మన పరిసరాలన్నీ పచ్చదనంతో నిండినప్పుడే ప్రగతి సాధ్యమౌతుందని ఎంపీపీఎస్ శ్రీరాంపూర్ ఎస్సీ కాలనీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈర్ల సమ్మయ్య అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో గురువారం ' చెట్ల ప్రాముఖ్యత' అనే అంశంపై పిల్లలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చెట్ల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. చెట్లు ప్రకృతిలోని చెడు గాలిని పీల్చుకొని జీవులకు అవసరమైన ప్రాణవాయువును అందిస్తాయన్నారు. చెట్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా నిత్యజీవితంలో మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయని, ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఖాళీ స్థలాల్లో విరివిగా మొక్కలు నాటాలని కోరారు. పాఠశాల పిల్లలు వారి ఇంటి పరిసరాల్లో, పొలంగట్లలో మొక్కలు నాటి, వాటిని కంటికి రెప్పలా కాపాడాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన పిల్లల చేత 'పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, వృక్షో రక్షతి రక్షితః, చెట్లను పెంచుదాం ప్రగతిని సాధిద్దాం' అంటూ నినాదాలు చేయించారు.
అనంతరం ఈర్ల సమ్మయ్య పాఠశాల పిల్లలకు మనిషికొకటి చొప్పున 83 మందికి నేరేడు, మునగ, వేప, మందార, దానిమ్మ, గోరింటాకు మొక్కలను తెప్పించి, వారికి ఉచితంగా అందజేశారు. మొక్కలు పెంచడంలో పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినులు ఎడ్ల విజయలక్ష్మి, కర్ర సమత, జువ్వాజి వైశాలి, తూండ్ల అరుణ ఎం.డి.ఎం. పనివారు విజయ, సుశీల, దుర్గమ్మ, పిల్లల తల్లిదండ్రులు, పలువురు పాల్గొన్నారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి