శివ సంబంధమయిన విషయములలో, చాలా పరమ పవిత్రమయిన ఘట్టంగా మనం భావించేది గంగావతరణం. దానితో సమానమయిన ఘట్టం మరొకటి లేదు. ఈశ్వర కారుణ్యమునకు హద్దు లేదని చూపించేవాటిలో గంగావతరణం ఒకటి.
సగరచక్రవర్తి కుమారులు ఉద్ధతితో ప్రవర్తించి కపిలమహర్షి తపస్సు చేసుకుంటున్న ప్రదేశమునకు వెళ్ళి, తమ యాగాశ్వము అక్కడ కనపడింది కాబట్టి ఆయనే దొంగ అని నిర్ణయమునకు వచ్చేసి, చేతికి దొరికిన కర్రలు పట్టుకుని ఆయనను నిందచేస్తూ, ఆయన మీదకు పరుగెత్తారు. నాశనం చేసెయ్యడానికి మహాపురుష సంకల్పం ఒక్కటి చాలు. అది చాలా భయంకరంగా ఉంటుంది. కపిలమహర్షి ఆ కేకలేమిటా అని కళ్ళుతెరిచి చూశారు. సగరులు మీదికి వచ్చి పడుతున్నారు. వెంటనే ఆయన కోపమును పొంది వారిని చూసి హుంకరించారు. అంతే. వారిలోంచి పుట్టిన కోపము అగ్నిగా మారింది. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే అరువదివేల మంది బూడిదకుప్పలై పడిపోయారు. అంశుమంతుడు చూశాడు. వాళ్ళకి జలతర్పణం చేద్దామని నీళ్ళు పట్టుకువస్తున్నాడు. అపుడు గరుత్మంతుడు ‘ఇలా మహాత్ముల క్రోధాగ్ని చేత ఎవరు మరణిస్తారో, వాళ్ళని ఉద్ధరించడానికి సామాన్యమయిన జలములకు అధికారం లేదు. వీళ్ళు ఊర్ధ్వలోకములను పొందరు. వీళ్ళ భస్మరాశులు తడవాలంటే ఆకాశం నుండి గంగ భూమి మీదకి ప్రవహించాలి. అలా ప్రవహిస్తే అప్పుడు వీళ్ళకి జలతర్పణములు అయినట్లుగా భావింపబడి, వీళ్ళ దాహం తీరి, వ్యగ్రత తీరి, వీళ్ళు ఉన్నతలోకములను పొందుతారు. కాబట్టి నీవు ఈ నీటితో జలతర్పణ చేయకు.’ అన్నాడు. దీనికోసం ఇక్ష్వాకు వంశంలోని వారు బెంగపెట్టుకున్నారు. ఇక్ష్వాకు వంశంలో తరింపజేసేవాడు లేక, కొన్ని తరాలపాటు పడిపోయిన సందర్భం ఏదయినా ఉంటే అది ఒక్క సగరచక్రవర్తి బిడ్డలవల్లే. చాలా కష్టపడి సగరుడు, అంశుమంతుడు, దిలీపుడు వెళ్ళిపోయారు. భగీరథుడు వచ్చాడు. సగరపుత్రులు మాత్రం బూడిదయి అలాగే పడి ఉన్నారు. వీళ్ళకి జల తర్పణలు లేవు. పితృకార్యములు లేవు. వీళ్ళు ఉద్ధరింపబడే మార్గం లేదు. అలా పడిపోయి ఉన్నప్పుడు మనకి భగీరథ ప్రయత్నం అనే ఒకమాట వచ్చింది.
