సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయములు-848
"ఏకోపి హన్తి గుణ లక్ష మపికా దోష" న్యాయము
****
ఏకోపి అనగా ఏ ఒక్కరు,ఎవరో ఒకరు. హన్త అనగా సంతోషము,దయ దుఃఖములను సూచించు పదము.గుణ అనగా గుణము( మంచి లేక చెడ్డది),ఒక సద్గుణము,ఉపయోగము, ఫలము,త్రాడు,అల్లెత్రాడు,వీణ యందలి తీగె,ఆవృత్తి, గొప్ప దనము, మూడు అను సంఖ్య.లక్ష అనగా చూచుట,గురి పెట్టుట,స్పష్టము జేయుట,నూరు వేలు,గుఱి.మపిక అనగా మాపకము ,కొలది.దోష అనగా తప్పు,నింద, లోపము, నేరము, కీడు అనే అర్థాలు ఉన్నాయి.
లక్ష సద్గుణములు ఉన్ననూ ఒక దోషము తుడిచి వేయును. అనగా "కడివెడు పాలు ఒక విష బిందువుతో పాడయినట్లు" అని అర్థము.
లక్ష మంచి గుణాలు ఉన్నప్పటికీ ఒకే ఒక్క చెడ్డ గుణం ఆ వ్యక్తి పరువును నిలువునా కూల్చేస్తుంది.అనగా ఆ ఒక్క చెడ్డ గుణము చాలు.మిగిలిన లక్ష మంచి లక్షణాలను కప్పి వేసి అందరిముందూ దోషిగా నిలబెట్టేందుకు.అప్పటి వరకు ఉన్న పరువూ ప్రతిష్ఠ, మంచితనం అన్నింటినీ గంగలో కలిపేస్తుంది.
రామాయణం అనగానే రాముడు, రావణుడు- వీరిద్దరూ మంచికి,చెడుకు గుర్తులుగా మనకు కనిపిస్తారు. అయితే రావణుడిలో అనేక మంచి గుణాలు ఉన్నాయి. అవి అతడు అనేక శాస్త్రాలలో గొప్ప పండితుడు, గొప్ప భక్తుడు, గొప్ప సేనాని, మహా తపస్వి, గొప్ప రాజ నీతిజ్ఞుడు,త్రికాలవేది,ధర్మం నీతిని గౌరవించేవాడు.మంచి పాలకుడు అంటారు. ఇలా అనేక మంచి గుణాలు ఉన్నప్పటికీ అతడిలోని  చెడ్డ గుణాలైన అహంకారం, పరస్త్రీ వ్యామోహం ఇవే రావణుని పతనానికి కారణం అయ్యాయి.
ఇలా ఎన్ని మంచి గుణాలు ఉన్నప్పటికీ ఒకే ఒక్క చెడ్డ అలవాటు లేదా గుణము అప్పటి వరకు ఉన్న మంచి పేరును పోగొట్టి అధః పాతాళానికి నెట్టి వేస్తాయనీ,నలుగురి ముందు దోషిగా నిలబెడతాయనీ మనం అర్థం చేసుకోవచ్చు.
అందుకే మన పెద్దవాళ్ళు ఇలాంటి వారిని ఉద్దేశించి ఓ  సామెత వాడతారు. "కుండెడు పాలల్లో ఒక్క విషపు బొట్టు చాలు." పాలన్నీ విష పూరితం కావడానికి. అలాగే మరో సామెత కడివెడు పాలల్లో ఒక్క ఉప్పుగల్లు వేస్తే ఆ పాలన్నీ విరిగి పోతాయి. ఎంత తెల్లటి కాగితం అయినా దానిమీద ఏదైనా చిన్న మరక లేదా మచ్చ ఉంటే అదే అందరికీ కనిపిస్తుందనీ, అలాంటిదే  మనిషి వ్యక్తిత్వం కాబట్టి ఎలాంటి మచ్చ లేకుండా, పడకుండా జీవితాన్ని గడపాలని చెబుతారు.
 దీనికి ఉదాహరణగా మన పెద్దవాళ్ళు తరచూ అనే  మాటలను కూడా గుర్తు చేసుకుందాం.
ఒక వ్యక్తి  గురించి పెళ్లి సంబంధానికి  వెళ్ళినప్పుడు  ఆ వ్యక్తి గుణగణాలు  వర్ణించి చెబుతూ "మా వాడికి అన్నీ మంచి గుణాలే ఉన్నాయి ఆ ఒక్కటి తప్ప"అన్నారట. ఇన్ని మంచి గుణాల్లో  ఆ ఒక్క చెడ్డ గుణము వల్ల పెద్ద సమస్యే‍ముంది అనుకుని-ఇంతకీ ఆ చెడ్డ గుణము ఏమిటి అని అడిగితే "చెబితే వినడు - ఒంటబుట్టదు.అని చెప్పారు.ఇది చాలదా? అతనిలోని మంచి అంతా బూడిదలో పోసిన పన్నీరు కావడానికి.
 కాబట్టి చెడు గుణం ఒకటి ఉన్నా చెరుకు గడకు వెన్ను పుట్టి అందులోని తీపంతా పోయినట్లుగానే ఉంటుంది. 
 అలాంటి చెడు గుణాలు దరి దాపుల్లోకి చేరకుండా చూసుకోవాలి. అప్పుడే మనిషి వ్యక్తిత్వం మంచి ప్రకాశవంతమైన దీపమై వెలుగుతుంది.
 "ఏకోపి హన్తి గుణ లక్ష మపికా దోష"న్యాయము అంటే పూర్తిగా అర్థం అయ్యింది కదా!  ఎన్ని సుగుణాలు ఉన్నప్పటికి ఒక్క దోష గుణం కూడా దరిచేరకుండా చూసుకోవాలి.అప్పుడే మంచి మనిషిగా పదుగురి ప్రశంసలను,అందరి మన్ననలను ఆదరాభిమానాలను పొందగలం.ఇదే ఇందులోని అంతరార్థం.

కామెంట్‌లు