సునంద భాషితం:- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయములు-727
సింహ క్షీర న్యాయము 
    *****
సింహ అనగా సింహము, కేసరి, మృగరాజు.క్షీర అనగా పాలు అని అర్థము.
 సింహము పాలు బంగారు గిన్నెలో మాత్రమే నిలుచును అని అర్థము.
 సింహము పాలు పట్టడమే అసాధ్యం. పైగా ఆ పాలను బంగారు గిన్నెలో పోస్తేనే విరగకుండా నిలుస్తాయి అని చెప్పడం కొంత అతిశయోక్తి మరికొంత అసహజం కూడా.
 మరి పనిలో పనిగా సింహం గురించిన విశేషాలు, వివరాలు క్లుప్తంగా తెలుసుకుందాం.
 సింహాన్ని అడవికి రాజనీ, మృగరాజని అనడం మనందరికీ తెలిసిందే. మరి దానికి ఆపేరు ఎందుకు వచ్చిందో చూద్దాం.
అసలైతే సింహం కంటే పులి మహా తెలివైనది,కౄరమైనది,ప్రమాదకరమైనది.అంతే కాకుండా చాలా వేగంగా పరుగెత్తే జంతువు.
అయినప్పటికీ సింహాన్నే అడవికి రారాజుగా పిలవడానికి కారణం దానియొక్క జీవన విధానం, దాని  ఆకారం,దాని గర్జన.
ఆకారం చూస్తుంటే పొడవైన జూలుతో(మగసింహం),రాజసమైన నడకతో ఎంత  అందంగా ఉంటుందో కదా! రాజ లక్షణాలు దానిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి.ఇక దాని గర్జన కిలోమీటర్ల దూరం దాకా వినబడి జంతువులను, మనుషులను హడలెత్తిస్తుంది.
ముఖ్యంగా సింహం ఎప్పుడూ గుంపుగానే జీవిస్తుంది.అంతే కాకుండా వాటిల్లో ఓ పెద్దదైన మగ సింహం గుంపుకు నాయకత్వం వహిస్తుంది.అలా సింహాలు తమకంటూ ఓ ప్రత్యేకమైన భూభాగంలో నివాసం ఏర్పరుచుకుని,ఆ నివాస ప్రాంతాన్ని ఏ ఇతర జంతువులు ఆక్రమించినా ఎట్టిపరిస్థితుల్లోనూ సహించవు.ఒకవేళ ఇతర జంతువులు ఆక్రమించడానికి ప్రయత్నిస్తే వాటిని చంపడానికి ఏ మాత్రం వెనుకాడవు.ఎంత పెద్ద జంతువులనైనా అంటే ఏనుగు,జిరాఫీ,అడవి దున్న..ఇలా పెద్ద,చిన్నా భేదం లేకుండా ప్రత్యర్థిని గుంపుగా  వేటాడి చంపేస్తాయి ఇన్ని  ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి కాబట్టే సింహాన్ని మృగరాజు అంటారు.
అయితే ఇవి ఎప్పుడు పడితే అప్పుడు వేటకు వెళ్ళవు రోజులో  దాదాపుగా 20 గంటలు  విశ్రాంతి తీసుకుని , ఎక్కువగా రాత్రి సమయాల్లోనే వేటాడుతుంటాయి. ఈ వేటలో కూడా ఆడసింహాలే ఎక్కువగా పాల్గొనడం విశేషం.
 ఇక విషయానికి వద్దాం. సింహమే కౄరమైన జంతువు. పైగా ఆడ సింహము పాలు. పాలు ఎప్పుడు ఉంటాయి అవి బిడ్డలకు జన్మనిచ్చినప్పుడు. అలాంటప్పుడు  ఆడ సింహం దగ్గరకు వెళ్ళి పాలు పితికే సాహసం ఎవరైనా చేస్తారా? చెయ్యరు గాక చెయ్యరు.
 ఒకవేళ సర్కస్ లో పెంచిన సింహం అయినా  దాని పాలు పితకడం  అసాధ్యం.ఒకవేళ ఎలాగో ధైర్యం చేసి పిండుకొచ్చినా  వాటిని బంగారు గిన్నెలో ఉంచితేనే విరిగిపోవట. పైగా మనిషి  వాటిని తాగడానికి ప్రయత్నిస్తే  ఖచ్చితంగా వాటివల్ల ప్రాణాపాయం సంభవిస్తుందని కొందరు తేల్చి చెప్పేశారు.
 కాబట్టి మన పెద్దవాళ్ళు ఈ "సింహ క్షీర న్యాయము"ను ఎందుకు చెప్పారో మనకు ఈపాటికి తెలిసిపోయింది.  అసాధ్యాలు, అలవికాని వాటి జోలికి వెళ్ళేవాళ్ళకు ఇదొక హెచ్చరిక.అనవసరంగా ప్రాణాపాయం తెచ్చుకోవద్దని, ఎవరైనా ఆపదలో ఉంటే రక్షించే సాహసం చేయొచ్చు కానీ కావాలని "సింహం నోట్లో తల పెట్టొద్దని" చెప్పడమే ఈ "సింహ క్షీర న్యాయము" లోని అంతరార్థము.
అందుకే మనం మాత్రం వద్దన్న పనులు ఎందుకు చేయాలి? పెద్దల మాటలు బుద్ధిగా విందాం. అంతే కదండీ!.

కామెంట్‌లు