భగీరథుడు తపస్సు చేయడానికి బయలుదేరాడు. ఆయన దక్షిణ భారతదేశమునకు వచ్చి, గోకర్ణంలో బ్రహ్మగారి గురించి తపస్సు మొదలుపెట్టాడు. అలా వెయ్యి సంవత్సరములు తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షం అయి నీకేమి కావాలి? అని అడిగాడు. అపుడు భగీరథుడు ‘ఇక్ష్వాకు వంశము నందు కుమారులు జన్మింపకపోవుట అన్నది ఉండకుండుగాక, అవిచ్ఛిన్నముగా వంశం జరుగుగాక; రెండవది – నాకు ముందు తరములలో కొంతమంది బూడిద కుప్పలై పడిపోయి ఉన్నారు. వారికి సద్గతి కలగడానికి వీలుగా ఆకాశము నుండి క్రిందకి పాతాళగంగను విడిచిపెట్టు’ అని కోరాడు. గంగ ఆకాశంలోంచి పడితే దానిని భూమి వహించలేదు. గంగ అలా పడేటప్పుడు మధ్యలో పట్టుకునేవాడు ఒకడు కావాలి. అందుకు శంకరుడే సమర్థుడు. కాబట్టి నువ్వు శంకరుడి గురించి తపస్సు చేయవలసింది అని బ్రహ్మ గారు చెప్పాడు. భగీరథుడు శంకరుని గూర్చి తపస్సు ప్రారంభించాడు. శంకరుడు భగీరథుడు చేసిన తపస్సుకు ప్రీతి పొందినవాడై, అతనికి ప్రత్యక్షం అయి నేను గంగను తలపై పడతాను అని చెప్పి, గంగను పట్టడానికి జటాజూటంతో పరమేశ్వరుడు హిమవత్పర్వతం మీద నిలబడ్డాడు. అప్పుడు గంగ అనుకుంది “నేను ఈయన తలమీద పడి, ప్రవాహ వేగంతో వెళ్ళిపోతుంటే ఆ వేగంలో ఈయనను పాతాళానికి ఈడ్చుకు వెళ్ళిపోతాను’ అని. ఆ ప్రవాహంతో పాటు చేపలు, తిమింగలములు మొదలైనవి ఎన్నో పడ్డాయి. ఇపుడు శివుడు ఆ నీటినంతటినీ తన జటాజూటంలో పట్టేశాడు. గంగ ఆశ్చర్యపడింది. గంగ శివుని శిరస్సు మీద నుండి క్రిందకు పడకపోవడం గమనించిన భగీరథుడు, మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. శంకరుడు కరుణించి గంగను క్రిందికి వదిలాడు. ఆ నీరు వచ్చి మొట్టమొదట బిందుసరోవరంలో పడింది. బిందుసరోవరం బ్రహ్మ తపస్సు చేసిన స్థలం. అక్కడి నుండి ఏడు పాయలుగా విడిపోయింది. భగీరథుని అనుసరించి ఒక పాయ వెళ్ళిపోయేటట్లుగా అనుగ్రహించాడు. దేవతలందరూ వాళ్ళ వాళ్ళ వాహనాల మీద వచ్చి, ఆ గంగావతరణ దృశ్యాన్ని చూస్తూ ఆశ్చర్యంగా ఆకాశం అంతా నిలబడిపోయారు. దేవగంగ భూలోకంలో పడిందని, పాపం చేసిన వారందరూ వచ్చి దానిలో మునిగి స్నానాలు చేశారు. వాళ్ళ పాపాలన్నీ పోయి వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోతున్నారు. అలా ముందు భగీరథుడు వెళుతుంటే, వెనుక గంగ వేగంగా ప్రవహిస్తూ వస్తోంది. దారిలో జహ్నుమహర్షి ఆశ్రమం తగిలింది. గంగ అలా వెడుతూ జహ్నుమహర్షి యజ్ఞవాటికను ముంచి వెళ్ళిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన జహ్నుమహర్షి కోపంతో గంగనంతటినీ ఔపోసన పట్టేశాడు. ఒక్కసారిగా శబ్దం ఆగిపోయింది. భగీరథుడు వెనక్కి తిరిగి చూశాడు. గంగ కనిపించలేదు. జరిగింది తెలుసుకుని తనను అనుగ్రహించమని జహ్నుమహర్షిని ప్రార్థించాడు. అపుడు జహ్నుమహర్షి గంగను తన చెవులలోంచి బయటకు వదిలిపెట్టేశాడు. గంగ మరల భగీరథుని వెనక ప్రవహించడం ప్రారంభించింది. అలా చివరకు పాతాళలోకానికి వెళ్ళింది. గంగకు భగీరథుడు తన పితృదేవతల భస్మరాశులను చూపించి వాటిమీద నుంచి ప్రవహించమని చేతులొగ్గి నమస్కరించి అడిగాడు. గంగ ఆ భస్మరాశుల మీదుగా ప్రవహించింది. వాళ్ళందరూ కూడా ఉత్తర క్షణం దాహశాంతిని పొంది ఊర్ధ్వలోకములకు వెళ్ళిపోయారు.
