అందాల కాశ్మీర్ లో అగ్నివర్షం..?:- కవి రత్న సాహిత్య ధీర సహస్ర కవి భూషణ్ పోలయ్య కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్

(రక్తంతో తడిసిన పూలవనం కన్నీటి గాథ)
==============================
పార్టు...1
తెల్లని మంచు కొండల మధ్య 
గలగల పారే జలధారల సంగీతం
పచ్చని పచ్చిక మైదానాల్లో
పరుగెత్తే గుర్రపుస్వారీ కలలు...

బోటులో షికారులు...
మంచుతో చిరునవ్వుల
చిన్నారుల ఆటలు పాటలు...
ఆహా ! అందమైన యాపిల్ తోటలు...

రమణీయమైన అందమైన 
అతిసుందరమైన మనోహరమైన 
కనువిందైన పసందైన ప్రకృతి 
అందాలను తిలకించి 
పులకించి పోయే వేళ...

ఆ నేలపై అడుగులు వేసే వేళ... 
జీవితం ఒక హోళీ పండుగ...
గుండెల్లోన కురుస్తుంది మల్లెపూలవాన 
కలల కశ్మీరం ఒక స్వర్గ ధామం...
నేడు జరిగింది మారణ హోమం...

ఆ కలల నదిలో అల్లకల్లోలం 
ఆర్మీ దుస్తుల్లో ఉగ్రవాదులు ప్రత్యక్షం... 
తుపాకి తూటాలతో విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతూ వీరవిహారం... 

పార్టు...2
ఎటుచూసినా శవాల గుట్టలే...
ప్రకృతి అందాలను ఆస్వాదించే 
అమాయకపు పర్యాటకుల హాహాకారాలే
ఆర్తనాదాలే...పారె రక్తపుటేరులే...

కాళ్ళేవేళ్ళా పడినా కాళ్ళపారాణి ఆరని హనీమూన్ కోసం వచ్చిన నవవధువు
కళ్ళముందే భయంకరమైన కాల్పులు... 
క్షణాల్లో... శవమై నేలకొరిగిన భర్త... 

కన్నబిడ్డల కట్టుకున్న భార్యల కళ్ళెదుటే 
కసాయి ముష్కరులు కర్కశంగా జరిపిన 
కాల్పుల్లో భర్తలెందరో రక్తపు మడుగుల్లో
గిలగిల కొట్టుకుంటూ శవాలై మిగిలిన
హృదయ విదారక విషాధకర దృశ్యం...

నిన్నటి పహల్‌గామ్‌లోని 
మినీ స్విట్జర్లాండ్ బైసరిన్ లోయ నేడు 
అమాయకపు టూరిస్ట్ ల శ్మశానవాటిక.

వారు పర్యాటకులు కాదు...
ప్రకృతిని ఆరాధించే పాదయాత్రికులు
వారు యోధులు కాదు...
అందాన్ని ఆస్వాదించే ప్రేమ పక్షులు... 
కానీ "టెర్రరిస్టులు టూరిస్టులే టార్గెట్" గా 
పేల్చిన తుపాకీ తూటాలకు బలైపోయారు 
పచ్చని పచ్చిక బయళ్ళలో
రక్తపు మడుగుల్లో శవాలై మిగిలారు...

ఎటు చూసినా కన్నీటి నదుల ప్రవాహమే
రెక్కలు విరిగి నేలకొరిగిన శాంతికపోతాలే
ఎరుపెక్కిన సూర్యుని మౌన రోదనలే...
ఆరోజు కాశ్మీర్ శాలువా రక్తంతో తడిసింది 

వారు మనుషులు కాదు 
ఉన్మాదులు....ఉగ్రవాదులు... 
మతోన్మాదులు...రక్తంత్రాగే రాబందులు 
మానవత్వంలేని మానవ మృగాలు...
మరణమృదంగం వాయించే  
ఆర్మీ దుస్తుల్లో వచ్చిన మృత్యుదూతలు...
వారు నరమేధ యజ్ఞానికి పర్యాటకుల్ని 
బలి తీసుకున్న నరరూప రాక్షసులు...

పార్టు...3
పహల్ గామ్ లో 
బైసరిన్ లోయలో 
పర్యాటకులు...ఉగ్రవాదుల 
తూటాలకు బలైన శాంతి పుష్పాలు
నేడు శాశ్వత నిద్రలోకి 
జారుకున్నవారి ఆత్మలు 
కంపించిన కాశ్మీరు మంచుకొండల్లో 
పక్షులై పచ్చని వృక్షాలపై 
నిత్యం సంచరిస్తూనే ఉంటాయి...

కానీ కాశ్మీర్ కొండల్లో ఎక్కడ దాగి ఉన్నా 
పట్టుకొని ఆ ఉగ్రవాద నక్కల తలలు నరికి
బైసరిన్ లోయలో వ్రేలాడ దీసిననాడే...
వారి రక్తపుధారలతో ఆ నేల తడిసిననాడే..

ప్రపంచదేశాల్లో పాక్ ను 
ఏకాకిని చేసిననాడే... 
కోలుకోలేని దెబ్బ తీసిననాడే...
గుర్తుండే గుణపాఠం నేర్పిననాడే...

ఉగ్రమూకల్ని
వేటాడి వేటాడి వెంటాడి 
ఉరికంబం ఎక్కించిన నాడే...
తల్లి భరతమాత నుదుట 
ఉగ్రవాదుల రక్తతిలకాన్ని దిద్దిననాడే...

వీరసైనికులందరు విజయగర్వంతో 
జయహో జయహో భారత్ అంటూ 
ఎర్రకోటపై రెపరెపలాడే 
త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేసిననాడే...

పర్యాటకుల ఆత్మలు శాంతించేది...
140 కోట్లమంది భారతీయుల
గుండేల్లో రగిలే అగ్నిపర్వతాలు చల్లారేది..
 
వారికిదే...
మా కన్నీటి వీడ్కోలు...
మా ప్రగాఢ సంతాపం...
మా అశృనయనాలతో అక్షరార్చన.‌.

ఉగ్రవాదులకు ఒక్కటే హెచ్చరిక...
ఓ మూర్కులారా..! 
ఓ ముష్కరులారా..!
మీ తుపాకుల ధ్వనితో 
కాశ్మీర్ లో "శాంతిని" మట్టుబెట్టలేరు
నేడు మీరు ప్రతి తూటా వెనక రాసుకున్న 
రక్త చరిత్రే రేపు మీకు..."మరణశాసనం"...!!


కామెంట్‌లు