తాతా - మనవడు:- - యామిజాల జగదీశ్
 నా చిన్నప్పుడు, మా తాతగారు నాతో ఇలా అన్నారు...
"వర్షం పడినప్పుడే నిన్ను గుర్తుంచుకునే వ్యక్తికి నీ గొడుగు ఎప్పుడూ ఇవ్వకు...." అని.
అప్పుడా ఆయన ఎందుకలా అన్నారో  నాకు అర్థం కాలేదు.
అయితే అదేదో మంచి మాటే అని మాత్రమే అనుకున్నాను. సరే అని చెప్పాను.
కానీ నేను పెరుగుతున్న కొద్దీ జీవితంలో ఎదురైన దెబ్బలతో ఆ మాటలలోని అర్థాన్ని గ్రహించాను.
వారికి ఏదైనా అవసరమైనప్పుడు మాత్రమే కనిపించే వ్యక్తులు ఉన్నారని...వారిని కష్టాలు సతమతం చేసినప్పుడు మాత్రమే నన్ను వెతుకుతారని తెలిసొచ్చింది. ఇందుకు అనేకానేక సంఘటనలు ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటూ పోతే ఈ పెద్ద పుస్తకమే రాయాల్సి ఉంటుంది.
సూర్యుడు ప్రకాశించినప్పుడు
వారు నా పేరు కూడా గుర్తుంచుకోరని నేను తెలుసుకున్నాను.
ఇప్పుడు తుఫాను అతలాకుతలం చేసినప్పుడు నా దగ్గరకు రావొచ్చు. కానీ రేపు సూర్యుడు ఉదయించినప్పుడు నేనెవరో కూడా తెలీదు వారికి. అటువంటప్పుడూ
నేను వారి కోసం ఉంటానా అనేది ప్రశ్నార్థకమే కదూ?! ఒకవేళ నేనున్నానని అనుకుంటే అది ఆనందమూ! ఆశ్చర్యమూ!!

కామెంట్‌లు