ఇంద్రియ నిగ్రహం; -: సి.హెచ్.ప్రతాప్

 ఇంద్రియ నిగ్రహం లేనివారికి భగవంతుని కృప లభించదని వేదశాస్త్రాలు చెబుతున్నాయి. అంటే శమదమాదులపై నిగ్రహం ఉండాలి. శమం అంటే అంతరింద్రియ నిగ్రహం. మనస్సుని అదుపులో ఉంచుకోవడం. దమం అంటే బహిరింద్రియ నిగ్రహం. జ్ఞానేంద్రియాలు ఐదు (త్వక్ (చర్మం), చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణము(ముక్కు)), కర్మేంద్రియాలు ఐదు (వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ) ఈ పది బహిరింద్రియాలు.

గుణాతీతులైన పార్వతీపరమేశ్వరులను చేరుకోవడానికి గొప్ప ఇంద్రియనిగ్రహం అత్యంత ఆవశ్యకం. అనితరసాధ్యమైన ఇంద్రియనిగ్రహం ఉండబట్టే మనుచరిత్రలో ప్రవరుడు పరమపవిత్రుడైన అగ్నిదేవుడి కృపకి పాత్రుడు కాగలిగాడు.
మానవ జీవనంలో ఋతం (సర్వదృష్టి) స్వాధ్యాయం (చదువుకోవడం), ప్రవచనం (చదువు చెప్పడం), సత్యం, తపస్సు, ఇంద్రియనిగ్రహం, శాంతి, అగ్నిహోత్రం, యజ్ఞం, అతిథులను పూజించడం, సమాజసంక్షేమకార్యాలు, మంచి సంతానం అనేవి తప్పనిసరిగా ఉండాలని శాస్త్ర వాక్యం.దేవుడు చేసిన ఈ అందమైన సృష్టిని, అందులోని అందమైన మనుషులను ప్రేమించలేని వాడు ఇక ఆ దేవుడిని మాత్రం ఏం ప్రేమించగలడు? ముందు ఆయన సృజన అర్థం అవ్వాలి. ఆ తరువాత ఎప్పటికో ఆయన అర్ధం అవుతాడు. ఇంద్రియనిగ్రహం అంటే అంతటా ఆయనే అన్న స్పృహతో ఉండటం. బలవంతంగా వాటిని అణచివేతకు గురి చెయ్యడం కాదు.
ఇంద్రియనిగ్రహం లేకపోవడమే ఈరోజు ఎన్నో అనర్థాలకు కారణం. మనిషి ఇంద్రియాలను పూర్తిగా అదుపులో ఉంచుకోగలిగితే సమస్యలు వాటంతటవే తొలగిపోతాయి. మోక్షాన్ని చేరుకునే క్రమంలో మన దృష్టిని గమ్యం పై కాక, గమనం పై కేంద్రీకరిస్తే ఇంద్రియాలను అదుపు చేయడం సాధ్యమౌతుంది. అప్పుడే అమ్మవారి కృపాకటాక్షం కనకధారగా మన ఇంటి ముందు కురుస్తుంది.

కామెంట్‌లు