వెంటనే బ్రహ్మ అంతటి ఆయన, పిలవకుండా అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చి, భగీరథుడిని కౌగలించుకుని ‘భగీరథా, ఇంకా లోకంలో ఎప్పుడయినా ఎవరయినా ఎక్కడయినా ఇంత గొప్ప ప్రయత్నం చేయవలసి వస్తే, దానికి భగీరథ ప్రయత్నం అనే పేరు వస్తుంది. అన్నింటిని మించి ఇన్ని కష్టాలకి ఓర్చి, ఓర్పుతో గంగ పాయను పాతాళమునకు తెచ్చావు గనుక, ఈపాయకు భాగీరథి అనే పేరు వస్తుంది అని చెప్పి అక్కడినుంచి నిష్క్రమించాడు.
సాధారణంగా వాల్మీకి మహర్షి దేనికీ ఫలశ్రుతిని చెప్పలేదు. కానీ ఈ గంగావతరణం విన్నవారికి ఆయన ఫలశ్రుతిని చెప్పారు. తెలిసికానీ, తెలియక కానీ ఎన్ని పాపములు చేసిన వారయినా సరే, నమ్మి గంగావతరణ కథ విని చేతులెత్తి నమస్కరించి, గంగాధరుడైన ఆ పరమేశ్వరుని పాదములను దర్శించి, ఆ తెల్లటి పాదములకు ఎవరు నమస్కరిస్తున్నారో, ఎవరు పరమ పూజ్య భావంతో, విశ్వాసంతో గంగావతరణమును వింటున్నారో, అటువంటి వారి సమస్తమయిన కోరికలు తీరుతాయి. వారు ఇంతకు పూర్వం ఎన్ని పాపములు చేసిన వారయినా, బాధలు పొందకుండా సుఖములను పొందుతారు. వారి ఆయుర్దాయం చక్కగా వృద్ధిలోకి వచ్చి, వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. చిరంజీవులు అవుతారు. అపమృత్యుదోషం ఉండదు. చక్కటి కీర్తి పొందుతారు.
అనగా ఈ గంగావతరణం
చదవడం చేత, మనస్సు మారి, భగవంతుడి వైపు మనస్సు ప్రచోదనమై, సత్కర్మానుష్టానం కలిగి, వేరొకసారి నేను పాపము చేయరాదన్న సద్బుద్ధి కలిగి, వాడు పుణ్యాత్ముడై లోకం చేత కీర్తింపబడవలసిన వాడిగా మారుతున్నాడు. కాబట్టి, గంగావతరణ ఆఖ్యానం అంత పరమ పవిత్రమయినది.
...... కర్రా విరూపాక్ష శాస్త్రి
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Nagarajakumar.mvss
సగరచక్రవర్తి కుమారులు ఉద్ధతితో ప్రవర్తించి కపిలమహర్షి తపస్సు చేసుకుంటున్న ప్రదేశమునకు వెళ్ళి, తమ యాగాశ్వము అక్కడ కనపడింది కాబట్టి ఆయనే దొంగ అని నిర్ణయమునకు వచ్చేసి, చేతికి దొరికిన కర్రలు పట్టుకుని ఆయనను నిందచేస్తూ, ఆయన మీదకు పరుగెత్తారు. నాశనం చేసెయ్యడానికి మహాపురుష సంకల్పం ఒక్కటి చాలు. అది చాలా భయంకరంగా ఉంటుంది. కపిలమహర్షి ఆ కేకలేమిటా అని కళ్ళుతెరిచి చూశారు. సగరులు మీదికి వచ్చి పడుతున్నారు. వెంటనే ఆయన కోపమును పొంది వారిని చూసి హుంకరించారు. అంతే. వారిలోంచి పుట్టిన కోపము అగ్నిగా మారింది. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే అరువదివేల మంది బూడిదకుప్పలై పడిపోయారు. అంశుమంతుడు చూశాడు. వాళ్ళకి జలతర్పణం చేద్దామని నీళ్ళు పట్టుకువస్తున్నాడు. అపుడు గరుత్మంతుడు ‘ఇలా మహాత్ముల క్రోధాగ్ని చేత ఎవరు మరణిస్తారో, వాళ్ళని ఉద్ధరించడానికి సామాన్యమయిన జలములకు అధికారం లేదు. వీళ్ళు ఊర్ధ్వలోకములను పొందరు. వీళ్ళ భస్మరాశులు తడవాలంటే ఆకాశం నుండి గంగ భూమి మీదకి ప్రవహించాలి. అలా ప్రవహిస్తే అప్పుడు వీళ్ళకి జలతర్పణములు అయినట్లుగా భావింపబడి, వీళ్ళ దాహం తీరి, వ్యగ్రత తీరి, వీళ్ళు ఉన్నతలోకములను పొందుతారు. కాబట్టి నీవు ఈ నీటితో జలతర్పణ చేయకు.’ అన్నాడు. దీనికోసం ఇక్ష్వాకు వంశంలోని వారు బెంగపెట్టుకున్నారు. ఇక్ష్వాకు వంశంలో తరింపజేసేవాడు లేక, కొన్ని తరాలపాటు పడిపోయిన సందర్భం ఏదయినా ఉంటే అది ఒక్క సగరచక్రవర్తి బిడ్డలవల్లే. చాలా కష్టపడి సగరుడు, అంశుమంతుడు, దిలీపుడు వెళ్ళిపోయారు. భగీరథుడు వచ్చాడు. సగరపుత్రులు మాత్రం బూడిదయి అలాగే పడి ఉన్నారు. వీళ్ళకి జల తర్పణలు లేవు. పితృకార్యములు లేవు. వీళ్ళు ఉద్ధరింపబడే మార్గం లేదు. అలా పడిపోయి ఉన్నప్పుడు మనకి భగీరథ ప్రయత్నం అనే ఒకమాట వచ్చింది.
