“”కాలభైరవం భజే “”(ఐదవ భాగం):- సేకరణ:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 కాలభైరవుడు, వీరభద్రుడు ఇరువురు ఒకరేనా? లేక వేర్వేరు దేవుళ్ళా? 
~~~~~~~~~~~~~~~~~~~~~~
కాలభైరవుడు, వీరభద్రుడు ఇద్దరూ కూడా శివుని అంశలే. కానీ వారిని సృష్టించిన ప్రయోజనాలు వేరు వేరు.

కాలభైరవుడి వృత్తాంతం 
~~~~~~~~~~~~~~~~
ఒకప్పుడు సృష్టికర్త బ్రహ్మ గారికి ఐదు తలలు ఉండేవట. దానితో అయన త్రిమూర్తుల్లో తానే గొప్ప అని అహంకరించడంతో శివుడికి ఆగ్రహం కలిగింది. ఆకోపంతో ఒక్కసారిగా హూంకరించాడు. ఆ హూంకారంనుండి 
భయానకమైన కాలభైరవుడి రూపం సంతరించుకుంది. బ్రహ్మ అహంకారానికి కారణమైన ఆ ఐదో తలని తన చిటికెన వేలితో తుంచేశాడు. అప్పటినుంచే బ్రహ్మ గారు చతుర్ముఖుడుగా మిగిలారు.

అయితే కథ అక్కడితో ముగిసిపోలేదు.
బ్రహ్మ గారి శిరస్సుని తుంచేయడంతో ఆయనకు బ్రహ్మహత్య పాతకం  చుట్టుకుంది. దానితో ఏమి చేయాలో తెలియక, తన సృష్టి కర్త అయిన శివుడినే ప్రార్థించగా కాశీకి వెళ్ళమని చెప్పాడు.దాంతో కాశీ బాట పట్టాడు కాలభైరవుడు.

కాశీ ప్రవేశంతో ఆయనకున్న బ్రహ్మహత్యాపాతకం నశించిపోయింది. కాశీలో ఎటువంటి పాపం ఆయన్ని ఏమి చేయలేదు కనుక అక్కడే అయన స్థిరనివాసం ఏర్పరుచుకున్నాడు. అంతే కాకుండా అయన కాశీ కి కొత్వాల్ (ఒక రకంగా చెప్పాలంటే పోలీస్ కమీషనర్ స్థాయి అధికారి) గా నియమించబడ్డాడు.
కాశీకి వెళ్ళిన ఎవరైనాసరే కాలభైరవుడి దర్శనం చేసుకుని తీరాల్సిందే.

కాశీ కి మాత్రమే కాదు అష్ట దిక్కులకి కాపలా కాస్తూ  నియంత్రించే  అష్ట భైరవులు కూడా మహాకాలభైరవుని అధీనంలో ఉంటారు. పోలీస్ అధికారుల భాషలో చెప్పాలంటే ఈయన ఒక డీజీపీ స్థాయి అధికారి.

మన తెలుగు వారి దగ్గర కాలభైరవ ఆరాధన తక్కువే. కానీ తమిళ నాట కాలభైరవ ఆలయాలు, ఆరాధనలు ఎక్కువే.

 వీరభద్రుడి వృత్తాంతం 
~~~~~~~~~~~~~~~
దక్షయజ్ఞం సందర్భంగా శివుడికి జరిగిన అవమానం తట్టుకోలేక సతీదేవి దేహత్యాగం చేయడంతో శివుడు ఆగ్రహోదగ్రుడు అవుతాడు. దానితో తన జటాజూటం నుంచి ఒక శిరోజాన్ని తీసి విసరడంతో అది వీరభద్రుడిగా, భద్రకాళి గా ఉద్భవిస్తుంది. 

వీరభద్రుడు దక్షుడి తల తెగనరికి  యజ్ఞ గుండంలోకి విసిరేశాడు. అలా వీరభద్రుడు దక్షుడికి గర్వ భంగం చేశాడు. వీరభద్రుడి ఆగ్రహాన్ని కాళీ ఒక యువతిగా మారి శాంతపరిచింది. 

 మొత్తంగా చెప్పాలంటే…..

వీరభద్రుడు ఇంకా కాలభైరవుడు వీరిని సృష్టించిన ప్రయోజనం ఒకటే. సృష్టిలో మనిషికి కావొచ్చు, దేవతలకి కావొచ్చు అహంకారం ఉండకూడదు అని . అలా నేనే గొప్ప అని విర్రవీగితే మహాశివుడి ఒక్క గోరు, ఒక్క శిరోజం చాలు మన అహాన్ని అణచడానికి అని సారాంశం.

కథల్లోని సారాంశాన్ని గ్రహించి నడుచుకుంటే మనకు అంతా మంచే జరుగుతుంది.
శుభం.
-:కాలభైరవం భజే సమాప్తం:-
—------------------------------------

కామెంట్‌లు