సునంద భాషితం - వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -280
శీతలా ప్రస్తర న్యాయము
******
శీతలా అంటే ఆటలమ్మ  అనే దేవత,చందనము,చల్లనిది అనే అర్థాలు ఉన్నాయి.ప్రస్తరః అంటే ఱాయి, రత్నము, చిగురుటాకులూ పూలతో కూర్చిన శయ్య .
ఱాయిని శీతలా అంటే ఒకానొక ఆటలమ్మ దేవత. ఆ దేవత అని మాత్రమే కాదు రకరకాల విగ్రహాలుగా చెక్కి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.అదే రాతి నుండి వచ్చిన రాళ్ళను తూనిక రాళ్ళుగా కూడా వాడుకుంటారు. అలాంటి ఱాతిలో పెద్ద రాయిని  బట్టలు ఉతికే బండగా కూడా  ఉపయోగిస్తారు.
అంటే ఱాయి ఒకచోట పూజలు అందుకుంటోంది. మరోచోట బట్టలు ఉతికే బండగా, మరో చోట తూనిక రాయిగా ఉపయోగ పడుతోందన్న మాట. స్థానం మారేసరికి దాని విలువలో మార్పు వచ్చింది.
అంటే  వ్యక్తులకు కూడా వారు చేసే పనులను,ఉండే స్థానాన్ని బట్టి విలువ, గౌరవం లభిస్తుందనే అర్థంతో ఈ "శీతలా ప్రస్తర న్యాయము" చెప్పబడింది.
సున్న మరియు ఒకటి నుంచి తొమ్మిది వరకు గల సంఖ్యలు కూడా అంతే. సహజ విలువ కంటే అవి ఉండే స్థానాన్ని బట్టి విలువలు కలుగుతుంటాయి.
 ఒకానొక శిల్పి రెండు బండరాళ్ళను చూసి మీలో ఎవరు ఉలి దెబ్బలు భరించి శిల్పంగా మారుతారు? అని అడగ్గానే మొదటి రాయి "అమ్మో! నేను ఉలి దెబ్బలు భరించలేను. నన్ను ఇలాగే ఉండనీయండి." అంటుంది.రెండో రాయి శిల్పితో  "మీకు నచ్చిన శిల్పంగా చెక్కండి. ఎన్ని ఉలి దెబ్బలైనా భరిస్తాను." అంటుంది.
శిల్పి  శిల్పంగా చెక్కే సమయంలో ఎన్నో ఉలి దెబ్బలు తింటూ ఉంటే  మొదటి రాయి "చూశావా!ఎన్ని దెబ్బలు? ఎంత బాధ?  అందుకే నన్నేం చెయ్యొద్దు అన్నాను."అంటుంది. ఆ మాటలకు నిశ్శబ్దంగా నవ్వి ఊరుకుంటుందా రెండో రాయి.
ఎంతో అద్భుతంగా తయారైన ఆ  శిల్పాన్ని కొంత మంది ప్రజలు తీసుకుని వెళ్లి  ఎత్తైన వేదికపై  అమరుస్తారు.ఇక మొదటి రాయినేమో ఆ వేదిక పైకి ఎక్కేందుకు అనువుగా మెట్టుగా వేస్తారు.
ప్రతి ఒక్కరూ తనను తొక్కుతూ పైకి ఎక్కి "ఓహ్ ఎంత అద్భుతంగా ఉందీ శిల్పం? అని రెండో రాయిని పొగుడుతూ ఉంటే విని  "అయ్యో! శిల్పి అడిగినప్పుడు ఒప్పుకుంటే నేను కూడా ఎంతో గౌరవమైన స్థానంలో ఉండేదాన్ని కదా! " అని బాధ పడుతుంది.
అంటే స్థాయిని బట్టి విలువ,గౌరవ మర్యాదలు ఎలా కలుగుతాయో ఈ కథను బట్టి అర్థం చేసుకోవచ్చు.
దీనినే మరో కోణంలో ఆవిష్కరించిన ప్రముఖ నటుడు రంగనాథ్ గారు రాసిన  సుప్రసిద్ధ కవిత  "ఎవరు బండ.. ఎవరు దేవుడు? చూద్దాం.
 ఇందులో సారాంశం ఏమిటంటే  ఓ శిల్పి పెద్ద బండరాయిని రెండు ముక్కలుగా చేసి ఒక ముక్కతో   దేవుని శిల్పం చేస్తాడు.ఆ శిల్పం గుడిలో భక్తుల పూజలు అందుకుంటుంది. మరో ముక్క చాకిరేవు చేరుతుంది. అక్కడ మురికి బట్టలు బండ మీద బాదుకుంటూ  నీళ్ళలో మునిగి శుభ్రంగా తయారై వెళ్తాయి."అంటూ చాకిరేవు బండరాయి కూడా గొప్పదేనని ఎంతో సామాజిక స్పృహతో రాయడం విశేషం.
ఏది ఏమైనా వ్యక్తులుగా మూఢమైన ముడి రాళ్ళుగా కాకుండా విద్యా- వివేకం, చదువు- సంస్కారాలు , మానవీయ విలువలతో చెక్కబడినట్లయితే వారికి ఆయా స్థానాలను బట్టి సమాజంలో అంతులేని ఆదరణతో పాటు గౌరవ మర్యాదలు కలుగుతాయని చెప్పడమే ఈ "శీతలా ప్రస్తర న్యాయము"లోని అంతరార్థం.ఈ న్యాయము ద్వారా మనం ఎలా వుండాలో తెలిసిపోయింది కదా!.
కాబట్టి పై ఉదాహరణలను గమనంలో పెట్టుకొని జీవితాల్ని గౌరవనీయ స్థాయిలో ఉండేలా చూసుకుందాం.
 ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు