అమాయకునికి పట్టిన అదృష్టం - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

  ఒకూర్లో ఒక అమాయకుడున్నాడు. అమాయకుడంటే పెద్దగా తెలివితేటలు ఏమీ లేనోడన్నమాట. ఒకసారి వాడు బతకడానికి ఏదయినా యాపారం చేద్దామని బట్టల మూట నెత్తిన పెట్టుకోని ఒకొక్క వూరే తిరుగుకుంటా చీకటి పడే సమయానికి ఒక అడవిలోనికి వచ్చినాడు. అప్పటికే బాగా తిరిగి తిరిగి అలసి పోవడంతో బట్టల మూట ఒక చెట్టు చాటున దాచిపెట్టి ఆ దారిలోనే అడ్డంగా పడి నిద్రపోయినాడు.
అది అమావాస్య. ముందేముందో వెనకేముందో తెలియనంత చిక్కని చీకటి. ఆ చీకట్లో కొందరు దొంగలు దొంగతనానికని ఆ దారిలోనే పోతా వున్నారు. వీడు దారి నడుమ పడుకోనున్నాడు గదా... దాంతో ఒక దొంగ చూసుకోక కాలు తగిలి దభీమని కిందపడినాడు. వాడు బాధతో “ఎవడోగానీ చూడు... దారి కడ్డంగా ఎంత పెద్ద మొద్దు వేసినాడో" అన్నాడు.
వాని కాలు తగలడంతో నిద్ర లేచిన అమాయకుడు “ఎవర్రా మీరు...  బంగారంలాంటి మనిషిని పట్టుకోని మొద్దంటారా... కొంచమన్నా బుద్దుందా మీకు" అని అరిచినాడు. ఆ మాటలు విన్న దొంగలు "అరెరే... ఈడెవరో మనిషున్నాడే" అని వెంటనే తిరిగి వచ్చి వాన్ని పట్టుకున్నారు. కాగడా వెలుగులో చూస్తే వాడు మట్టి గొట్టుకుపోయిన బట్టలతో, చింపిరి జుట్టుతో, మాసిపోయిన గడ్డంతో ఒట్టి పేదోనిలెక్క కనబన్నాడు. దాంతో ఒక దొంగ "పద పద... వీని మొగం చూస్తే ఇళ్ళ ముందు అడుక్కుతినేటోని లెక్క వున్నాడు. వీని దగ్గర ఏముంటాయి" అన్నాడు.
ఆ మాటలకు ఆ అమాయకుడు కోపంగా "ఏందయ్యోయ్... తిరిగి తిరిగి బట్టలు మాసినంత మాత్రాన మరీ అంత తక్కువ చేసి మాట్లాడ్డమేనా... నేనేం అడుక్కుతినేటోన్ని గాదు. యాపారస్తున్ని. కావాలంటే చూడండి ఆ చెట్టుపక్కన బట్టల మూటలు" అన్నాడు. దాంతో దొంగలు వాన్ని పట్టుకోని తలా ఒక తన్ను తన్ని బట్టల మూట గుంజుకోని పోసాగినారు. అది చూసి వాడు వురుక్కుంటా వాళ్ళకు అడ్డం పోయి “అనా... అనా... ఈ బట్టలు కట్టుకుంటారా... అమ్ముకుంటారా" అనడిగినాడు.
దానికి వాళ్ళు "కట్టుకుంటే కట్టుకుంటాం... అమ్ముకుంటే అమ్ముకుంటాం. మధ్యలో నీకెందుకురా" అన్నారు కోపంగా. "ఏం లేదన్నా... అమ్మేటట్టయితే కొంచం తక్కువకి నాకే అమ్మండి. మూడువేలిస్తా" అన్నాడు.
"ఏంది... మూడువేలా... అంత డబ్బు యాడుందిరా నీ దగ్గర" అన్నాడో దొంగ. 