భగీరథుడు తపస్సు చేయడానికి బయలుదేరాడు. ఆయన దక్షిణ భారతదేశమునకు వచ్చి, గోకర్ణంలో బ్రహ్మగారి గురించి తపస్సు మొదలుపెట్టాడు. అలా వెయ్యి సంవత్సరములు తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షం అయి నీకేమి కావాలి? అని అడిగాడు. అపుడు భగీరథుడు ‘ఇక్ష్వాకు వంశము నందు కుమారులు జన్మింపకపోవుట అన్నది ఉండకుండుగాక, అవిచ్ఛిన్నముగా వంశం జరుగుగాక; రెండవది – నాకు ముందు తరములలో కొంతమంది బూడిద కుప్పలై పడిపోయి ఉన్నారు. వారికి సద్గతి కలగడానికి వీలుగా ఆకాశము నుండి క్రిందకి పాతాళగంగను విడిచిపెట్టు’ అని కోరాడు. గంగ ఆకాశంలోంచి పడితే దానిని భూమి వహించలేదు. గంగ అలా పడేటప్పుడు మధ్యలో పట్టుకునేవాడు ఒకడు కావాలి. అందుకు శంకరుడే సమర్థుడు. కాబట్టి నువ్వు శంకరుడి గురించి తపస్సు చేయవలసింది అని బ్రహ్మ గారు చెప్పాడు. భగీరథుడు శంకరుని గూర్చి తపస్సు ప్రారంభించాడు. శంకరుడు భగీరథుడు చేసిన తపస్సుకు ప్రీతి పొందినవాడై, అతనికి ప్రత్యక్షం అయి నేను గంగను తలపై పడతాను అని చెప్పి, గంగను పట్టడానికి జటాజూటంతో పరమేశ్వరుడు హిమవత్పర్వతం మీద నిలబడ్డాడు. అప్పుడు గంగ అనుకుంది “నేను ఈయన తలమీద పడి, ప్రవాహ వేగంతో వెళ్ళిపోతుంటే ఆ వేగంలో ఈయనను పాతాళానికి ఈడ్చుకు వెళ్ళిపోతాను’ అని. ఆ ప్రవాహంతో పాటు చేపలు, తిమింగలములు మొదలైనవి ఎన్నో పడ్డాయి. ఇపుడు శివుడు ఆ నీటినంతటినీ తన జటాజూటంలో పట్టేశాడు. గంగ ఆశ్చర్యపడింది. గంగ శివుని శిరస్సు మీద నుండి క్రిందకు పడకపోవడం గమనించిన భగీరథుడు, మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. శంకరుడు కరుణించి గంగను క్రిందికి వదిలాడు. ఆ నీరు వచ్చి మొట్టమొదట బిందుసరోవరంలో పడింది. బిందుసరోవరం బ్రహ్మ తపస్సు చేసిన స్థలం. అక్కడి నుండి ఏడు పాయలుగా విడిపోయింది. భగీరథుని అనుసరించి ఒక పాయ వెళ్ళిపోయేటట్లుగా అనుగ్రహించాడు. దేవతలందరూ వాళ్ళ వాళ్ళ వాహనాల మీద వచ్చి, ఆ గంగావతరణ దృశ్యాన్ని చూస్తూ ఆశ్చర్యంగా ఆకాశం అంతా నిలబడిపోయారు. దేవగంగ భూలోకంలో పడిందని, పాపం చేసిన వారందరూ వచ్చి దానిలో మునిగి స్నానాలు చేశారు. వాళ్ళ పాపాలన్నీ పోయి వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోతున్నారు. అలా ముందు భగీరథుడు వెళుతుంటే, వెనుక గంగ వేగంగా ప్రవహిస్తూ వస్తోంది. దారిలో జహ్నుమహర్షి ఆశ్రమం తగిలింది. గంగ అలా వెడుతూ జహ్నుమహర్షి యజ్ఞవాటికను ముంచి వెళ్ళిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన