హనుమ ఏకపాత్ర గళాభినయం:- సత్య వాణి
  మాతా !నేను రాముని బంటునని నమ్మకుంటివిగదా!
    తల్లీ !విను రాముని రూప,గుణ,శౌర్యములు వివరిస్తాను.
"రాముడు సకలగుణాభిరాముడు,
నీలమేఘశ్యాముడు , కోదండ రాముడు , కమనీయ మూర్తి ,
రాజీవనేత్రుడు, సమస్త ప్రాణకోటి మనస్సులను ఆకర్షించు పెను అయస్కాంతము! 
.
సాటిలేని సౌందర్యము
మూర్తీభవించిన, శౌర్యము
ఘనీభవించిన బ్రహ్మము!
.
తేజస్సులో సూర్యుడు.
యశస్సులో దేవేంద్రుడు.
బుద్దిలో బృహస్పతి.
ఓర్పులో పృథివి.
.
సమస్త ప్రాణి కోటినీ, 
సమస్త ధర్మములను రక్షించువాడు.
పితృభక్తి పారాయణుడు!
ఏకపత్నీ వ్రతుడు!
వాతృప్రేమా దురంధరుడు!
జీవకారుణ్యమూర్తి!
సత్యవాక్ పరిపాలకుడు!
సాధువు , బ్రహ్మ చర్య వ్రత దీక్షా పరుడు!
ఉపకారి! రాజవిద్యలో వినీతుడు!
విద్యాశీలి, వినయవంతుడు!
శత్రు భయంకరుడు!
సాధుజన రక్షకుడు!
ధనుర్వేదము కరతలామలకము,
యజుర్వేద ధారణము ,
సామవేద వైదుష్యము గలవాడు,
ఋగ్వేదాధ్యయనము చేసినవాడు .
సకలగుణాభిరాముని
ఏమని వర్ణించనమ్మా?
సకలసద్గుణాలను ఒక చోట ప్రోగుపోస్తే అది దాల్చే రూపము రాముడమ్మా!
నయన మనోహరుడు!
విశాలమైన భుజములు, దీర్ఘమైన బాహువులు, శంఖము వంటి కంఠము, ఎర్రని నేత్రాంతములు, మంగళాకారుడమ్మా శ్రీరాముడు!
అయోధ్యానగరవాసుల
ఆశలదీపము!
ఆయనను గూర్చి వినని వారు లోకములో లేరు."
ఎవని పేరు తలచినంతనే
సమస్త పాపములు అగ్నిలోపడ్డ దూదివలే భస్మ మగునో అతడే నీ 
మనోభిరాముడు,నాహృదయాధీశుడుఆ శ్రీరాముని బంటుని నేను.
నన్ను నమ్ముతల్లీ!నీవు ఈ రాముని అంగుళీయమును చేకొని,నీ ఆనమాలుగా నేదైనను నాకిచ్చిన వెనువెంటనే నేను రామునికడకేడి రాముని చింత తీర్చి,రామలక్ష్మణ సమేతంగా,వానరసైన్యంతో వచ్చి ,రావణుని నిర్జించి నిన్ను సగౌరవంగా తోడ్కొని అయోధ్యాపురికి
దిగబెట్టుదును తల్లీ!నన్ను నమ్ము.నా మాటలు విశ్వసించు.
       సీతా మాతా నన్ను నమ్మి నీ శిరోభూషణమిచ్చితివా!కృతజ్ఞుడను. ఇదిగో ఈ క్షణమునందే నాప్రభువు రామచంద్రునిముందు వాలెదను.
     జై శ్రీరామ్ జైజై శ్రీరామ్
కామెంట్‌లు
శ్రీనివాస రాజు‌ చెప్పారు…
మీ రచన అద్బుతం. నేటి తరానికి ఎంతో ఉపయుక్తం