"ఏందన్నా అంత మాటంటావ్. మాంసం తింటున్నాం గదాని యెముకలు మెడలో వేసుకోని తిరుగుతారా ఎవరన్నా... డబ్బులు పై జేబులో యెందుకుంటాయి. మీలాంటి దొంగలకి కనబడకుండా లోపలెక్కడో దాచిపెట్టుకుంటాం గానీ" అన్నాడు. .
"ఆహా... ఐతే వీని దగ్గర మస్తుగ డబ్బులున్నాయన్నమాట" అనుకోని అందరూ చుట్టూ మూగి కిందామీదా అంతా వెదికి అంగీ లోపలి జేబులో దాచి పెట్టుకున్న డబ్బులన్నీ తీసేసుకున్నారు. వాళ్ళు పోతా వుంటే ఆ అమాయకుడు వురుక్కుంటా పోయి వాళ్ళకు అడ్డంపడి "అనా.. అనా.. తినడానికి కూడా లేకుండా నా దగ్గరున్నదంతా
దోచేసినారు. ఇంక నేనేం చెయ్యాలి. నన్నుగూడా మీ వెంబడే తీసుకోని పోండి. మీరేం చెయ్యమంటే అది చేస్తా. ఏదో తినడానికి ఇంత అన్నం పడేస్తే సాలు” అని అడుక్కోసాగినాడు. 
దాంతో వాళ్ళు "సరే... రా... జాగ్రత్త. మేము చెప్పినట్టే చెయ్యాలి చూడు" అని తీసుకోని పోయినారు.
వాళ్ళు ఆ రోజు ఆ అమాయకుడుండే వూరికే దొంగతనానికి పోయినారు. ఒక ఇల్లు బాగా కనబడడంతో దాంట్లోకి దూరినారు. వీడు గూడా వాళ్ళతో బాటు లోపలికి దూరతా "అనా... అనా... లోపల ఏం చేయాల" అనడిగినాడు. 
"ఏముంది... చప్పుడు గాకుండా బంగారం, వెండి దొరికినేవి దొరికినట్లు నున్నగా మూట గట్టేసెయ్" అన్నాడు. దానికి వాడు "వెండి, బంగారమా... ఎట్లుంటాయవి" అని మళ్ళా అడిగినాడు. “ఏముందిరా... పచ్చదంతా బంగారం, తెల్లదంతా వెండి... ఆ మాత్రం తెలీదా" అన్నారు వాళ్ళు
సరేనని ఆ అమాయకుడు లోపలికి పోయినాడు. చప్పుడు గాకుండా ఒకొక్క గదే దాటుతా వంటింట్లోకి పోయినాడు. అక్కడ ఒక అవ్వ పండుకోనింది. ఆ గదిలో సత్తుగిన్నెలన్నీ తెల్లగా మెరిసిపోతావుంటే, కంచు పాత్రలన్నీ వచ్చగా ధగధగలాడతా కనబన్నాయి. ఆహా... ఎంత బంగారం, ఎంత వెండి అని సంబరపడిపోతా వాటిని ఒకొక్కటే తీసి మూటలో వేసుకోసాగినాడు. కాసేపటికి మూట నిండిపోయింది. ఇంగ ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తా వుంటే వంటింట్లో చక్కెర, నెయ్యి, సేమ్యాలు, పాలు కనబన్నాయి. అవన్నీ చూడగానే వానికి నోరూరింది. "అబ్బ! పాయసం తిని ఎన్ని నాళ్ళయింది. వాళ్ళందరూ దొంగతనం పూర్తి చేసేలోగా పాయసం చేసుకొని తాగేద్దాం" అనుకోని పొయ్యి అంటించి పాయసం చేయసాగినాడు.
ఆ గదిలోనే అవ్వ పండుకోనింది గదా... ఆమె చేయి కడుపు మీద పెట్టుకోనింది. కాసేపటికి నిద్రలో ఆ చేయి కిందకు చాచింది. అది చూసిన అమాయకుడు అవ్వ పాయసం కోసం చేయి చాపుతుందేమో అనుకోని "వుండే ముసల్దానా... చేసేటోనికన్నా చూసేటోనికే తొందరెక్కువని... కాసేపు ఆగలేవా... ఐతూనే ఇస్తాగానీ" అంటూ చేయి తీసి మరలా కడుపు మీద పెట్టినాడు. కాసేపటికి మరలా నిద్రలో అవ్వ చేయి పక్కకు చాపింది. అది చూసిన అమాయకుడు. "అరెరే... ఏందా తొందర... ఎప్పుడూ తిండిమొగం చూడనిదాని మాదిరి... ఒక్క నిమిషమాగు ఐపాయలే" అంటూ గిన్నె దించి... గంటెతో వేడి వేడి పాయసం తీసుకోనొచ్చి అవ్వ చేతిలో పోసినాడు.
అంతే... ఒక్కసారిగా చేయి సుర్రుమనేసరికి... అవ్వ "ఓరి నాయనోయ్... ఓరి దేవుడోయ్... నా చేతిని ఎవడో కాల్చేసినాడురోయ్" అంటూ గట్టిగా అరుస్తా పైకి లేసింది. ఆ అరుపులకు భయపడిన అమాయకుడు పరుగెత్తబోయి మూటను కొట్టుకున్నాడు. అంతే దానిలోని గిన్నెలన్నీ ధనధనధన పెద్ద చప్పుడు చేస్తా కిందబడినాయి. అంతే ఆ చప్పుళ్ళకు, అవ్వ అరుపులకు ఇంట్లో వాళ్ళేగాక వీధి వీధంతా వులిక్కిపడి లేచినారు. దొంగలంతా సామాన్లు తీసుకోని పారిపోతా కనబడ్డారు. వెంటనే జనాలంతా ఎక్కడోన్ని అక్కడ పట్టుకోని మెత్తగ తన్నినారు. ఆ అమాయకుడు ఆ వూరోడే కాబట్టి, వాని గురించి తెలుసు కాబట్టి వాన్ని ఎవరూ ఏమీ చేయలేదు. తరువాత జరిగిందంతా తెలుసుకోని "రేయ్.. నీవు అమాయకునివయినా చానా మంచి పనే జరిగింది. ఈ దొంగలు అందరు దొంగల్లా అట్లాంటిట్లాంటి అల్లాటప్పా దొంగలు కాదు. పెద్ద గజదొంగలు. చుట్టుపక్కల ఏడేడు పధ్నాలుగూర్లలో వీళ్ళ పేరు చెబితేనే హడల్. వీళ్ళని ఎవరు పట్టిస్తారో వాళ్ళకి లక్ష రూపాయలిస్తామని ఎన్నోసార్లు దండోరా వేసినారు. కానీ ఎవరూ పట్టుకోలేక పోయినారు. ఈ రోజు నీవల్ల దొరికినారు" అని చెప్పి వాన్ని, దొంగల్ని తీసుకోని రాజు దగ్గరికి పోయినారు.
రాజు జరిగిందంతా తెలుసుకోని పడీ పడీ నవ్వుతా "ఏదేమైనా నీవల్లే వాళ్ళు పట్టుబన్నారు" అని చెప్పి ఆ లక్ష రూపాయలు వానికే ఇచ్చినాడు. దాంతో వాడు హాయిగా పెండ్లి చేసుకోని పిల్లాపాపలతో కాలు మీద కాలేసుకోని బతికినాడు.
***********
కామెంట్‌లు
Popular posts
సింప్లిసిటీ!!;- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని.
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
విను చూడు!!?:-సునీతా ప్రతాప్-ఉపాధ్యాయిని పాలెం.
చిత్రం
*తెలంగాణతొలిశతావధాని* శ్రీమాన్ శ్రీ శిరశినహల్ కృష్ణమాచార్యులు వర్ధంతి నేడు(ఏప్రియల్ 15) కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా) లోని మోర్తాడ్ గ్రామంలో 1905, ఆగస్టు 12 వ తేదికి సరియైన క్రోధి నామ సంవత్సర, శ్రావణ శుక్ల విదియ నాడు రంగమ్మ, వేంకటాచార్యులకు జన్మించారు. వీరు బాల్యంలో పితామహులైన సింగారాచార్యులవద్ద మరియు తండ్రి గారైన వేంకటాచార్యుల వద్ద విద్యను అభ్యసించారు. తరువాత మాతామహులైన గోవిందాచార్యుల వద్ద 1914 నుండి 1921 వరకు ఏడు సంవత్సరాలు కావ్య, నాటక, అలంకార, సాహిత్య గ్రంథాలు, తిరుమంత్రార్థము, శ్రీ వచన భూషణ వ్యాఖ్యానము మొదలైన గ్రంథాలు అధ్యయనం చేశారు. పిమ్మట వల్లంకొండలో కనకాపురం శ్రీనివాసాచార్యుల వద్ద తర్క ప్రకరణాలు, మోర్తాడులో కందోఝల వెంకన్న వద్ద సిద్ధాంత భాగము, పిఠాపురంలో గుదిమెళ్ళ రంగాచార్య వద్ద వేదాంతమును అభ్యసించారు. 1926 నుండి కోరుట్ల లోని ఉభయవేదాంత సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రవేశించి అక్కడనే ప్రధానోపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. మధ్యలో 1934-37లో కొడిమ్యాలలో ఆనందమ్మ అనే విద్యార్థినికి సంస్కృతాంధ్రాలు, 1937లో లింగాపురంలో అనసూయాదేవి, సుశీలాదేవి అనే విద్యార్థినులకు సంస్కృత సాహిత్యం నేర్పించారు. రచనలు-సంస్కృతాంధ్రాలలో 40కి పైగా గ్రంథాలను రచించారు. వీటిలో కావ్యాలు, శతకాలు, సుప్రభాతాలు, స్తుతిగీతాలు, హరికథలు మొదలైనవి ఉన్నాయి. వీరి రచనలలో కొన్ని: 1. కళాశాల అభ్యుదయం 2. రామానుజ చరితం 3. చిత్ర ప్రబంధం 4. రత్నమాల (ఖండ కావ్యం) 5. మనస్సందేశ కావ్యము 6. సంపత్కుమార సంభవ కావ్యము 7. గాంధీతాత నీతిశతకము 8. గీతాచార్య మతప్రభావ శతకము 9. వెదిర వేంకటేశ్వరస్వామి సుప్రభాతము 10. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతము 11. వేణుగోపాల స్వామి సుప్రభాతము 12. నంబులాద్రి నృసింహస్వామి సుప్రభాతము 13. పద్మావతీ పరిణయము (హరికథ) 14. రుక్మిణీ కళ్యాణము (హరికథ) 15. ముకుందమాల 16. యామునాచార్యులవారి స్త్రోత్ర రత్నగీతములు 17. విశిష్టాద్వైతమత సంగ్రహము 18. వేదార్థ సంగ్రహము (అనువాదం) 19. గురువంశ కావ్యనిధి వీరు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మొదలైన చోట్ల అష్టావధానాలు, శతావధానాలు చేశారు. తెలంగాణా ప్రాంతంలో వీరు మొట్టమొదటి అవధానిగా కీర్తి గడించారు. వీరికి నైజాం రాష్ట్రాద్య శతావధాని, పండితరత్న, ఉభయవేదాంత విద్వాన్, ఉభయ వేదాంతాచార్య మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఢిల్లీలో జియ్యర్ స్వామివారు, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఘనంగా సత్కరించారు. మనోవిజయ బాణారంభం అనే మొదటగా రచించినట్లుగా కృష్ణమాచార్యులు రాసుకున్న స్వీయ కవితానుజీవనం అనే గ్రంథంలో రాసుకున్నారు. న్యాయశాస్త్రం అభ్యసించాలనే మక్కువతో అనేక కష్టాలను ఎదుర్కొంటూ, అసంపూర్తిగానే నిలిపివేసినప్పటికీ, తర్వాతి కాలంలో మద్రాస్ ప్రాంతానికి వెళ్లి తన వాంఛను నెరవేర్చుకున్నారు. కరీంనగర్ పట్టణంపై కంద పద్యాన్ని రాసి, వారి కవితా జీవనాన్ని ప్రారంభించారు. 1929లో కళాశాలఅభ్యుదయ తొలి కావ్యంగా గుర్తింపు పొందింది. 1939లో శతవిధభంగ శతకాన్ని, అభినవ కుచేలోపాధ్యానము గ్రంథాలను రచించారు. నైజాం పరిపాలన సమయంలో కోరుట్ల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన శతావధాని కృష్ణమాచార్యులు, తన తొలి శతావధాన్ని 1928లోనే నిర్వహించారు. ఆనాటి నుండి శతావధానిగా పేరొందిన కృష్ణమాచార్యులు, నైజాం రాష్ట్ర వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో 1946లో పండితరత్న బిరుదు పొందిన కృష్ణమాచార్యులు, హరికథ కాలక్షేపాలు, రామానుజ చరిత్ర, తత్వార్థప్రకాశిక, శృంగారపంచపానవిజయ రచన తదితర గ్రంథాలను రచించారు. ద్రావిడ భాషలోని అనేక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. అర్చరాదిమార్గం, శ్రీవచన భూషణం తదితర పుస్తకాలను కూడా రచించిన కృష్ణమాచార్యులు, గాంధీతాత నీతి శతకాన్ని కూడా రచించారు. కులమత బేధాలు వద్దంటూ ఆనాడే తన కవితల ద్వారా సమాజానికి చెప్పిన కృష్ణమాచార్యులు, బాల్య వివాహాలు వద్దని పేర్కొంటునే, బాల వితంతు వివాహాలను ప్రోత్సహించే విధంగా కవితా సంపుటిలను కూడా సమాజానికి అందించారు. 1955లో తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన వేదాంత సభల్లో కృష్ణమాచార్యుల గారికి ఘన సన్మానం లభించింది. విద్యాభూషణ, పండితరత్న, ఉభయవేదాంతచార్య తదితర బిరుదులు కృష్ణమాచార్యుల గారికి దక్కిన మణిమకుటాలు. ఎలాంటి సమస్యనైనా క్షణకాలంలో పరిష్కరించి, ఏకసంతాగ్రహిగా కీర్తి ఘడించిన కృష్ణమాచార్యుల గారికి సాక్షాత్యు సరస్వతిదేవియే స్వప్న సాక్షాత్కరించి సమస్యను ఇచ్చినట్లు తన కవితానుజీవనం పుస్తకంలో రాసుకున్నారు. 80సంవత్సరాల వయస్సులో ఏప్రిల్ 15, 1992 రోజున పరమపదాన్ని చేరుకున్న కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను కరీంనగర్‌లో శ్రీ త్రిదండి శ్రీరామన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తన ఇంటి ఇలవేల్పూ నంబులాద్రి లక్ష్మీనర్సింహాస్వామికి రాసిన సుప్రభాతం నేటికి ఆలయాల్లో ప్రతిధ్వనిస్తోంది. ఇటీవలే కృష్ణమాచార్యులు అందించిన మనస్సందేశ కావ్యాన్ని పుస్తక రూపంలో ప్రచురించి హైదరాబాద్‌లో పండితుల సమక్షంలో ఆవిష్కరించి, శతావధాని మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. శతావధాని గారి రచనలపై చాలామంది విద్యార్థులు కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల్లో పిహెచ్‌డిలు కూడా పూర్తి చేశారు. డాక్టర్ సముద్రాల శ్రీనివాసాచార్య కృష్ణమాచార్య శతావధాని తెలుగు రచనలు పరిశీలన అనే అంశంపై పై పీ.హెచ్. డీ చేశారు. వారి కుమారులు శిరిశినహళ్ వెంకటాచారి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు--డాక్టర్ . అమ్మిన శ్రీనివాస రాజు
చిత్రం
*బహు చక్కని కథలు బక్రిచెప్యాల బాదుషాలు*:- బట్టల సాయిచరణ్-7వ, తరగతి -జి.ప.ఉ.పా.బక్రిచెప్యాల -మం:సిద్ధిపేట -జాల్లా:సిద్ధిపేట
చిత్రం