జహ్నుమహర్షి కోపంతో గంగనంతటినీ ఔపోసన పట్టేశాడు. ఒక్కసారిగా శబ్దం ఆగిపోయింది. భగీరథుడు వెనక్కి తిరిగి చూశాడు. గంగ కనిపించలేదు. జరిగింది తెలుసుకుని తనను అనుగ్రహించమని జహ్నుమహర్షిని ప్రార్థించాడు. అపుడు జహ్నుమహర్షి గంగను తన చెవులలోంచి బయటకు వదిలిపెట్టేశాడు. గంగ మరల భగీరథుని వెనక ప్రవహించడం ప్రారంభించింది. అలా చివరకు పాతాళలోకానికి వెళ్ళింది. గంగకు భగీరథుడు తన పితృదేవతల భస్మరాశులను చూపించి వాటిమీద నుంచి ప్రవహించమని చేతులొగ్గి నమస్కరించి అడిగాడు. గంగ ఆ భస్మరాశుల మీదుగా ప్రవహించింది. వాళ్ళందరూ కూడా ఉత్తర క్షణం దాహశాంతిని పొంది ఊర్ధ్వలోకములకు వెళ్ళిపోయారు.
వెంటనే బ్రహ్మ అంతటి ఆయన, పిలవకుండా అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చి, భగీరథుడిని కౌగలించుకుని ‘భగీరథా, ఇంకా లోకంలో ఎప్పుడయినా ఎవరయినా ఎక్కడయినా ఇంత గొప్ప ప్రయత్నం చేయవలసి వస్తే, దానికి భగీరథ ప్రయత్నం అనే పేరు వస్తుంది. అన్నింటిని మించి ఇన్ని కష్టాలకి ఓర్చి, ఓర్పుతో గంగ పాయను పాతాళమునకు తెచ్చావు గనుక, ఈపాయకు భాగీరథి అనే పేరు వస్తుంది అని చెప్పి అక్కడినుంచి నిష్క్రమించాడు.
సాధారణంగా వాల్మీకి మహర్షి దేనికీ ఫలశ్రుతిని చెప్పలేదు. కానీ ఈ గంగావతరణం విన్నవారికి ఆయన ఫలశ్రుతిని చెప్పారు. తెలిసికానీ, తెలియక కానీ ఎన్ని పాపములు చేసిన వారయినా సరే, నమ్మి గంగావతరణ కథ విని చేతులెత్తి నమస్కరించి, గంగాధరుడైన ఆ పరమేశ్వరుని పాదములను దర్శించి, ఆ తెల్లటి పాదములకు ఎవరు నమస్కరిస్తున్నారో, ఎవరు పరమ పూజ్య భావంతో, విశ్వాసంతో గంగావతరణమును వింటున్నారో, అటువంటి వారి సమస్తమయిన కోరికలు తీరుతాయి. వారు ఇంతకు పూర్వం ఎన్ని పాపములు చేసిన వారయినా, బాధలు పొందకుండా సుఖములను పొందుతారు. వారి ఆయుర్దాయం చక్కగా వృద్ధిలోకి వచ్చి, వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. చిరంజీవులు అవుతారు. అపమృత్యుదోషం ఉండదు. చక్కటి కీర్తి పొందుతారు.
అనగా ఈ గంగావతరణం
చదవడం చేత, మనస్సు మారి, భగవంతుడి వైపు మనస్సు ప్రచోదనమై, సత్కర్మానుష్టానం కలిగి, వేరొకసారి నేను పాపము చేయరాదన్న సద్బుద్ధి కలిగి, వాడు పుణ్యాత్ముడై లోకం చేత కీర్తింపబడవలసిన వాడిగా మారుతున్నాడు. కాబట్టి, గంగావతరణ ఆఖ్యానం అంత పరమ పవిత్రమయినది.
...... కర్రా విరూపాక్ష శాస్త్రి
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Nagarajakumar.mvss

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి