటీవల పరిశోధనల్లో తేలింది. వృద్ధాప్యం దరిచేరకుండా నిత్యయవ్వనంతో ఉండేలా చేస్తుంది. నియాసిన్ లోపం కారణంగా వచ్చే దీర్ఘకాలిక డయేరియా బాధితులకీ వేరుసెనగ మంచిది.


addComments
కామెంట్ను పోస్ట్ చేయండి