సునంద భాషితం :- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయములు-842
ఉపనయ న్న పనయన్ ధర్మో వికరోతి ధర్మిణమ్ " న్యాయము
*****
ఉపనయన అనగా చెంతకు కొనిపోవుట, చెంతకు తెచ్చుట, బహూకరించుట.అపనయన అనగా తీసుకుని పోవుట,తొలగించుట, అపకారము.ధర్మ అనగా కర్తవ్యము, పుణ్యము,సంప్రదాయము, న్యాయము, స్వభావము, వేదోక్త విధి, యజ్ఞము,సత్కార్యము, మూలగుణము, భక్తి, ఉపనిషత్తు, ధర్మరాజు, యముడు. కరోతి అనగా క్రియ, చేయడం.వికరోతి అనగా ప్రత్యేకంగా చేయడం. ధర్మిణమ్ అనగా ధర్మమును ఆచరించే వాడు అని అర్థము.
ఇప్పుడొక ధర్మమును మరొకప్పుడు దానికి విరుద్ధమైన మరొక ధర్మమును ఉపదేశిస్తే ధర్మమును అనుసరించే వారి మతిపోతుంది అనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
 ధర్మము అనేది ఎప్పుడు,ఏకాలమైనా మారదు. అన్ని కాలాలు,అన్ని సమయాల్లో ఆచరించబడేదే అసలైన ధర్మము. ఇది కేవలం ఒక వ్యక్తి కోసం మాత్రమే కాదు, కుటుంబం, సమాజంతో పాటు అన్ని మతాల, దేశాల కోసం కూడా చెప్పబడి,ఆచరింపబడేదే అసలైన ధర్మము.
 ఈ ధర్మం ఎప్పటికీ స్థిరంగానూ, శాశ్వతంగా నూ ఉంటుంది.మానవీయ విలువలతో కూడి ఉంటుంది.అది ముఖ్యంగా సత్యం పలకడం ఎన్ని కష్టాలు వచ్చినా సత్య హరిశ్చంద్రునిలా  సత్యాన్ని వదులుకుండా ఉండటం...ధర్మరాజులా సత్య నిష్ఠతో పాలించడం. 
శిబి చక్రవర్తి వలె చిన్న ప్రాణుల యెడ సైతం దయ చూపి వాటి కోసం జీవితాన్ని త్యాగించడం.
 బలి చక్రవర్తి వలె ఇచ్చిన మాట ప్రకారం దానం చేయడం.
 ద్రౌపది తన కుమారులను చంపిన అశ్వత్థామను క్షమించినట్లుగా శత్రువు పట్ల క్షమా గుణం కలిగి ఉండటం.
 ఇవే కాకుండా న్యాయము తప్పకుండా సమ న్యాయం చేయడం. ఇంద్రియ నిగ్రహంతో సాధుత్వంతో జీవించడం. సాటి మానవుల్లో దైవాన్ని చూస్తూ మానవ సేవను మాధవ సేవగా చేయడం లాంటి ఎన్నో గొప్ప లక్షణాలు, గుణాలు అన్నీ  వెలకట్టలేని ధర్మ రూపాలు.
 అయితే అలాంటి ధర్మాలు, విలువలు తరాలు మారినా, యుగాలు గడిచినా మారకుండా ఉండేవి. ధర్మం అనేది వ్యక్తుల జీవన విధానంతో ముడిపడిన నైతికత విలువల రూపం.
 అబద్ధం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడరాదు అని చెప్పిన మన పెద్దవాళ్ళే పోతన భాగవతంలోని పద్యాన్ని ఉటంకిస్తూ అత్యవసర వేళల్లో అబద్ధం ఆడవచ్చు అని చెప్పిన ఈ పద్యాన్ని చూద్దామా..
శుక్రాచార్యుడు బలి చక్రవర్తితో "వారిజాక్షులందు,వైవాహికము లందు/ ప్రాణ విత్త మాన భంగమందు/ జకిత గోకు లాగ్రజ్జన్మి రక్షణ మందు/బొంకవచ్చు నఘము పొందదధిప!/
అనగా ఓ బలిచక్రవర్తి! ఆడవారి విషయంలో కాని, పెళ్ళికి సంబందించిన వారికి గాని ప్రాణానికి, ధనానికి, గౌరవానికి భంగం కలిగినప్పుడు గాని,భీతిల్లిన గోవులను,విప్రులను కాపాడేటప్పుడు కానీ అవసరమైతే అవసరమైతే అబద్ధం ఆడవచ్చు అంటారు.
ధర్మాలను అవసరమైనప్పుడు  మార్చి చెప్పడంతో ధర్మాలను ఆచరించే వారు తప్పకుండా సందిగ్ధతకు లోనవుతారు. ఎప్పుడూ ఏం చేయాలో వారికి అంతుపట్టని పరిస్థితి వస్తుంది. అలా రావడం వల్ల మంచి కంటే చెడు ఎక్కువగా చేసే ప్రమాదం ఉంటుంది.
 కాబట్టి పరీక్షలకు నిలబడే ధర్మాలనే చెప్పాలని ఇతర ధర్మాలను చెప్పి నూతనంగా ఆచరించే వారిని అయోమయంలో పడవేయొద్దు అని చెప్పడానికి ఈ "ఉపనయ న్న పనయన్ ధర్మో వికరోతి ధర్మిణమ్ న్యాయము "ను ఉదాహరణగా చెబుతుంటారు.
 కాలానికి ఎదురీది నిలబడే ధర్మాలనే మనం ఇతరులకు చెప్పాలి. రాన్రానూ అనుభవం మీద విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు వారే అసలు ధర్మం చెడకుండా వారే చూసుకుంటారు.

కామెంట్‌లు