న్యాయాలు-859
"ఆరోప గుణ కథనం స్తుతి" న్యాయము
*****
ఆరోప అనగా ప్రవేశ పెట్టడం, దోషం, విమర్శ. గుణ అనగా లక్షణం, నాణ్యత ధర్మం,తీగ, గుణము ( మంచి లేక చెడ్డది) ఒక సద్గుణము, ఉపయోగము ఫలము, త్రాడు ,అల్లెత్రాడు, వీణ యందలి తీగె,ఆవృత్తి, గొప్పదనము,3 అను సంఖ్య.కథనం అనగా చెప్పుట,వివరించుట.స్తుతి అనగా స్తోత్రము,పొగడ్త ప్రశంసించడం, ఆరాధన ,గౌరవించడం అనే అర్థాలు ఉన్నాయి.
లేని గుణములను ఆరోపించడమే స్తుతి అని అర్థము. ఇది అందరికీ కాకపోయినా కొందరి విషయంలో వర్తిస్తుంది. అవసరం తీర్చుకోవడానికి,తమ పబ్బం గడుపుకోవడానికి ఇతరులలో లేని మంచి గుణాలను ఆయా వ్యక్తులకు ఆపాదించి, వారిని తమ బుట్టలో వేసుకుని తాము అనుకున్నది సాధిస్తారు అనే ఉద్దేశంతో ఈ న్యాయమును మన పెద్దవాళ్ళు తరచూ ఉదాహరణగా చెబుతుంటారు.
కొంతమంది మనుషులకు కొన్ని బలహీనతలు ఉంటాయి.ఎవరైనా తమ గుణగణాలను వర్ణిస్తూ మెచ్చుకుంటే చాలు వారి మెచ్చుకోలులో నిజం లేకపోయినా ఉబ్బి తబ్బిబ్బు అవుతూ వాళ్ళు అడిగిన సహాయం చేస్తుంటారు.
మెచ్చుకోలు లేదా పొగడ్త అగడ్త లాంటిది. ఎవరివల్ల తాము అనుకున్న కార్యాలు జరుగుతాయో వారిని ఇంద్రుడు ,చంద్రుడు అంటూ స్తుతిస్తూ , తమ పని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న తర్వాత అమాంతంగా అగడ్త లోకి తోస్తారు. అనగా తోయడమంటే అర్థం ఎవరి వల్ల అయితే పని జరిగిందో తక్షణమే వారినిక చిన్న చూపు చూడటం మొదలు పెడతారు. అప్పుడు కాని అర్థం కాదు.తాను పొగడ్తల అగడ్త లోకి నెట్టి వేయబడ్డానని, తనను "మునగ చెట్టు ఎక్కించారని"...
మునగ చెట్టు ఎక్కించడం అంటే ఏమిటో ఈపాటికి అర్థమై వుంటుంది. మునగ చెట్టు కొమ్మలు చూడటానికి లావుగా, బలంగా కనిపిస్తాయి కానీ అవి చాలా పెళుసుగా ఉంటాయి. అవి చిన్న పిల్లల బరువును కూడా ఆపలేవు. ఎక్కితే కొమ్మ కొమ్మ పుటుక్కున విరిగి పోతుంది.
అందుకే "ప్రశంస పన్నీరు లాంటిది. వాసన పీల్చి వదిలేయాలి. ఆ కొద్ది సేపు ఆ జల్లులలో హాయిగా తడవాలి తప్ప తాగకూడదని తెలుసుకోవాలి".
ఇంతగా చెప్పుకుంటున్న స్తుతి లేదా ప్రశంసలు కోరుకునే వారు లేదా అలవాటు పడిన వారు ఏచిన్న విమర్శను కూడా తట్టుకోలేరు.
ఇక పిల్లలను అతిగా పొగిడితే లేదా ప్రశంసిస్తే వాళ్ళలో ఒకలాంటి గర్వం పొడసూపుతుందని చాలా మంది తల్లిదండ్రులు పిల్లల ముందు పొగడటం కానీ,మెచ్చుకోవడం కానీ చేయరు. వారి గెలుపును కానీ సాధించిన దానిని కానీ అతి మామూలుగా తీసుకుంటూ ఉంటారు.
అయితే ఇది నచ్చని పిల్లలు తల్లిదండ్రుల పట్ల అపోహలు పెంచుకుంటారు అనడానికి ఓ ఆసక్తికరమైన వాస్తవ కథను విందాము.
మహా కవి భారవి చిన్న వయసులోనే ఉండగానే అతనిలోని కవిత్వ పటిమకు పండిత లోకం బ్రహ్మరథం పడుతుంది. అందరూ అతడిని పొగడ్తలతో ముంచెత్తుతారు. కానీ అతడి తండ్రి అదంతా చూసి దానిని మామూలుగా చూస్తాడు. ఒకరోజు రాజ సన్మానం జరుగుతుంది.తల్లితో సంతోషం పంచుకుంటాడు.ఇంటికి వచ్చిన తండ్రికి తల్లి ఈ విషయం చెప్పడం తండ్రి దానిని చాలా మామూలు విషయంగా తీసుకోవడం గమనిస్తాడు. తండ్రి మీద విపరీతమైన కోపం పెంచుకుని బండరాయితో తండ్రిని గాయ పరిచేందుకు అటక మీద దాక్కుంటాడు.
తల్లి తండ్రికి భోజనం వడ్డిస్తూ "మన అబ్బాయిని అందరూ మెచ్చుకుంటున్నారు. రాజ సన్మానం కూడా పొందాడు.అయినా మీరు వాడిని మెచ్చుకోలేదు. వాడికి ఎంత బాధగా ఉంటుందో మీకు తెలియదా? అని అడుగుతుంది.
తండ్రి ఏం జవాబు చెబుతాడో చెవులు రిక్కించి వింటుంటాడు. అప్పుడా తండ్రి నాకు మాత్రం మెచ్చుకోవాలని వుండదా? మనం మెచ్చుకుంటే వాడి అభివృద్ధి అంతటితో ఆగుతుంది.పైగా ఆయు క్షీణం కూడా. నేడు మన భారవి కంటే గొప్ప కవి ఉన్నాడా ఈ లోకంలో.. అందుకే లోలోపల ఎంత సంతోషంగా ఉన్నా పొగడటం లేదు" అంటాడు.
ఆ మాటలు విన్న భారవి కిందికి దిగి వచ్చి తండ్రి పాదాలపై పడి క్షమించమని వేడుకుంటాడు.
ఇక ప్రస్తుత విషయానికి వద్దాం."ఆరోప గుణ కథనం స్తుతి" న్యాయము లోని అంతరార్థం గమనించి మసలుకోవాలి. పొగడ్తలతో ముంచెత్తే వారిని పొగడ్తల్లో మునిగి పోయేవారిని చూస్తూ ఉన్నాం కాబట్టి అలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.మీరూ నాతో ఏకీభవిస్తారు కదూ!.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి