రాత : సరికొండ శ్రీనివాసరాజు

 సురేంద్ర చిన్నప్పటి నుంచీ క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు. ఏకసంతాగ్రాహి. ఉపాధ్యాయులు చెప్పింది శ్రధ్ధగా విని ఒంట బట్టీంచుకునే వాడు. కానీ అతడికి క్రికెట్ పిచ్చి. ప్రతిరోజూ సాయంత్రం అతని క్లాస్ మేట్స్ కొంతమందిని తీసుకు వెళ్ళి, చీకటి పడేదాకా క్రికెట్ ఆడేవాడు. సెలవు రోజుల్లో రోజంతా ఆటే. అతని చెల్లెలు శ్రుతి ఎన్నో విధాలా బతిమాలినది. క్రికెట్ ఆటను పక్కన పెట్టమని. మనోడు వింటేనా?
     సురేంద్ర ఇప్పుడు 9వ తరగతి. ఒకరోజు సురేంద్ర తన అమ్మతో ఆరోజు వాళ్ళ తెలుగు ఉపాధ్యాయుడు చెప్పిన మాటలు చెపుతున్నాడు. "మన రాతను రాసేది బ్రహ్మ అని అంటారు. కాని మన రాతను మనమే రాసుకుంటున్నాము. అని చెప్పాడు. అవును నా రాతను నేనే రాసుకుంటున్నా. అదీ ఎంతో దివ్యంగా. చదువులో నేను ఎప్పుడూ బెస్ట్." అన్నాడు సురేంద్ర. 
     అప్పుడు సురేంద్ర చెల్లెలు శ్రుతి ఇలా అన్నది. "నువ్వు నీ ఒక్కడి రాతనే కాదు. ఎంతో మంది రాతను కూడా రాస్తున్నావు అన్నయ్యా! నిజంగా నువ్వు ఎంతో గ్రేట్. నీ చెల్లెలిని అని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నా." అని. సురేంద్ర తెల్ల ముఖం వేశాడు. "నువ్వు ఏక సంతాగ్రాహివి కాబట్టి నీకు తిరుగు లేదు. నీ తెలివిని ఇతరులకు పంచి వాళ్ళను నీ అంత గొప్పవారిని చేస్తే బాగుంటుంది కదా! కాని చదువుకోవాల్సిన విలువైన సమయాన్ని  నీకు టైం పాస్ కోసం, నీ స్వార్థం కోసం ఎంతో మందికి వృథా చేస్తున్నావు. ఆ సమయాన్ని వాళ్ళకు చదువు మీద ఆసక్తి కలిగేలా చేస్తే ఎంత మంది భవిష్యత్ బంగారం అవుతుంది? నీ స్వార్థం కోసం వాళ్ళ విలువైన భవిష్యత్ అంధకారం చేస్తావా?" అన్నది శ్రుతి.
     సురేంద్ర ఆలోచనలో పడ్డాడు. తాను చేజేతులా ఎంతో మంది భవిష్యత్ నాశనం చేస్తూన్నాడు. ఇక పై చెల్లెలు చెప్పినట్లు నడచుకోవాలని అనుకున్నాడు.

కామెంట్‌లు