జలం మూలం ఇదం జగత్
ఇప్పుడు ఇదే మన నినాదం కావాలి.
శేరికలల్ల జారిపోవు
వాన చినుకు జాడ లేకపాయే
కరువు కోరల్లో చిక్కిన
పుడమితల్లి
విల విలలాడుతుంటే...
కాల చక్రంలో గమనంలో
ఋతుపవనాలు గతి తప్పి
పంటచేలన్ని ఒట్టిపోయి
సిరుల పంటలు మాయమయ్యి
పచ్చని మెతుకులు కరువయ్యి
రైతన్నల కడ్లల్ల కన్నీరే చూస్తున్నాము.
భూగర్భంలో నీరు తప్ప
భూతలమంతా ఉష్ణ వాహికలో చిక్కుకుంది.
మూల్యం చెల్లించక తప్పదు
బతుకు నంతా తవ్వి పోసినా
నీళ్లు రావేమో..?
పారిశ్రామిక విప్లవమో..
పట్టణీకరణ ప్రభావమేమో..?
జనాభా విస్ఫోటనమో..?
సాంకేతిక యంత్రాంగంలో జీవనం కదా...మనది.
ఇప్పుడంతా కాంక్రీట్ సంప్రదాయమే...
ప్రమాద ఘంటికలు మోగుతుంటే
దిగులు మేఘాలు కమ్ముకున్నాయి.
గుబులు రేపే ఆలోచనల తోటి..
మన ఆజ్ఞాన మేఘాలు విచ్ఛిన్నం కావాలి ఇప్పుడైనా..
మనిషితనము మాయమయ్యి
స్వార్థ చింతన పెరిగిపొయ్యి
ప్రాణి కోటి మనుగడ ప్రశ్నార్థకమయ్యింది.
జీవవైవిద్యం సవాల్ విసిరింది..!!
ఇప్పటికైనా మేల్కొని
చినుకు చినుకును ఒడిసి పట్టి
ఇంకుడు గుంతలో ప్రవేశపెట్టి
భూగర్భంలో దాచి పెట్టి
అవసరానికే వాడుకుని
సామాజిక బాధ్యతతో సాగుదాం..!
సాగునీటితో ఇక్కట్లను
తాగునీరు కలుషితాన్ని
అరికట్టి
జలం విలువ తెలుసుకొని
తక్షణమే స్పందించి
కర్తవ్య దీక్షతో కదలాలి మనమంతా
జల యజ్ఞానికి పూనుకుందాం ..!
జగతిని నడిపించే శక్తి వనరే నీరని
వసుదైక కుటుంబాన్ని కాంక్షించి
ప్రకృతి ప్రసాదించిన జల సిరిని కాపాడుకుందాం..!
భావితరాల భవిష్యత్తుకు
సహజ సంపద అందిద్దాం
అనంత విశ్వంలో అమృతధారలన్ని
కురిపించి
పుడమి తల్లి ఎదను
నవవసంతంతో నింపి
హరిత పత్రంపై నీటి సంతకం చేసేద్దాం..!
పురోగతి సాధింద్దాం..!!
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి