పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి: - వికారాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సేరి రాజేష్ రెడ్డి,
  తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని, ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని విద్యార్థుల నమోదు ప్రచార జాతా రెండవ రోజు ప్రారంభ కార్యక్రమ సందర్భంగా టిఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ వెంకటరత్నం  పిలుపునిచ్చారు. 
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ సెరి రాజేష్ రెడ్డి గారు ప్రచార జాతాను ఉద్దేశించి  మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉన్నారని, విశాలమైన తరగతి గదులు , ఆటస్థలం ఉన్నాయని  తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను ఉచితంగా పొందాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ బడులను కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉన్నదని తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు  పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్కులు, ఏకరూప దుస్తులు ఉచితంగా అందించబడుతున్నాయని, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, వారానికి మూడు సార్లు కోడిగుడ్లు, రాగిజావ అందిస్తున్నారని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను ఆదరించి పిల్లలను చేర్పించి, ఫీజుల భారం లేని ఉచిత విద్య పొందాలని, విద్యార్థుల సమగ్ర వికాసానికి ప్రభుత్వ పాఠశాలలు దోహదపడుతాయని తెలియజేశారు.ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించటానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, ఏఐ ఆధారిత బోధన, డిజిటల్ తరగతి గదులు, లైబ్రరీ, లేబరేటరీలతో పాటు ఆటపాటలతో అహ్లాదకరమైన వాతావరణంలో, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధతో, నిపుణులైన ఉపాధ్యాయులతో ఒత్తిడి లేని చదువు అందించబడుతుందని, పిల్లల మానసిక ఆరోగ్యానికి,వ్యక్తిత్వ వికాసానికి అనువుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయని, మన పిల్లలను మన ఊరి బడిలోనే చేర్పించి బడికి అవసరమైన వసతుల కల్పనకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే తప్పనిసరిగా బడి నిలబడుతుందని తెలియజేశారు. 
ఈ సందర్భంగా ముఖ్య  అతిథిగా విచ్చేసిన  విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీంద్ర గౌడ్ గారు మాట్లాడుతూ ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన, ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారని, అత్యున్నత విద్యార్హతలు కలిగిన టీచర్లు ఉంటారని తల్లిదండ్రులకు  వివరిస్తామని తెలియజేశారు.  తల్లిదండ్రుల ఆశను  ప్రైవేటు విద్యా వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారని,
చదువుల నాణ్యతలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల మధ్య పెద్దగా వ్యత్యాసం లేదని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయని, సంపాదనలో సగానికి పైగా పిల్లల చదువుల కోసమే ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని, ప్రభుత్వ బడి మూతపడితే సమాజానికి నష్టం అని, మన ఊరు - మనబడి, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా మౌళిక వసతుల కల్పన మెరుగైందని తెలియజేశారు. 
ఈ ప్రచార జాతాలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షులు నర్సింలు గౌడ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్ రాములు గౌడ్  యుటిఎఫ్ జిల్లా నాయకులు ముత్తెప్ప, శివరాజ్ , రత్నం,జమున, సుశీలమ్మ, యుటిఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు కామ్రేడ్ గౌరారం గోపాల్ ఎండి అలీముద్దీన్, గుంజ వెంకటయ్య తదితరులు పాల్గోన్నారు.

కామెంట్‌లు