‘ధర్మం’ అంటే ఏమిటి?:- సేకరణ:- డా.గౌరవరాజు సతీష్ కుమార్

 ఇది చాల క్లిష్టమైన ప్రశ్న! వెంటనే వివరించి చెప్పడానికి కుదరని గంభీరమైన ప్రశ్న!  ఎందుకంటే ధర్మం అనే రెండక్షరాల శబ్దానికి చాల లోతువుంది. చాలా సంక్లిష్టత ఉంది. చాలా నిగూఢత ఉంది. చాలా విశాలత ఉంది.
‘ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతమ్’
ధర్మాలన్నియు సాక్షాత్తూ పరమాత్ముని నుండి లభించాయి.
ధరించునదిగాబట్టి ధర్మము అని ధర్మ శబ్దానికి ఉత్పత్తి అర్థము. (ధృ – ధారణే). ధర్మము నిత్యసత్యమై వుండేదైనా దేశకాల ప్రాంతాదుల ననుసరించి ధర్మం మారుతుంటుంది.
ధర్మము అనేది సామాన్యధర్మం, విశేషధర్మం అని రెండు రకాలుగా ఉంటుంది.
శ్లో||ధృతిః క్షమా దమో స్తేయం, శౌచమింద్రియ నిగ్రహః|
హ్రీర్విద్యాసత్య మక్రోధః ఏతత్ ధర్మస్త్య లక్షణమ్||
“ధృతి – క్షమ – దమం – అస్తేయం – శౌచం – ఇంద్రియ నిగ్రహం – హ్రీః (సిగ్గు) – విద్య – సత్యం – అక్రోధం”, ఈ పది లక్షణాలు కలిగియున్న ధర్మమని శాస్త్రం చెబుతోంది. అంటే;
1. మానవుడు ఏదైనా పని ప్రారంభిస్తాడు. తనకు సంబంధించినది కానివ్వండి, కుటుంబానికి సంబంధించినది కానివ్వండి, సమాజానికి సంబంధించినది కానివ్వండి! ప్రారంభించేటపుడు ఏ సమస్యలు ఉండవు. కాని ప్రారంభించిన కొన్ని రోజులకే నూటొక్క సమస్యలు ప్రారంభమవుతాయి. కువిర్శలు ప్రారంభమౌతాయి. ఎన్నెన్నో అడ్డంకులు కలిగి నిరాశ కల్గుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆత్మబలంతో అకుంఠిత దీక్షతో ‘ధృతి’ చెడకుండా ముందుకి సాగిపోవాలి. ‘ఇది ధర్మం’.
2. మనిషి ఏ విషయంలోనైనా, ఏ పనిలోనైనా ఓర్పు కలిగి వుండాలి. క్షమాగుణంతో ఉండాలి. ప్రతిదానినీ ప్రతివారినీ, ప్రతి విషయాన్నీ, క్షమాశక్తితో ఎదుర్కోవాలి. కోపగించుకోకూడదు. ఓర్పుగుణం వున్నవారిని ఏ శక్తులూ ఏమీ చేయలేవు. ‘ఇది ధర్మం’.
3. మనం ఒక పని చేసేటపుడు మన మనస్సు సంపూర్ణంగా ఆ విషయంలోనే లగ్నం కావాలి. ఒక పనిచేస్తూ మరొక దానిని గురించి ఆలోచించకూడదు. ఏ విషయంలోనైనా ముఖ్యంగా చదువుతున్నా, వింటున్నా, పని చేస్తున్నా, మాట్లాడుతున్నా, మనస్సును పరిపరిమార్గాలకు పోనివ్వకుండా వుండాలి. ‘ఇది ధర్మం’.
4. తనకు తెలియని విషయాలను తాను తెలిసికొనక, పెద్దలు, పూర్వులు, చెప్పినదానిని అంగీకరించక, స్వతంత్ర నిర్ణయం తీసుకొనలేక, నిస్తేజంగా నిర్వికారంగా, నిరాశగా, నిర్లిప్తతగా, నియమ రహితుడుగా ఉండకూడదు. ‘ఇది ధర్మం’.
5. మనిషి ఎల్లపుడూ మనస్సునూ, శరీరాన్నీ, మాటనూ ఆలోచననూ, సంసారాన్నీ, ఇంటినీ, పరిసరాల్నీ, ధరించే వస్త్రాలనూ పరిశుభ్రంగా శుచిగా వుంచుకోవాలి. ‘ఇది ధర్మం’.
6. చదువువున్నా, సంపదలున్నా, కీర్తివున్నా, బలంవున్నా ఇంద్రియ నిగ్రహం లేనివానికి ఏదో ఒకరోజు పతనం తప్పదు. కాబట్టి మనస్సును దాని ఇష్టానికి దానిని వదలివేయకుండా మన చెప్పుచేతల్లో ఉంచుకోవాలి. ‘మనస్సును గెలిచినవాడు దేవేంద్రుడినైనా గెలుస్తాడు’ అని పెద్దల మాట.మనస్సును తమ చెప్పుచేతల్లో ఎవరుంచుకొంటారో వారిని భూతప్రేతాలుగాని, దెయ్యాలు గాని, యక్ష కిన్నెర కిమ్పురుశులుగాని, గ్రహాలు గాని, రోగాలు గాని, కష్టసుఖాలుగానీ, మరణంగానీ, వశంలో వుంటాయి. కాబట్టి మనస్సును, మాటను, దృష్టిని, శరీరాన్నీ, చేతలనూ అదుపుచేయాలి. ‘ఇది ధర్మం’.
7. ప్రతి విషయానికీ సంకోచపడటం, సిగ్గుపడటం, అనుమానపడటం, తనను తాను తక్కువగా భావించటం కూడదు. ‘ఇది ధర్మం’.
8. మనిషి సత్యవ్రతం కలిగిఉండాలి. అకారణంగా, అనవసరంగా, ఒకరి మెప్పుకోసం, తన పనిని సాధించుకోవటం కోసం, తాను ఏ విధంగానైనా ప్రయోజనం పొందటంకోసం, తనవారిని తృప్తిపెట్టడంకోసం అబద్దాలు చెప్పకూడదు. అబద్ధం అల్పసుఖాన్ని మాత్రమే కల్గిస్తుంది. అబద్ధం మరొకనాటికి అవమానం పాలు చేస్తుంది. అబద్ధం మనిషి విలువను మట్టిచేస్తుంది. మన శక్తినీ, మనకీర్తినీ, మన గొప్పదనాన్నీ పాతాళానికి త్రొక్కివేస్తుంది. కాబట్టి సాధ్యమైనంతవరకూ సత్యధర్మాన్ని వదలకూడదు. ‘ఇది ధర్మం’.
9. మానవునికి ఆహారం ఎంత ముఖ్యమో, వివేకం కూడ అంతే ముఖ్యం. వివేకవంతుడు కావాలంటే విద్యావంతుడు కావాలి. శాస్త్రాలు, పురాణాలు ఇతిహాసాలు విన్నంత మాత్రాననే వివేకం సిద్ధించదు. విన్న విషయాలను స్వానుభవానికి మళ్ళించుకోవాలంటే మనిషికి విద్య కావాలి. ‘విద్యావిహీనః పశుః’ అని ఆర్యవాణి. మనిషిగా పుట్టి మట్టిబొమ్మగా జీవితం గడపకూడదు. ఎంతటి పేదతనం పెనవేసుకొనివున్నా, స్థితిగతులు ఎంతటి బాధాకరమై వున్నా, భిక్షమెత్తి అయినా చదువుకోవాలి అని ఋషివాక్యం. విద్య ప్రతి వ్యక్తికీ నిర్బంధంగా ఉండాలి. ‘ఇది ధర్మం’.
10. పగ, హింస, కోపం, ప్రతీకార మనస్తత్వం ఇవన్నీ మనిషిని  పతనావస్థకు నెడతాయి. పగ, ప్రతీకారాలు మనిషిని అశాంతికి గురిచేసి అనారోగ్యాన్ని కల్గిస్తాయి. తన అభివృద్ధికి తానే ఆటంకంగా నిలవాల్సివస్తుంది. తనను కన్నవారికీ, తాను జన్మనిచ్చిన వారికీ, తనను నమ్మి బ్రతికేవారికీ అన్యాయం కల్గుతుంది.
అకారణంగా సాటి ప్రాణుల్ని హింసించడం, ఆహారం తింటూవున్న ప్రాణుల్ని, నీరు త్రాగుతున్న ప్రాణుల్ని, ఆడమగ కలుస్తున్న జంటల్ని హింసించడం, భయపెట్టడం, రాళ్ళతో కర్రతో హింసించడం, తన దారిన తాను వెళుతున్న ప్రాణుల్ని భయపెట్టి పరుగెత్తించడం మంచిది కాదు.‘ఇది ధర్మం’.
కోపాన్ని జయించితే మనుష్యుల్ని జయించవచ్చు. సమస్యల్ని అధిగమించవచ్చు. కోపం ఎప్పుడూ మనకే నష్టాన్ని కల్గించి ఎదుటివారికి లాభాన్ని కల్గిస్తుంది. కోపం ఆత్మీయుల్ని దూరం చేస్తుంది. కోపం భవిష్యత్తును ఛిద్రం చేస్తుంది. కోపం జీవితాన్ని పతనం చేస్తుంది. కోపాన్ని అదుపులో ఎల్లపుడూ వుంచుకోవాలి. ‘ఇది ధర్మం’.
వీటినే ధర్మంగా గుర్తించారు పెద్దలు.
—------------------------------------------

కామెంట్‌లు